Health News: ఏ తిండీ.. నమ్మలేమండి!

రోడ్డు పక్కన మిర్చీ బండి.. ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రం.. నక్షత్రాల హోటల్‌.. స్థాయి ఏదైనా వాటిలో లభించే ఆహార పదార్థాల్లో ఏదో ఒక రూపంలో కల్తీ జరుగుతోందని రాష్ట్ర ఆహార పరిరక్షణ సంస్థ నిర్వహిస్తున్న తనిఖీల్లో వెల్లడవుతోంది.

Updated : 13 Oct 2022 08:46 IST

వెన్న, నెయ్యి, పాల ఉత్పత్తుల్లో 26 శాతం నాసిరకం

హోటల్‌ తిండిలో 22% హానికరమే

పండ్లు, నూనెలు, పప్పుల్లోనూ ప్రమాణాలు లోపభూయిష్టం

ఆహార పరిరక్షణ నమూనాల్లో వెల్లడైన వాస్తవాలు

అయితరాజు రంగారావు

ఈనాడు, హైదరాబాద్‌

* పేరున్న రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారా? అది రుచికరంగా ఉండేందుకు కొన్ని రసాయనాలు కలిపి ఉండొచ్చు!

* ఐస్‌క్రీమ్‌ను చూడగానే తినకుండా ఉండలేకపోతున్నారా? ఆ పాల ఉత్పత్తుల్లో హానికారక పదార్థాలు దాగి ఉండొచ్చు!

* రోడ్డు పక్కన బండిలో వేగుతున్న మిర్చీ బజ్జీలను చూడగానే నోరూరుతోందా? జాగ్రత్త.. ఆ నూనె నాణ్యత ప్రశ్నార్థకమే!

..ఇవి అనుమానాలు కాదు. రాష్ట్ర ఆహార పరిరక్షణాధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన వాస్తవాలు.

రోడ్డు పక్కన మిర్చీ బండి.. ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రం.. నక్షత్రాల హోటల్‌.. స్థాయి ఏదైనా వాటిలో లభించే ఆహార పదార్థాల్లో ఏదో ఒక రూపంలో కల్తీ జరుగుతోందని రాష్ట్ర ఆహార పరిరక్షణ సంస్థ నిర్వహిస్తున్న తనిఖీల్లో వెల్లడవుతోంది. టీ పొడి, పాలు, పండ్లు, పప్పులు, సాస్‌లు, చక్కెరతో చేసే మిఠాయిలు, నూనె, కారంపొడి, బేకరీ ఉత్పత్తులు, నిల్వ, తీపి పదార్థాలు, హోటళ్లలో తయారు చేసిన ఆహారాల వరకూ అన్నింటిలోనూ నాణ్యత ప్రమాణాలు లోపించాయని పరీక్షల్లో తేలింది. తెలంగాణ ఆహార పరిరక్షణాధికారులు ఏప్రిల్‌-2021 నుంచి మార్చి-2022 వరకు 4,343 వేర్వేరు నమూనాలను సేకరించి, పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 383 (8.8శాతం) పదార్థాలు హానికరం, నాసిరకం, నకిలీవని వెల్లడైంది. వీటిలో 2 శాతం నమూనాలను హానికరమైనవిగా గుర్తించారు. నాణ్యత ప్రమాణాలు పాటించని ఆహారాలను తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అప్పటికప్పుడు కనిపించే జీర్ణకోశ సమస్యలే కాకుండా.. దీర్ఘకాలంలో క్యాన్సర్‌ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారినపడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సిబ్బంది కొరతే అసలు కారణం
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం.. గ్రామీణ ప్రాంతంలో ప్రతి లక్ష మంది జనాభాకు ఒక ఆహార పరిరక్షణాధికారి, పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రతి 50 వేల జనాభాకు ఒక అధికారి ఉండాలి. అయితే రాష్ట్రంలో ‘ఆహార పరిరక్షణాధికారుల (ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌) పోస్టులు 52 శాతం ఖాళీగా ఉన్నాయి. దీంతో ఎప్పటికప్పుడు నిర్వహించాల్సిన నమూనాల సేకరణ, ప్రయోగశాలల్లో పరీక్షలు, నిత్యం పర్యవేక్షణ తదితర ప్రక్రియలు తూతూమంత్రంగా కొనసాగుతున్నాయనే విమర్శలున్నాయి. ఇటీవల రాష్ట్రాల వారీగా 2020-21 సంవత్సరానికి ఆహార పరిరక్షణ సూచికలను భారత ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) విడుదల చేయగా.. ఇందులో మానవ వనరులు, సమాచార సేకరణ కేటగిరీలో తెలంగాణకు 20 మార్కులకు గాను 9 మాత్రమే వచ్చాయి. కనీసం జిల్లాకొక ఆహార పరిరక్షణాధికారి కూడా లేరు. ఇటీవలే జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 22 మందిని తీసుకోగా.. మిగిలిన జిల్లాలన్నింటికీ కలిపి కేవలం 14 మందిని నియమించారు. అయినప్పటికీ జీహెచ్‌ఎంసీలో మొత్తం 30 పోస్టులకు 8 ఖాళీలుండగా..32 జిల్లాల్లో 51 ఆహార పరిరక్షణాధికారుల పోస్టులకు గాను 37 ఖాళీగా ఉన్నాయి. కొత్తగా మరో 24 మందిని నియమించడానికి ప్రభుత్వం అనుమతించినా.. ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ఎన్ని నమూనాలు తీశారు? ఎన్నింటిని ల్యాబ్‌లకు పంపించారు? అనే అంశాలనూ మార్కుల కేటాయింపులో పరిగణనలోకి తీసుకుంటారు. అయితే మానవ వనరుల కొరత కారణంగా ఆ వేగం మందగించింది. ఈ అంశంలో 30 మార్కులకు గాను 11 మార్కులు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి.


ఇవీ నిబంధనలు..

* రోడ్డు పక్కన మిర్చీ బజ్జీలు విక్రయించే బండ్లు మొదలుకొని ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలు, నిల్వ ఆహార ఉత్పత్తులు, రెస్టారెంట్ల వరకూ అన్ని స్థాయుల్లోనూ ఆహార పరిరక్షణ అధికారులు క్రమం తప్పకుండా ఆహార నమూనాలను సేకరించి, వాటిని పరీక్షల కోసం పంపించాలి.

* ప్రమాణాలు లేనివి మూడు రకాలు:  1. హానికరం 2. నకిలీ (మిస్‌ బ్రాండెడ్‌) 3. నాసిరకం. ఈ మూడింటిపై కేసు నమోదు చేస్తారు.


హానికరం..నాణ్యత లోపం..నకిలీ ఇలా..

* వెన్న, నెయ్యి, ఐస్‌క్రీములు, ఇతర పాల ఉత్పత్తుల్లో 26.31 శాతం
* మాల్స్‌లో విక్రయించే నిల్వ పచ్చళ్లు, హోటళ్లలోని ఆహారాల్లో 22 శాతం 

* మిఠాయిలకు వినియోగించే పదార్థాల్లో 12.10 శాతం 

* పండ్లు, కూరగాయల ఉత్పత్తులు (ఉదా।। జామ్‌, జెల్లీస్‌) తదితరాల్లో 10.05 శాతం  
* కేకులు, బిస్కెట్లు, బన్నులు, పఫ్‌లు, సమోసాలు, తదితర బేకరీ ఉత్పత్తుల్లో 9.5 శాతం 

* టీ, కాఫీ, కోకో, చికోరీ తదితర పొడుల్లో 8.73 శాతం  
* పాలల్లో 8.23 శాతం

* చిప్స్‌ లాంటి నిల్వ పదార్థాల్లో 8 శాతం
* వంటల్లో వాడే నూనెలు, వనస్పతిలలో 7 శాతం
* ఉప్పులో 4.48 శాతం

* గింజధాన్యాలు, వాటి ఉత్పత్తుల్లో 2 శాతం  
* సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసుల్లో 1.36 శాతం
* వీటికి సంబంధించిన పొడుల్లో 5.21 శాతం 

* సుపారీ, పాన్‌ మసాలా, గుట్కా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం కాగా.. ఈ ఉత్పత్తుల్లో 14.34 శాతం మరింత హానికరమైనవి ఉన్నట్లు గుర్తించారు.


అమెరికాలో ఇలా..

* అమెరికా ప్రభుత్వం ఆహార కోడ్‌ (కచ్చితమైన ప్రమాణాలు), పరిశుభ్రమైన, ప్రమాణాలతో కూడిన ఆహారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది.

* ప్రతి రాష్ట్రంలో అక్కడి జనాభా మేరకు కనీసం రెండు నుంచి నాలుగు వరకు అత్యాధునిక ప్రయోగశాలలున్నాయి. హోటళ్లలో కలుషితానికి అక్కడి మేనేజర్లను బాధ్యులుగా చేస్తారు. ప్రమాణాల మేరకు ఆహారం లేకుంటే కఠినంగా శిక్షిస్తారు.

* తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు మాంసాహారం, శాకాహార నమూనాలను తీసుకుని.. అందులో ఈ-కొలి బ్యాక్టీరియా, పరిమితికి మించిన లవణ లోహాలను పరీక్షిస్తారు.

* ఆహారాన్ని నిల్వ చేసేందుకు ఉపయోగించే ఐస్‌ను తాగునీటితో తయారు చేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని