Group-1: కఠినంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌!

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తొలి గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన పరీక్షకు మొత్తం అభ్యర్థుల్లో 75 శాతం మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,019 కేంద్రాలు ఏర్పాటుచేశారు.

Updated : 17 Oct 2022 07:31 IST

సివిల్స్‌ స్థాయిలో ప్రశ్నలు వచ్చాయంటున్న నిపుణులు

కరెంట్‌ అఫైర్స్‌, సైన్స్‌, రీజనింగ్‌పై ఎక్కువ ప్రశ్నలు

పరీక్షకు 75% అభ్యర్థుల హాజరు

ఓఎంఆర్‌ ఇమేజింగ్‌ తరువాత కీ విడుదల

ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తొలి గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన పరీక్షకు మొత్తం అభ్యర్థుల్లో 75 శాతం మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,019 కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 3.80 లక్షల మంది అభ్యర్థులకు గాను 3.42 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వీరిలో 2.86 లక్షల మంది పరీక్ష రాశారు. టీఎస్‌పీఎస్సీ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ద్వారా ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌ పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు. ఓఎంఆర్‌ ఇమేజింగ్‌ పూర్తయిన తరువాత ప్రాథమిక కీని విడుదల చేస్తామని.. ఇందుకు కనీసం ఎనిమిది రోజుల సమయం పడుతుందని కమిషన్‌ తెలిపింది. ప్రాథమిక కీని వెబ్‌సైట్లో పొందుపరచనున్నట్లు పేర్కొంది. కాగా, పరీక్షలో ప్రశ్నలు కఠినంగా వచ్చాయని పలువురు అభ్యర్థులు, నిపుణులు తెలిపారు.

బయోమెట్రిక్‌ హాజరు..

పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థుల బయోమెట్రిక్‌ హాజరు తీసుకున్నారు. అభ్యర్థి ఫొటో, వేలిముద్ర తీసుకుని పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. కొన్నిచోట్ల చివరి నిమిషంలో పెద్దసంఖ్యలో అభ్యర్థులు రావడంతో వారందర్నీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించి, ఆ తర్వాత బయోమెట్రిక్‌ నమోదు చేశారు.కొన్నిచోట్ల పరీక్ష ముగిసిన తరువాత తీసుకున్నారు.

* ఖమ్మంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఆదివారం ఉదయం విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో మొబైల్‌ఫోన్‌ లైట్ల వెలుతురులో సిబ్బంది బార్‌కోడ్‌ స్కానింగ్‌, అభ్యర్థుల ఫొటోలు, వేలిముద్రలు తీసుకున్నారు.

సివిల్స్‌ స్థాయిలో ప్రశ్నపత్రం...

ఒడిశాలోని కోడింగమాలి ఏ ఖనిజానికి ప్రసిద్ధి?.. తెలంగాణకు చెందిన డాక్టర్‌ కేశవులు ఎవరు? ఇస్టాలో బాధ్యతలు ఏమిటి?.. అండమాన్‌, నికోబార్‌లో పర్వత శిఖరాలు ఏవి?.. గ్రూప్‌-1లోని కొన్ని ప్రశ్నలివి.
ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు కఠినంగా వచ్చాయని.. విశ్లేషణాత్మక, స్టేట్‌మెంట్‌ ఆధారిత, సుదీర్ఘ విశ్లేషణలతో కూడినవి ఎక్కువగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు తెలిపారు. వాటిని చదివి, అర్థం చేసుకుని సమాధానాలు గుర్తించేందుకు సమయం సరిపోలేదని పేర్కొన్నారు. ప్రిలిమ్స్‌ ప్రశ్నల కాఠిన్యత, అడిగిన తీరు సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష స్థాయికి మించి ఉందని నిపుణులు చెబుతున్నారు. కరెంట్‌ అఫైర్స్‌, సైన్స్‌, టెక్నాలజీ, మెంటల్‌ ఎబిలిటీ, లాజికల్‌ థింకింగ్‌ కేటగిరీ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. సమాధానాలు గుర్తించేందుకు ఒక్కో ప్రశ్నకు ఒక్కో నిమిషం చొప్పున సమయం ఉన్నప్పటికీ.. ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు వచ్చాయి. నేరుగా సమాధానాలను గుర్తించే ప్రశ్నలు స్వల్ప సంఖ్యలో ఉన్నాయి. ప్రశ్నలను పూర్తిగా చదివే సమయం దొరకలేదని, సగటున 15-20 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించలేకపోయినట్లు కొందరు అభ్యర్థులు తెలిపారు. ప్రిలిమ్స్‌ కఠినంగా ఉండటంతో కటాఫ్‌ మార్కులు తక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. కొన్ని శిక్షణ సంస్థలు మార్కులపై సొంతగా అంచనాలు వేసుకుంటున్నాయి. ‘‘ఎక్కువ సమయం తీసుకునేలా, కఠినంగా ప్రశ్నలు ఉన్నాయి. అందుకే కటాఫ్‌ 75-85 మధ్యలో ఉంటుందని అంచనా. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు కలిపి సన్నద్ధమైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది అర్హత సాధించే అవకాశాలున్నాయి’’ అని లా ఎక్స్‌లెన్స్‌ డైరెక్టర్‌ రాంబాబు తెలిపారు.


స్క్రైబ్‌ వివరాలు రాలేదని అభ్యర్థిని అనుమతించని సిబ్బంది

కందనూలు, న్యూస్‌టుడే: నాగర్‌కర్నూల్‌లో ఓ దివ్యాంగ అభ్యర్థి పరీక్ష రాయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. అచ్చంపేటకు చెందిన పవన్‌కుమార్‌కు కంటిచూపు లోపం ఉంది. పరీక్ష రాసేందుకు సహాయకుడి(స్క్రైబ్‌) కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకున్నారు. తమకు సహాయకుడి వివరాలు రాలేదంటూ ఆయనను పరీక్ష కేంద్రం సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఆన్‌లైన్‌లో కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు పవన్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని