Secundrabad Railway Station: విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌

దక్షిణమధ్య రైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్‌లోని రైల్వేస్టేషన్‌ ఇక విమానాశ్రయాన్ని తలపించేలా..అంతర్జాతీయ ప్రమాణాలు, వసతులతో అత్యాధునికంగా రూపుదిద్దుకోనుంది.

Updated : 27 Oct 2022 08:33 IST

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణమధ్య రైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్‌లోని రైల్వేస్టేషన్‌ ఇక విమానాశ్రయాన్ని తలపించేలా..అంతర్జాతీయ ప్రమాణాలు, వసతులతో అత్యాధునికంగా రూపుదిద్దుకోనుంది. ఇందుకుగాను రూ.726 కోట్లతో పనులు చేపట్టడానికి రంగం సిద్ధమైంది. ఈమేరకు రైల్వేశాఖ టెండర్లు పిలవగా 8 సంస్థలు పోటీపడ్డాయి. దిల్లీకి చెందిన గిరిధర్‌లాల్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రై.లిమిటెడ్‌ సంస్థ పనులను దక్కించుకుంది. 36 నెలల్లో పనులను పూర్తిచేయాలని రైల్వేఅధికారులు ఆ సంస్థకు స్పష్టం చేశారు. దేశంలోనే ప్రధానమైన రైల్వేస్టేషన్లలో ఒకటిగా సికింద్రాబాద్‌ గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచి నిత్యం సగటున 200 రైళ్లను నడుపుతున్నారు. 1.80 లక్షలమంది ప్రయాణిస్తున్నారు. నాన్‌ సబర్బన్‌ గ్రేడ్‌-1 విభాగంలో ఈ స్టేషన్‌ ఉంది. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే ప్రయాణికుల్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఆధునిక సౌకర్యాలు కల్పించేలా దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక రూపొందించింది. స్టేషన్‌ని ఏవిధంగా అభివృద్ధి చేయాలన్న అంశంపై దక్షిణ మధ్య రైల్వే నమూనా డిజైన్లు ఇచ్చింది. గుత్తేదారు సంస్థకూడా కొత్తడిజైన్‌ను రూపొందించిుర్పించనుంది.

అందుబాటులోకి వచ్చే వసతులివే..
* రైల్వేస్టేషన్‌కు ఉత్తరం వైపు 5 అంతస్తుల్లో మల్టీలెవల్‌ పార్కింగ్‌. దక్షిణదిశలో భూగర్భ పార్కింగ్‌.

* ఉత్తర (22,516 చదరపు మీటర్లు), దక్షిణ (14,792 చ.మీ.లు) దిశల్లో ‘జీ+3’ అంతస్తులతో భవనాలు.

* 108 మీటర్ల ఎత్తుతో రెండంతస్తుల ‘స్కై కాన్‌కోర్స్‌’ నిర్మాణం. మొదటి అంతస్తును ప్రయాణికుల కోసం.. రెండోది ఫ్లోర్‌ రూప్‌టాప్‌ ప్లాజాగాను రూపొందిస్తారు.

* ప్రస్తుతం సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ట్రాక్‌లపై ఎలాంటి నిర్మాణాలు లేవు. తాజా ప్రణాళిక ప్రకారం కింద రైల్వే ట్రాక్‌లు ఉంటే.. వాటిపైన భవనం ఉంటుంది.

* ఉత్తర, దక్షిణ భవనాలకు రెండు వైపులా ట్రావెలేటర్‌తో పాటు రెండు నడక మార్గాలు (7.5 మీటర్లు). నేలపై ఉండే వీటిమీద నిల్చుంటే చాలు.. ముందుకు తీసుకెళతాయి.

* పక్కనే ఉన్న మెట్రోస్టేషన్‌తో అనుసంధానం. రైలు దిగిన ప్రయాణికులు ఎస్కలేటర్‌ ద్వారా వెళ్లేలా ఏర్పాట్లు.

* 5,000 కిలోవాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్‌ ఏర్పాటు.

* రైల్వే స్టేషన్‌లోకి వచ్చేందుకు, బయటకు వెళ్లేందుకు వేర్వేరుగా బ్లాక్‌ల నిర్మాణం. ప్రయాణికుల్ని తీసుకురావడానికి (డ్రాప్‌), తీసుకెళ్లడానికి (పికప్‌) వేర్వేరు పాయింట్ల ఏర్పాటు.

* స్టేషన్లో ఉన్న 10 ప్లాట్‌ఫారాల ఆధునికీకరణ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని