3 పేర్లు.. 2 పాస్‌పోర్టులు

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తోంది. ప్రధాన నిందితుడు రామచంద్రభారతికి రెండు పాస్‌పోర్టులున్నట్లు వెల్లడి కావడం సంచలనం రేకెత్తిస్తోంది. రామచంద్రభారతి పేరుతో ఒకటి.. భరత్‌కుమార్‌శర్మ పేరుతో మరొకటి ఉన్నట్లు వెల్లడైంది.

Updated : 24 Nov 2022 07:28 IST

భరత్‌కుమార్‌శర్మ పేరుతోనూ రామచంద్రభారతి చలామణి అయినట్లు గుర్తించిన సిట్‌
ల్యాప్‌టాప్‌.. సెల్‌ఫోన్‌ల విశ్లేషణలో బహిర్గతం
అతనిపై మరో కేసు నమోదు

ఈనాడు, హైదరాబాద్‌ - జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తోంది. ప్రధాన నిందితుడు రామచంద్రభారతికి రెండు పాస్‌పోర్టులున్నట్లు వెల్లడి కావడం సంచలనం రేకెత్తిస్తోంది. రామచంద్రభారతి పేరుతో ఒకటి.. భరత్‌కుమార్‌శర్మ పేరుతో మరొకటి ఉన్నట్లు వెల్లడైంది. ఇప్పటికే అతడికి సతీశ్‌శర్మ అనే పేరు కూడా చలామణిలో ఉంది. ఇప్పుడు మూడో పేరు వెలుగులోకి వచ్చింది. అతడికి రెండేసి ఆధార్‌కార్డులు, పాన్‌కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సుల చొప్పున ఉన్నట్లు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 3న కేసు నమోదు కాగా.. తాజాగా సిట్‌ దర్యాప్తులో రెండు పాస్‌పోర్టుల అంశం బయటపడింది. దీనిపై కేసు దర్యాప్తు అధికారి, రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఐపీసీ సెక్షన్‌ 467, 468, 471లతోపాటు 12 ఆఫ్‌ పాస్‌పోర్టు చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

2010లో ఒకటి.. 2019లో మరొకటి..

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో గత నెల 26న తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారన్న అభియోగాలపై అరెస్టయిన రామచంద్రభారతి నుంచి ల్యాప్‌టాప్‌తోపాటు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో డేటాను వెలికితీసేందుకు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి పంపించారు. ఆ నివేదిక ఇటీవలే సిట్‌ బృందానికి అందింది. దాన్ని పరిశీలించగా.. ఒకే ఫొటోతో వేర్వేరు పేర్లు, ఇతర వివరాలతో ఉన్న రెండు పాస్‌పోర్టులు బయటపడ్డాయి.

* ఐఫోన్‌ను విశ్లేషించగా ఒక పాస్‌పోర్టు స్వామీజీ శ్రీ రామచంద్ర పేరుతో ఉన్నట్లు తేలింది. తండ్రి పేరు మహాస్వామి శ్రీ మధ్వ ధర్మదత్‌జీగా ఉంది. కర్ణాటకలోని పుత్తూరు చిరునామాతో ఉన్న ఈ పాస్‌పోర్టులో పుట్టిన తేదీ 12 ఫిబ్రవరి 1979గా ఉంది. ఈ పాస్‌పోర్టు 8 నవంబరు 2019లో జారీ చేసినట్లు ఉంది.

* ల్యాప్‌టాప్‌ సమాచారాన్ని పరిశీలించినప్పుడు.. భరత్‌కుమార్‌ శర్మ పేరుతో మరో పాస్‌పోర్టు ఉన్నట్లు తేలింది. ఇది కర్ణాటకలోని కొడగు చిరునామాతో ఉండగా ఇందులో తండ్రి పేరు శ్రీకృష్ణమూర్తి వెలకుంజ అని ఉన్నట్లు గుర్తించారు. ఇందులో పుట్టిన తేదీ 12 ఫిబ్రవరి 1988గా ఉన్నట్లు గుర్తించారు. ఈ పాస్‌పోర్టు 11 జులై 2010 తేదీతో జారీ అయ్యింది.

* ఒక పాస్‌పోర్టు టీ9633062 నంబరుతో ఉండగా.. మరో పాస్‌పోర్టు టీ9633092 నంబరుతో ఉంది. రెండింటిలోనూ తల్లి పేరు సరస్వతి వెలకుంజ అని పేర్కొన్నారు.

పాస్‌పోర్టు అధికారులకు లేఖ

రెండు పాస్‌పోర్టుల్లో భరత్‌కుమార్‌శర్మ పేరుతో ఉంది ఫోర్జరీది కావచ్చన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఎవరి పేరుతోనో ఉన్న పాస్‌పోర్టులో మొదటిపేజీని మార్ఫింగ్‌ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆయా నంబర్ల ఆధారంగా అవి ఎవరివో తెలుసుకునేందుకు పాస్‌పోర్టు అధికారులకు పోలీసులు లేఖ రాయనున్నారు. రెండూ రామచంద్రభారతివే అయితే.. స్టాంపింగ్‌లను సైతం పరిశీలించనున్నారు. ఈ రెండు పాస్‌పోర్టుల్లోని వివరాల ఆధారంగా అతడు ఎక్కడెక్కడికి ప్రయాణించాడనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని