స్కై‘రూటు’లో త్వరలో సమీకృత రాకెట్‌ తయారీ కేంద్రం

దేశంలో తొలిసారిగా తెలంగాణలో సమీకృత రాకెట్‌ ఆకృతి(డిజైన్‌), తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు.

Published : 26 Nov 2022 03:46 IST

అభినందన సభలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో తొలిసారిగా తెలంగాణలో సమీకృత రాకెట్‌ ఆకృతి(డిజైన్‌), తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. రాష్ట్రానికి చెందిన స్కైరూట్‌ సంస్థ స్థాపించనున్న ఈ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. దేశ అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించిన సంస్థకు హైదరాబాద్‌ వేదిక కావడం గర్వంగా ఉందన్నారు. ఇక్కడే రాకెట్‌ను రూపొందించడంతో పాటు తొలి ప్రయత్నంలోనే దానిని విజయవంతంగా ప్రయోగించిన స్కైరూట్‌ సంస్థ దేశం గర్వించేలా చేసిందన్నారు. ఈ స్ఫూర్తితో హైదరాబాద్‌ అంతరిక్ష సాంకేతికతకు రాజధానిగా మారుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అంతరిక్ష సాంకేతిక(స్పేస్‌టెక్‌) విధానంతో తెలంగాణలో రాకెట్ల తయారీతో పాటు  ప్రయోగాలకూ అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. స్కైరూట్‌ మాదిరే హైదరాబాద్‌ కేంద్రంగా మరో అంకుర సంస్థ ధృవ కూడా త్వరలోనే ఉపగ్రహ ప్రయోగం చేసి, రాష్ట్ర ఘనతను చాటనుందని తెలిపారు. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అభినందన సభ శుక్రవారం టీహబ్‌లో జరిగింది. మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరు కాగా పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, స్కైరూట్‌ సహవ్యవస్థాపకులు పవన్‌కుమార్‌ చందన, నాగభరత్‌ డాక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ కేంద్రంగా ఎదిగిన స్కైరూట్‌ అంతరిక్షంలో తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా రాకెట్‌ను ప్రయోగించింది. భవిష్యత్తులోనూ ఈ సంస్థ మరింతగా దూసుకెళ్లనుంది. తొలి ప్రయోగం విజయవంతం కావడంతో తెలంగాణలో సమీకృత రాకెట్‌ డిజైన్‌, తయారీ, పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయం. ఆ సంస్థ భవిష్యత్‌ ప్రణాళిక అమలుకు సహకరిస్తాం. స్కైరూట్‌ విజయంతో హైదరాబాద్‌, టీహబ్‌ పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగాయి..  స్కైరూట్‌ సంస్థ ప్రతినిధుల సమష్టికృషితోనే ఇది సాధ్యమైంది. రాకెట్‌ తయారీ అంటేనే పెట్టుబడిదారులు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. స్కైరూట్‌ విజయంతో ఈ ధోరణి మారి, పెట్టుబడులు వెల్లువెత్తుతాయి. స్కైరూట్‌ విజయం అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది. బాలలకు చిన్నతనం నుంచే అంతరిక్ష ప్రయోగాలపై అవగాహన కల్పించాలి’’ అని కేటీఆర్‌ సూచించారు.

తెలంగాణ సర్కారు అండతో... స్కైరూట్‌

పవన్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రభుత్వంతో పాటు అంతరిక్ష రంగానికి సంబంధించిన విభిన్న రంగాలకు అవసరమైన నిపుణుల అందుబాటు, పర్యావరణ వ్యవస్థ వల్లనే మా విక్రం-ఎస్‌ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. 2018లో ప్రారంభించిన సంస్థ నాలుగేళ్లలోనే రాకెట్‌ను సిద్ధం చేసింది. ఒక అద్భుత ఆలోచనకు ఊతమిచ్చేలా టీ హబ్‌, టీవర్క్స్‌ పనిచేస్తున్నాయి. స్కైరూట్‌ ప్రస్థానంలో ఈ రెండింటి పాత్ర మరువలేనిది. మాకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు. 200 మంది స్కైరూట్‌ ఉద్యోగుల కష్టం ఫలించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. హైదరాబాద్‌ కేంద్రంగా మా సంస్థను విస్తరిస్తాం’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని