సోయా ‘పంట పండింది’

రాష్ట్రంలో సోయాచిక్కుడు సాగుకు తోడ్పాటు అందించేందుకు ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేసిన ప్రయోగం సత్ఫలితాలనిచ్చింది.

Published : 29 Nov 2022 04:15 IST

ఫలించిన జయశంకర్‌ వర్సిటీ ప్రయోగం
కొత్త వంగడంతో దిగుబడులు బాగు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోయాచిక్కుడు సాగుకు తోడ్పాటు అందించేందుకు ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేసిన ప్రయోగం సత్ఫలితాలనిచ్చింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో భారీగా డిమాండ్‌ పెరిగిన సోయా సాగుకు అధిక దిగుబడినిచ్చే స్థానిక వంగడాల కొరత అధికంగా ఉంది. దీంతో విత్తనాల కోసం మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర ప్రైవేటు కంపెనీలపై తెలంగాణ రైతులు ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో అధిక దిగుబడినిచ్చే వంగడాన్ని వర్సిటీ అభివృద్ధి చేసి.. ఈ వానాకాలంలో రైతులకు ఆ విత్తన సంచులను ఇచ్చి సాగు చేయించింది. ఈమేరకు పండించిన పంట ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల మేర దిగుబడి వచ్చినట్లు వర్సిటీ పరిశోధనల్లో గుర్తించారు. ఇంతవరకు తెలంగాణలో సోయా అత్యధిక సగటు ఉత్పాదకత ఎకరాకు 7.32 క్వింటాళ్లు (2019-20లో) మాత్రమే. ఈ ఏడాది కూడా సగటు 6.67 క్వింటాళ్లుగానే అర్థ, గణాంకశాఖ ముందస్తు అంచనాల్లో వెల్లడించింది. ప్రపంచ సగటు ఉత్పాదకత ఎకరాకు 11.27 క్వింటాళ్లు. ఈ నేపథ్యంలో అభివృద్ధి చేసిన విత్తనాలను ఎంపిక చేసిన కొందరు రైతులకు అందించి సాగు చేయించినట్లు వర్సిటీ పరిశోధనా సంచాలకుడు డాక్టర్‌ జగదీశ్వర్‌ ‘ఈనాడు’కు వివరించారు.‘ఆదిలాబాద్‌ సోయాబీన్‌ (ఏఎస్‌బీ)-15’ పేరుతో విత్తన సంచులను రైతులకు ఇచ్చి సాధారణ పద్ధతులతోనే సాగు చేయించారు. ఈ కొత్త విత్తనాలను వర్సిటీ ప్రయోగక్షేత్రాల్లో సాగుచేసినప్పుడు ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి రాగా.. రైతుల పొలాల్లో సగటున 10 క్వింటాళ్ల మేర వచ్చింది. ఈ పంట 100 కేజీల గింజలను గానుగాడితే 17.3 కేజీల వంటనూనె రావడం విశేషం. అదే పాత వంగడాలకు సంబంధించి 100 కేజీలకు గాను 11-16 కేజీల మేర మాత్రమే నూనె లభిస్తోంది. పైగా ఈ కొత్త గింజల్లో ‘ప్రోటీన్లు’ రికార్డుస్థాయిలో 44.2% ఉన్నాయి. నూనె తీసిన తర్వాత వచ్చే వ్యర్థాల చెక్కను కోళ్ల, పశు దాణాకు అధికంగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం టన్ను సోయావ్యర్థాల చెక్క ధర రూ.50 వేలకు పైగా పలుకుతోంది. అనేక విధాలుగా వినియోగిస్తున్న ఈ పంటకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గడం లేదని మార్కెటింగ్‌ శాఖ అధికారులు తెలిపారు.

మన పంటకు మంచి డిమాండ్‌..

దేశంలో సోయా జన్యుమార్పిడి (జీఎం) విత్తనాలతో సాగుకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. సాధారణ దేశీయ వంగడాలతోనే రైతులు సాగుచేస్తున్నారు. అమెరికా తదితర దేశాల్లో జీఎం విత్తనాలతో సాగుచేస్తున్నందున, మనదేశం నుంచి పంట కొనడానికి ఐరోపా సహా పలు దేశాల వ్యాపారులు పోటీపడుతున్నారు. ఈ ఏడాది సోయాకు క్వింటాలుకు రూ.4,300 చొప్పున మద్దతుధరను కేంద్రం నిర్ణయించింది. అయితే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ధర బాగున్నందున ప్రైవేటు వ్యాపారులే అంతకన్నా ఎక్కువ చెల్లించి రైతుల నుంచి కొంటున్నారు.

* తెలంగాణలో ఈ ఏడాది 4.30 లక్షల ఎకరాల్లో ఈ పంటను సాగుచేయగా 2.87 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఎకరాకు పెట్టుబడి కింద రైతుకు రూ.20 వేల దాకా ఖర్చవుతుండగా.. సగటున రూ.15 వేలకు పైగా లాభం వస్తున్నట్లు వర్సిటీ పరిశీలనలో తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని