100 రోజుల్లో.. 1.5 కోట్ల మందికి పరీక్షలు

కంటివెలుగు కార్యక్రమ లక్ష్యం 100 పనిదినాల్లో చేరుకునేలా కృషి చేయాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

Published : 30 Nov 2022 05:06 IST

కంటివెలుగు కార్యక్రమం లక్ష్యమిదే..
వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: కంటివెలుగు కార్యక్రమ లక్ష్యం 100 పనిదినాల్లో చేరుకునేలా కృషి చేయాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మొదటి విడత కంటి వెలుగులో 827 బృందాలు పనిచేశాయని.. ఈసారి 1,500 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, శిబిరాల తరహాలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని వివరించారు. వచ్చే ఏడాది జనవరి 18న ప్రారంభమయ్యే రెండో విడత కార్యక్రమం అమలుపై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘ప్రజల కంటి సమస్యలను దూరం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ 2018 ఆగస్టు 15న తొలి దఫా కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది సత్ఫలితాలనివ్వడంతో మరోమారు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కంటి పరీక్షలు చేయడంతో పాటు కళ్లద్దాలు, మందులు తదితరాలను ఉచితంగా అందిస్తుంది. వీటి నాణ్యత విషయంలో రాజీపడొద్దు. నాణ్యత ప్రమాణాల పరిశీలన కోసం రాష్ట్రస్థాయిలో 10, జిల్లాకొకటి చొప్పున బృందాలను ఏర్పాటు చేస్తాం. మొదటి దఫా పథకంలో 1.5 కోట్ల మందికి పరీక్షలు చేసి, 50 లక్షల కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈసారి 1.5 కోట్ల మందికి పరీక్షలు చేసి.. 55 లక్షల అద్దాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 30 లక్షల రీడింగ్‌ గ్లాసెస్‌, 25 లక్షల ప్రిస్క్రిప్షన్‌ గ్లాసెస్‌ అవసరమని అంచనా. 850 ఏఆర్‌ మిషన్లు, 1500 ట్రయల్‌ లెన్స్‌ బాక్స్‌, 1500 టార్చ్‌లు, 1800 స్నెలెన్‌ చార్ట్‌ల కొనుగోలు వేగవంతం చేయాలి. పీహెచ్‌సీల్లో 969 మంది వైద్యుల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఒకటో తేదీన జాబితాను విడుదల చేస్తాం. పల్లె దవాఖానాల్లో 589 మంది ఎంబీబీఎస్‌, 811 మంది బీఏఎంఎస్‌ వైద్యుల నియామకాలు పూర్తయ్యాయి. కార్యక్రమం కొనసాగించేందుకు అవసరమైన వైద్యులు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడా వైద్యుల కొరత ఉండదు. 1500 మంది ఆప్టోమెట్రిస్ట్‌లు, 1500 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలి. కార్యక్రమంలో పాల్గొనే వైద్య సిబ్బందికి సాధ్యమైనంత శిక్షణ ఇవ్వాలి. కంటిచూపు సమస్యలతో ఏ ఒక్కరూ బాధపడకూడదన్న సీఎం కేసీఆర్‌ లక్ష్యానికి అనుగుణంగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులనూ భాగస్వాములను చేయాలి’’ అని మంత్రి ఆదేశించారు. సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ శ్వేతా మహంతి, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకాధికారి డాక్టర్‌ టి.గంగాధర్‌, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌కుమార్‌, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కంటి వెలుగుకు రూ.200 కోట్లు కేటాయింపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండోవిడత కంటి వెలుగు కార్యక్రమం అమలు కోసం ప్రభుత్వం రూ.200 కోట్లను కేటాయించింది. దీనికి సంబంధించి పరిపాలనపరమైన అనుమతులు మంజూరు చేస్తూ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. వైద్య పరికరాలు, వస్తువులు, మందులు, ఇతర అవసరాల కోసం ఈ నిధులను వినియోగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని