Police Recruitment: అభ్యర్థుల ఎత్తు కొలతకు డిజిటల్‌ స్టడియోమీటర్లు

ఎస్సై, కానిస్టేబుళ్ల నియామకాల్లో పోలీస్‌ నియామక మండలి పలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించబోతోంది.

Published : 30 Nov 2022 08:47 IST

కచ్చితత్వంతో కూడిన ఫలితాలకు ఆస్కారం
పోలీసు నియామక మండలి ఏర్పాట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుళ్ల నియామకాల్లో పోలీస్‌ నియామక మండలి పలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించబోతోంది. కీలకమైన శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావివ్వకూడదనే లక్ష్యంతో కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఈసారి అభ్యర్థుల ఎత్తును కొలిచేందుకు ‘డిజిటల్‌ స్టడియో మీటర్ల’ను వినియోగించబోతోంది. గత నియామకాల సమయంలో కరీంనగర్‌లో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను చేపట్టారు. అది సత్ఫలితాలు ఇవ్వడంతో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు మండలి ఛైర్మన్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు అభ్యర్థుల ఎత్తును టేపుతో కొలిచేవారు. అలా చేయడం వల్ల కొన్నిసార్లు అపోహలు తలెత్తేవి. ఏ చిన్న పొరపాటు దొర్లినా మళ్లీ ఎత్తును కొలవాల్సివచ్చేది. డిజిటల్‌ స్టడియో మీటర్ల వినియోగంతో ఈ సమస్యలు తలెత్తవు. ఈ పరికరంతో అభ్యర్థి ఎత్తును కొలిచిన వెంటనే సెంట్రల్‌ సర్వర్‌లోనూ నమోదవుతుంది. దీంతో సమయమూ ఆదా అవుతుందని మండలివర్గాలు చెబుతున్నాయి.

ఎక్కడున్నా తెలిసేలా ఆర్‌ఎఫ్‌ఐడీ పరిజ్ఞానం

అభ్యర్థులు మైదానంలో ఏ సమయంలో ఎక్కడున్నారో తెలుసుకునేందుకు వీలుగా.. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌(ఆర్‌ఎఫ్‌ఐడీ) పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించే మైదానంలో ప్రతి అభ్యర్థి చేతికి ఆర్‌ఎఫ్‌ఐడీ రిస్ట్‌బ్యాండ్‌లను తగిలిస్తారు. పరీక్షలు పూర్తయి మైదానం వెలుపలికి వచ్చేవరకు ఆ బ్యాండ్‌ను ప్రతి అభ్యర్థి చేతికి తప్పనిసరిగా ఉంచుకోవాలని మండలివర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ బ్యాండ్‌ను కావాలని తొలగించినా.. చించేసినా క్షణాల్లో తెలిసిపోతుంది. అలా చేసిన అభ్యర్థులను పోటీల నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఈ పరిజ్ఞానం పరుగుపందెం నిర్వహణలో కీలకం కానుంది. రిస్ట్‌బ్యాండ్‌ ధరించిన అభ్యర్థి ఏ క్షణంలో పరుగును ప్రారంభించాడు? ఏ క్షణంలో ఎంతదూరం ప్రయాణించాడు? ఎప్పుడు పూర్తి చేశాడు? అనే వివరాలను కచ్చితత్వంతో తెలుసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని