సేవల్లో సత్తా చాటుతాం!

ఉస్మానియా ఆసుపత్రిలో సేవలందించేందు.కు ఇద్దరు ట్రాన్స్‌జెండర్‌ వైద్యులకు అవకాశం లభించింది.

Published : 30 Nov 2022 04:59 IST

ఉస్మానియాలో డాక్టర్లుగా చేరిన ట్రాన్స్‌జెండర్లు

ఉస్మానియా ఆసుపత్రి, న్యూస్‌టుడే: ఉస్మానియా ఆసుపత్రిలో సేవలందించేందు.కు ఇద్దరు ట్రాన్స్‌జెండర్‌ వైద్యులకు అవకాశం లభించింది. వీరిద్దరూ మెడికల్‌ ఆఫీసర్లుగా కాంట్రాక్టు పద్ధతిలో చేరారు. ‘ఇక్కడివరకు రావడానికి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం.. అవన్నీ దిగమింగి అనుకున్నది సాధించాం.. ప్రభుత్వాసుపత్రిలో వైద్యులుగా చేరాం. పేదలకు సేవచేసే భాగ్యం దక్కింది. సేవల్లో సత్తా చాటుతాం’ అని ట్రాన్స్‌జెండర్‌ వైద్యులు డాక్టర్‌ రుత్‌జాన్‌పాల్‌, డాక్టర్‌ ప్రాచి రాథోడ్‌లు మంగళవారం పేర్కొన్నారు.


డాక్టర్‌ రుత్‌జాన్‌పాల్‌: ఖమ్మం జిల్లాకు చెందిన డాక్టర్‌ రుత్‌ జాన్‌పాల్‌ 2018లో మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. తర్వాత నగరంలోని ఆసుపత్రుల్లో వైద్యురాలిగా పనిచేసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదని జాన్‌పాల్‌ అన్నారు. 2021లో నారాయణగూడలో డాక్టర్‌ ప్రాచీతో కలిసి ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌ ఏర్పాటు చేశానన్నారు. ఇంతలో ఉస్మానియాలో అవకాశం రావడం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.


డాక్టర్‌ ప్రాచి రాథోడ్‌: ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆసుపత్రిలో ఎంబీబీస్‌ పూర్తి చేసిన ప్రాచీ రాథోడ్‌ ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో మూడేళ్లు పనిచేశారు. తన జెండర్‌ విషయం అక్కడ తెలియడంతో ఉద్యోగం పోయింది. ‘ఆ సంఘటన తలుచుకుంటేనే బాధేస్తుంది. మేం ఎవరికీ తక్కువ కాదు. ఇప్పటికే పీజీకోసం ఇద్దరం నీట్‌ రాశాం. ఉస్మానియాలో మహిళ కేటగిరీలో నాకు సీటు వచ్చినా.. చేరలేదు’ అని డాక్టర్‌ ప్రాచీ చెప్పారు. ట్రాన్స్‌జెండర్‌ కోటా కింద తమకు సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని