కొత్త బోధనాసుపత్రులకు 3,897 పోస్టులు

జిల్లాకో వైద్య కళాశాలను నెలకొల్పాలనే లక్ష్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 02 Dec 2022 04:30 IST

9 కాలేజీలకు 433 చొప్పున మంజూరు
ఆర్థికశాఖ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: జిల్లాకో వైద్య కళాశాలను నెలకొల్పాలనే లక్ష్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యవిద్య సంచాలకుల పరిధిలో వచ్చే ఏడాది కొత్తగా ఏర్పాటు చేసే 9 బోధనాసుపత్రుల్లో సేవలందించడానికి.. 433 చొప్పున మొత్తం 3,897 పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్‌, జనగామ, నిర్మల్‌లలో 2023-24 వైద్యవిద్య సంవత్సరంలో కొత్త కళాశాలలను ఏర్పాటు చేయనుంది. వీటికి, వీటి అనుబంధ ఆసుపత్రుల కోసం ప్రభుత్వం తాజాగా పోస్టులను మంజూరు చేసింది.

ఎనిమిదేళ్లలో 15,476 పోస్టులు

ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యంతో పాటు వైద్యవిద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో జిల్లాకు ఒక వైద్య కళాశాలను నెలకొల్పాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో 5 వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేటల్లో వైద్య కళాశాలలను సీఎం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది నవంబరు 15న వర్చువల్‌ విధానంలో మరో 8 వైద్య కళాశాలలను ప్రారంభించారు. దీంతో మొత్తం కాలేజీల సంఖ్య 17కు పెరిగింది. అదనంగా 1,150 మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2014లో ప్రభుత్వ కళాశాలల్లో 850 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా.. ప్రస్తుతం 2,790కి పెరిగాయి. మరో 9 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 3,897 పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎనిమిదేళ్లలో వైద్యవిద్య సంచాలకుల పరిధిలో మొత్తం 15,476 పోస్టులను మంజూరు చేసినట్లయింది.

ఆరోగ్య తెలంగాణ దిశగా..

-హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన వైద్యం, వైద్యవిద్యను అందించడంలో ఇదొక ముందడుగు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోంది. నాడు పెద్ద పట్టణాలకే పరిమితమైన స్పెషాలిటీ వైద్యం జిల్లాకో కళాశాల ఏర్పాటుతో గ్రామీణులకు చేరువైంది. పేదలకు సమీపంలోనే ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలు అందుతుండటంతో పాటు విద్యార్థులకు స్థానికంగానే వైద్యవిద్య అభ్యసించే అవకాశాలు మెరుగుపడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు