డ్రోన్ల వినియోగంపై రైతులకు శిక్షణ

చత్వారంతో కంటిచూపు తక్కువై బాధపడే రైతులు డ్రోన్‌ కొనుగోలుకు, దాని వినియోగంపై శిక్షణకు, లైసెన్స్‌ పొందడానికి అనర్హులు.

Updated : 02 Dec 2022 05:49 IST

అనంతరం లైసెన్సులు
జయశంకర్‌ వర్సిటీలో అకాడమీ ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: చత్వారంతో కంటిచూపు తక్కువై బాధపడే రైతులు డ్రోన్‌ కొనుగోలుకు, దాని వినియోగంపై శిక్షణకు, లైసెన్స్‌ పొందడానికి అనర్హులు. తాజాగా కేంద్రం ఈ విషయం స్పష్టం చేసింది. వచ్చే జూన్‌లో ప్రారంభమయ్యే వానాకాలం సీజన్‌ నుంచి రాష్ట్రంలో పంటల సాగుకు డ్రోన్ల వినియోగం అందుబాటులోకి రానుంది. ఈలోగా  రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం డ్రోన్‌ అకాడమీని ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ స్కై ఏవియేషన్‌ సంస్థతో ఒప్పందం కూడా చేసుకుంది. సాంకేతిక అంశాలపై ఏవియేషన్‌ సంస్థ, రసాయన మందుల వినియోగంపై వర్సిటీ వచ్చే నెలలో నాలుగురోజుల పాటు శిక్షణ ఇస్తాయి. కనీసం ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండి, శిక్షణ పూర్తిచేసుకున్న రైతుకు డ్రోన్‌ ఆపరేటర్‌ పేరుతో లైసెన్స్‌ను ఈ అకాడమీ ఇస్తుంది. ఈ లైసెన్స్‌ ఉన్న రైతులు మాత్రమే డ్రోన్‌ను సొంతంగా కొనడానికి అర్హులు. వరి, కంది, పత్తి, సెనగ, వేరుసెనగ పంటలపై పురుగుమందులు చల్లేందుకు ‘డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌’ నుంచి వర్సిటీకి అనుమతి వచ్చింది.

కంపెనీల జాబితా రూపొందించిన టీహబ్‌

ఒక ఆధునాతన డ్రోన్‌ కావాలంటే రూ.11 లక్షలు దాకా ఖర్చవుతుందని పలు కంపెనీలు వర్సిటీకి తెలిపాయి. ఇందులో కొంత సొమ్ము రాయితీగా ఇవ్వాలనే ప్రతిపాదనలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు కృషి విజ్ఞాన కేంద్రాల్లో డ్రోన్లను ఉంచి రైతులకు కిరాయికి ఇవ్వాలని వర్సిటీ, వ్యవసాయశాఖ నిర్ణయించాయి. టీహబ్‌ ఎంపికచేసిన కంపెనీలతో జాబితా తయారుచేశారు. ఈ జాబితాలోని కంపెనీల నుంచి కొనవచ్చు. జయశంకర్‌ వర్సిటీ తరఫున రెండు కొంటున్నారు. ఇందులో ఒకదానిని వ్యవసాయ డిగ్రీలు చదివే విద్యార్థులకు శిక్షణ కోసం నియోగిస్తారు. మరోదానిపై రైతులకు శిక్షణ ఇస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కంపాసాగర్‌, ఆదిలాబాద్‌ కృషి విజ్ఞాన కేంద్రాల్లో కొనుగోలుకు ఐసీఏఆర్‌ ఇప్పటికే నిధులు మంజూరు చేసింది. వచ్చే వానాకాలం నుంచి రాష్ట్రంలో పంటలపై డ్రోన్ల వినియోగం విరివిగా ఉంటుందని, కూలీల కొరత, సాగుఖర్చును నియంత్రించడానికి ఇది మంచి పరిష్కారం అని పరిశోధనల్లో గుర్తించినట్లు వర్సిటీ పరిశోధనా సంచాలకుడు డాక్టర్‌ జగదీశ్వర్‌ ‘ఈనాడు’కు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని