తెలంగాణకు అమరరాజా

ప్రసిద్ధ బ్యాటరీల తయారీ సంస్థ అమరరాజా తెలంగాణలో అడుగుపెట్టనుంది. దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక విద్యుత్‌ వాహనాల బ్యాటరీల తయారీ కోసం లిథియం అయాన్‌ గిగా కర్మాగారాన్ని, పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది.

Published : 03 Dec 2022 06:04 IST

లిథియం అయాన్‌ బ్యాటరీల గిగా కర్మాగారం, పరిశోధన కేంద్రం ఏర్పాటు
రూ.9,500 కోట్ల పెట్టుబడి.. 4,500 మందికి ఉపాధి
రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం
అన్ని విధాలా అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్‌
తెలంగాణ పెట్టుబడులకు  అనుకూలం: గల్లా జయదేవ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రసిద్ధ బ్యాటరీల తయారీ సంస్థ అమరరాజా తెలంగాణలో అడుగుపెట్టనుంది. దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక విద్యుత్‌ వాహనాల బ్యాటరీల తయారీ కోసం లిథియం అయాన్‌ గిగా కర్మాగారాన్ని, పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. మహబూబ్‌నగర్‌లోని దివిటిపల్లి పారిశ్రామిక పార్కులో రూ.9,500 కోట్ల పెట్టుబడులతో దీనిని స్థాపించి, ప్రత్యక్షంగా 4,500 మందికి ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌ సంస్థ తరఫున ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) గల్లా జయదేవ్‌, తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు సమక్షంలో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, అమరరాజా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రమాదిత్య గౌరినేనిలు ఒప్పందంపై సంతకాలు చేశారు. త్వరలోనే కర్మాగారానికి శంకుస్థాపన చేస్తామని, రెండేళ్లలో మొదటి దశ పూర్తిచేసి ఉత్పత్తులను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా గల్లా జయదేవ్‌ వెల్లడించారు. తెలంగాణ ఎలక్ట్రానిక్స్‌ విభాగం సంచాలకుడు సుజయ్‌ కారంపురి, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి, అమరరాజా విద్యుత్‌ విభాగం అధ్యక్షుడు సముద్రాల విజయానంద్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్తూరు బయట తొలి కర్మాగారమిదే

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గల్లా జయదేవ్‌ మాట్లాడారు. ‘‘ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 37 సంవత్సరాలుగా అమరరాజా పరిశ్రమలు నడుస్తున్నాయి. దాని బయట ఏర్పాటుచేయబోయే మొదటి పరిశ్రమ గిగా కారిడార్‌ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నాం. పెట్టుబడులకు తెలంగాణ అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతం. ఈ రాష్ట్రంతో ఎప్పట్నుంచో అనుబంధం ఉంది. మా కార్పొరేటు కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉంది. ఈ సర్కార్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. గత ఏడాది రూపొందించుకున్న ‘ఎనర్జీ అండ్‌ మొబిలిటీ’ రోడ్‌ మ్యాప్‌నకు అనుగుణంగానే తాజా ముందడుగు వేశాం. ఎనర్జీ అండ్‌ మొబిలిటీలో భవిష్యత్‌ సాంకేతికతల కోసం ఆర్‌అండ్‌డి, ఇంక్యుబేషన్‌, టెస్టింగ్‌, తయారీలతో కూడిన గిగా కారిడార్‌తో పటిష్ఠ భారతీయ పర్యావరణ వ్యవస్థ (ఎకోసిస్టమ్‌)ను అభివృద్ధి చేయాలనేది మా ఆకాంక్ష.

ఇక్కడి యువతకు ఉపాధి

నూతన సాంకేతికతతో ఏర్పాటుకాబోయే బ్యాటరీల తయారీ యూనిట్‌ అందరి ఆదరణ పొందుతుందని విశ్వసిస్తున్నాం. పదేళ్లలో రూ.9,500 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలో భాగంగా వెంటనే నిర్మాణ పనులు చేపడతాం. తద్వారా కర్మాగార సమీపంలోని గ్రామీణులతోపాటు రెండు, మూడో తరగతి పట్టణాల్లో వలసలను నివారించి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తాం.

ఇతర సంస్థలకూ ఉపయోగకరం

శంషాబాద్‌ వద్ద ఏర్పాటయ్యే సాంకేతిక కేంద్రం మెటీరియల్‌ రీసెర్చ్‌, ప్రొటోటైపింగ్‌, ప్రొడక్ట్‌ లైఫ్‌ సైకిల్‌ అనాలిసిస్‌, ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ డిమాన్‌స్ట్రేషన్‌ కోసం అధునాతన ప్రయోగశాలలు, ఇతర మౌలిక వసతులను కలిగిఉంటుంది. విద్యుత్‌, వాహన రంగాల్లోని సంస్థలకు పలు రకాల సదుపాయాలను అందిస్తుంది. ఇప్పటికే అమరరాజా ఇ-హబ్‌ను ఏర్పాటుచేసింది. ఆసక్తి ఉన్న ఇతర సంస్థలతో కలసి ఇది పని చేస్తుంది. గత నెల 3న అమర రాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌ పేరిట అనుబంధ సంస్థ ఏర్పాటుచేసి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాం.

చిత్తూరులోని పరిశ్రమలు యథాతథం

తెలంగాణలో కొత్త పరిశ్రమ ప్రారంభించినా...ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మా పరిశ్రమలు యథాతథంగా కొనసాగుతాయి. ఏపీతో పారిశ్రామిక అనుబంధం కొనసాగుతుంది. అక్కడ ఉన్న అమరరాజా పరిశ్రమల వద్ద ఎలాంటి కాలుష్య సమస్యల్లేవు. పరిశ్రమలు నిర్వహిస్తున్న స్థలంలోనే ఎప్పటి నుంచో మా కుటుంబం నివసిస్తోంది. అక్కడ కాలుష్యం ఉంటే మా కుటుంబంపైనే ఆ ప్రభావం పడేది. పరిశ్రమల వద్ద కాలుష్య సమస్యలు లేకుండా మేము ముందే అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నాం’’ అని జయదేవ్‌ తెలిపారు.

ఎనిమిదేళ్ల కృషి ఫలించింది: మంత్రి కేటీఆర్‌

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, తమ ఎనిమిదేళ్ల కృషి ఇప్పటికి ఫలించిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన గల్లా జయదేవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘అమరరాజాకు గొప్ప చరిత్ర ఉంది. జయదేవ్‌ నాకు సన్నిహితుడు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇక్కడ పరిశ్రమను స్థాపించాలని కోరుతున్నా. తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇప్పుడు భారీ పెట్టుబడులతో ముందుకొచ్చారు. అమరరాజా కంపెనీకి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఇప్పటికే తెలంగాణ విద్యుత్‌ వాహనాల ప్రోత్సాహానికి ప్రత్యేక విధానం తెచ్చింది. ఈ రంగంలో భారీ పెట్టుబడులను సమీకరిస్తోంది.  ద్వితీయ శ్రేణి పట్టణాల్లో అభివృద్ధికి, గామీణ ప్రాంత యువతకు ఉపాధికి ఊతమివ్వడంతోపాటు దేశంలో ఈవీ విప్లవానికి నాంది పలుకుతుందని’’ కేటీఆర్‌ అన్నారు.


కేటీఆర్‌ కోరిక మేరకే

తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్‌ గత కొన్నేళ్లుగా కోరుతున్నారు. ఇప్పటికి ఆ ప్రయత్నం ఫలించింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు మంచి గిరాకీ ఉంది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, విధానపరమైన అంశాలను విశ్లేషించాం. ఈవీ వాహనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ ఒప్పందం అమరరాజాకు కీలక ముందడుగు.

 అత్యాధునిక సాంకేతికతతో కర్మాగారం

తెలంగాణలో నెలకొల్పబోయే పరిశ్రమ 16 జీడబ్ల్యూహెచ్‌ లిథియం సెల్‌, 5 జీడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌ యూనిట్‌ సామర్థ్యం కలిగి ఉంటుంది. దానికి అనుబంధంగా ఆధునిక అభివృద్ధి, పరిశోధన కేంద్రం ఉంటుంది. శంషాబాద్‌ వద్ద రూ.800 కోట్లతో సాంకేతిక కేంద్రాన్నీ ఏర్పాటుచేస్తాం. అందులో 800 మందికి ఉపాధి కల్పిస్తాం.

- గల్లా జయదేవ్‌, సీఎండీ, అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌


ఈవీ తయారీ హబ్‌గా రాష్ట్రం

దేశంలోనే తొలి లిథియం అయాన్‌ బ్యాటరీ తయారీ కర్మాగారాన్ని తెలంగాణలో నెలకొల్పడం జయదేవ్‌ దార్శనికతకు నిదర్శనం. ఈ పరిశ్రమ పెట్టుబడుల పరంగానేగాక అత్యాధునిక సెల్‌ సాంకేతికతలోనూ దేశంలో మొదటిది. తెలంగాణ ఈవీ తయారీ హబ్‌గా మారేందుకు అమరరాజా కర్మాగారం దోహద పడుతుంది.

- మంత్రి కేటీఆర్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని