మూడోసారి ఆ మూడు గనులకు టెండర్లు

తెలంగాణలోని మూడు కొత్త బొగ్గు గనులను సింగరేణికి పాతపద్ధతిలో అప్పగించడానికి కేంద్రం ససేమిరా అంటోంది. తాజాగా దేశవ్యాప్తంగా వేలానికి పెట్టిన 133 బొగ్గు గనుల్లో, రాష్ట్రంలోని ఆ మూడింటితోపాటు.. సింగరేణి వద్దని వదిలేసిన మరో గని ఉన్నాయి.

Published : 05 Dec 2022 05:39 IST

గతంలో రెండుసార్లు ఆసక్తి చూపని గుత్తేదారులు..
తనకు కేటాయించాలని సింగరేణి కోరుతున్నా స్పందించని కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని మూడు కొత్త బొగ్గు గనులను సింగరేణికి పాతపద్ధతిలో అప్పగించడానికి కేంద్రం ససేమిరా అంటోంది. తాజాగా దేశవ్యాప్తంగా వేలానికి పెట్టిన 133 బొగ్గు గనుల్లో, రాష్ట్రంలోని ఆ మూడింటితోపాటు.. సింగరేణి వద్దని వదిలేసిన మరో గని ఉన్నాయి. ఈ 4 గనుల్లో 30.87 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలున్నాయని తెలిపింది. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 26లోగా టెండర్లు దాఖలు చేసి వేలంలో దక్కించుకోవచ్చని కేంద్ర బొగ్గు శాఖ జారీచేసిన తాజా టెండరు నోటిఫికేషన్‌లో ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణలోని పెనగడప, శ్రావణపల్లి, సత్తుపల్లి బ్లాక్‌-3, కల్యాణఖని బ్లాక్‌-6 ఉన్నాయి. పెనగడప గనిలో నాణ్యత అంతగా లేని జీ13 గ్రేడ్‌ బొగ్గు వస్తుందని, సింగరేణి సంస్థనే దీనిని వేలానికి అప్పగించినట్లు కేంద్ర బొగ్గు శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక మిగిలిన 3 గనులను వేలంలో పెట్టకుండా నేరుగా తమకే అప్పగించాలని సింగరేణి సంస్థ కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఈ గనులు సింగరేణికి ఇప్పటికే ఉన్న పాత గనులను ఆనుకుని ఉన్నాయి.

బొగ్గు గనుల వేలం విధానం అమల్లోకి వచ్చాక.. ఇది ఆరో నోటిఫికేషన్‌. శ్రావణపల్లి, సత్తుపల్లి బ్లాక్‌-3, కల్యాణఖని బ్లాక్‌-6, కోయగూడెం గనులు గత రెండు టెండర్‌ నోటిఫికేషన్లలోనూ ఉన్నాయి. అప్పట్లో కోయగూడెం గనికి మాత్రమే తెలంగాణకు చెందిన ‘ఆరో కోల్‌’ కంపెనీ టెండరు వేసి దక్కించుకుంది. మిగిలిన మూడు గనులకు ఒక్క టెండరూ రాలేదు. ఈ నేపథ్యంలో వాటిని కేంద్రం తమకే అప్పగిస్తుందని సింగరేణి ఇంతకాలం ఎదురుచూసింది. కానీ ఈ సంస్థ అంచనాలను తలకిందులు చేస్తూ తాజాగా జారీచేసిన నోటిఫికేషన్‌లో ఆ మూడింటితో పాటు పెనగడపను చేర్చింది.

ఒక బొగ్గు గనిని కొత్తగా తవ్వాలంటే అక్కడ కార్యాలయాల ఏర్పాటు, తవ్విన మట్టిని పోయడానికి అదనపు భూసేకరణ, నివాస ప్రాంతాల తరలింపు వంటి పనులకు చాలా కాలం పడుతుంది. ప్రైవేటు సంస్థలు కొత్తగా వస్తే ఈ పనులన్నీ పూర్తిచేసి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించడానికి కొన్నేళ్ల సమయం పడుతుంది. ఈ సమస్యలున్నందునే తెలంగాణలో ఆ 3 గనులకు గత రెండుసార్లు టెండర్లు పిలిచినా ఏ కంపెనీ ముందుకు రాలేదు. అవే గనులను సింగరేణికి నేరుగా అప్పగిస్తే వెంటనే బొగ్గు ఉత్పత్తి సాధ్యపడుతుంది. పక్కనే ఉన్న పాత గనుల మౌలిక సదుపాయాలను వినియోగించుకోవడం వల్ల సంస్థకు లాభదాయకంగానూ ఉంటుంది. ఆ 3 గనులు సింగరేణికి అత్యంత కీలకమని, వీటిలో జీ10 గ్రేడ్‌ బొగ్గు ఉత్పత్తికి అవకాశాలున్నాయని, ఇది తవ్వితే సంస్థకు వ్యాపారం పెరగడమే కాకుండా తెలంగాణ విద్యుత్కేంద్రాలకు సులభంగా రవాణా చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. గనుల వేలం ఆపేసి నేరుగా కేటాయించాలని కేంద్రానికి లేఖ రాసినట్లు సింగరేణి సీనియర్‌ అధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు.

బొగ్గు గనుల వేలం టెండర్ల ప్రక్రియపై కేంద్ర బొగ్గు శాఖ ఈ నెల 3న బెంగళూరులో నిర్వహించిన ‘పెట్టుబడిదారుల సదస్సు’కు సింగరేణి సంస్థ ఉన్నతాధికారి కూడా హాజరయ్యారు. అంటే వేలంలో పాల్గొని టెండర్లు వేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేనందున.. వేచిచూస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని