ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు లేదు.. నేడు అందుబాటులో ఉండను

దిల్లీ మద్యం కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు.

Updated : 06 Dec 2022 07:48 IST

11, 12, 14, 15 తేదీల్లో హైదరాబాద్‌ ఇంట్లో ఉంటాను
ఏదైనా ఒకరోజు కలిసేందుకు సిద్ధం
సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: దిల్లీ మద్యం కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. సీబీఐ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలించానని, అందులోని నిందితుల జాబితాలో తన పేరు లేదని తెలిపారు. ముందే ఖరారైన కార్యక్రమాల కారణంగా ఈ నెల 6న తాను సీబీఐ అధికారులను కలుసుకోలేనని ఆమె ఆ సంస్థ డీఐజీ రాఘవేంద్ర వత్సకు సోమవారం లేఖ రాశారు. మద్యం కేసులో ఈనెల 6న విచారణకు రావాలని సీబీఐ కవితకు లేఖ రాసిన విషయం విదితమే. అయితే కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని తనకు అందించాలని కోరుతూ కవిత సీబీఐకి లేఖ రాశారు. దానికి స్పందించిన అధికారులు ఈ-మెయిల్‌ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్‌ఐఆర్‌ కాపీ వెబ్‌సైట్‌లో ఉందని తెలిపారు. దీనిపై న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం సీబీఐ అధికారి రాఘవేంద్ర వత్సకు కవిత లేఖ రాశారు. ‘‘ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితుల పేర్లు సహా అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించాను. అందులో నా పేరు ఎక్కడా లేదు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీన నేను సీబీఐ అధికారులను కలుసుకోలేను. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్‌లోని మా నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటాను. దర్యాప్తునకు సహకరించడానికి పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశమవుతాను. త్వరగా తేదీని ఖరారు చేయాలని కోరుతున్నాను.నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. దర్యాప్తునకు సహకరిస్తాను’’ అని కవిత లేఖలో తెలిపారు.

సీఎంతో భేటీ: సీబీఐ నోటీసులపై శనివారం సీఎంను కలిసి చర్చించిన కవిత సోమవారం మరోసారి భేటీ అయ్యారు. ఎఫ్‌ఆర్‌ఐలో తన పేరు లేకున్నా... సీబీఐ నోటీసులిచ్చిందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పార్టీ సీనియర్‌ న్యాయవాదులతో పాటు నేతలతో సీఎం, కవిత చర్చించారు. న్యాయనిపుణుల సూచనలకు అనుగుణంగా సీబీఐ డీఐజీకి ఆమె లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని