పల్లెలకు కొత్త వైద్యులొస్తున్నారు!

పల్లె దవాఖానాలకు కొత్త వైద్యులు రాబోతున్నారు. 1,492 మందిని ఒప్పంద ప్రాతిపదికన నియమించేందుకు అనుమతిస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 08 Dec 2022 05:48 IST

1,492 మంది నియామకానికి ఆర్థిక శాఖ అనుమతి  
ఒప్పంద ప్రాతిపదికన భర్తీ
నల్గొండలో అత్యధిక పోస్టులు

ఈనాడు, హైదరాబాద్‌: పల్లె దవాఖానాలకు కొత్త వైద్యులు రాబోతున్నారు. 1,492 మందిని ఒప్పంద ప్రాతిపదికన నియమించేందుకు అనుమతిస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అనుగుణంగా నియామక ప్రక్రియను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేసేందుకు వైద్యారోగ్యశాఖ కసరత్తు ఆరంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 4,745 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. వీటిల్లో 3,206 సబ్‌ సెంటర్లను పల్లె దవాఖానాలుగా మార్చాలని వైద్యారోగ్యశాఖ ఇప్పటికే నిర్ణయించింది. వీటిలోనే కొత్తగా వైద్యులను నియమించనున్నారు. మరో 636 ఆరోగ్య ఉపకేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోనే ఉండగా, వాటిల్లో ఇప్పటికే వైద్యులు అందుబాటులో ఉన్నారు. కొత్తగా భర్తీచేసే వారిని ‘మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ)’లుగా పిలుస్తారు.

పల్లెల్లోనే సేవలు అందేలా

ఇప్పటికే పట్టణాల్లో బస్తీ దవాఖానాలను నెలకొల్పడం ద్వారా పట్టణ ప్రజలకు వైద్యసేవలను చేరువచేసింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి పల్లె దవాఖానాలను సర్కారు ప్రవేశపెట్టింది. ప్రాథమిక స్థాయిలోనే వ్యాధి నిర్ధారణ చేసి, చికిత్స అందించడం వీటి ఏర్పాటు ఉద్దేశం. పైపెచ్చు అర్హతలేని వైద్యుల వద్దకు చికిత్సల కోసం వెళ్లి నష్టపోయే పరిస్థితులను నుంచి కూడా పల్లె ప్రజలను గట్టెక్కించవచ్చనేది ప్రభుత్వ భావన. జబ్బు తీవ్రమైన తర్వాత చికిత్స కంటే తొలి దశలోనే గుర్తించి ప్రాథమికంగా చికిత్స అందించడం ద్వారా రోగి ప్రాణాలను కాపాడడం, ఆర్థిక భారాన్ని తప్పించడం లక్ష్యాలు.

నియామక మార్గదర్శకాలు

* ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేయడానికి ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌ అర్హత కలిగిన వైద్యులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంబీబీఎస్‌లకు ప్రాధాన్యం ఉంటుంది.

* ఎంబీబీఎస్‌/బీఏఎంస్‌ వైద్యులు ముందుకు రానిపక్షంలో 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్‌ పట్టభద్రులు లేదా 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో ఆరు నెలల బ్రిడ్జ్‌ కోర్సు పూర్తిచేసిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు.

* ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేసే ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌ వైద్యులకు నెలకు 40 వేలు, నర్సింగ్‌/జీఎన్‌ఎంలకు నెలకు 29,900 చొప్పున గౌరవ వేతనాన్ని చెల్లిస్తారు.

* అర్హత వయసు 18-44 ఏళ్లుగా నిర్ణయించారు.

* ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది.

* ఎంబీబీఎస్‌, బీఏఎంఎస్‌, నర్సింగ్‌ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత మండళ్లలో తమ సమాచారాన్ని నమోదు చేసుకొని ఉండాలి.
* జిల్లా నియామక కమిటీ నేతృత్వంలో భర్తీ ప్రక్రియను నిర్వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని