ముంపు ముప్పు తప్పేలా..!

గోదావరికి గత జులైలో వచ్చిన భారీ వరద కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అన్నారం పంపుహౌస్‌కు జరిగిన నష్టం పునరావృతం కాకుండా నీటిపారుదల శాఖ కసరత్తు ప్రారంభించింది.

Published : 08 Dec 2022 05:38 IST

దెబ్బతిన్న కన్నెపల్లి-అన్నారం కాలువకు మరమ్మతులు
అన్నారం పంపుహౌస్‌కు రక్షణగా మట్టికట్ట స్థానంలో సిమెంటు గోడ
నిర్మాణ పనులపై ఇంజినీర్ల ప్రతిపాదనలు
కసరత్తు ఆరంభించిన నీటిపారుదల శాఖ

ఈనాడు హైదరాబాద్‌: గోదావరికి గత జులైలో వచ్చిన భారీ వరద కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అన్నారం పంపుహౌస్‌కు జరిగిన నష్టం పునరావృతం కాకుండా నీటిపారుదల శాఖ కసరత్తు ప్రారంభించింది. మొదటి పంపుహౌస్‌ కన్నెపల్లి నుంచి ఎత్తిపోసే నీరు అన్నారం బ్యారేజిలో చేరేందుకు నిర్మించిన కాలువ అనేక చోట్ల దెబ్బతింది. దాన్ని బాగుచేయడంతో పాటు అన్నారం పంపుహౌస్‌ మళ్లీ నీట మునగకుండా మట్టికట్ట స్థానంలో సిమెంటు కాంక్రీటు నిర్మాణం తదితర పనులు చేపట్టాలని నిర్ణయించిన ఇంజినీర్లు ప్రతిపాదనలను నీటిపారుదల శాఖ అధికారులకు పంపినట్లు తెలిసింది. డిజైన్లలో లోపాలను సవరించి మళ్లీ ఇలాంటి సమస్యలు రాకుండా సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీఓ)కు తాజాగా ప్రతిపాదనలు అందజేసినట్లు తెలిసింది.

కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా మొదటి పంపుహౌస్‌ను కన్నెపల్లి వద్ద నిర్మించగా, దీని నుంచి ఎత్తిపోసే నీరు అన్నారం బ్యారేజికి చేరేందుకు నిర్మించిన కాలువ గత జులైలో భారీ వరద కారణంగా 24చోట్ల దెబ్బతిన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. పనుల్లో నాణ్యతలోపాలు, డిజైన్‌లో సమస్యలు దీనికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదొక ఎత్తయితే, వచ్చే సీజన్‌లో మళ్లీ నీటిని ఎత్తిపోయాలంటే ఈ కాలువ మరమ్మతును సత్వరం పూర్తిచేయాల్సి ఉంటుంది. లేకపోతే వచ్చే వర్షాకాలంలో మరింత దెబ్బతినే అవకాశం ఉంది. సీడీఓ పరిశీలన తర్వాత ఇందుకు ఎంత ఖర్చవుతుందన్న అంశంపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. రక్షణగా వేసిన మట్టికట్టపై నుంచి నీరు లోపలకు ప్రవేశించడం, కట్ట కోతకు గురికావడం తదితరాలతో పాటు గరిష్ఠ వరద మట్టం కంటే తక్కువ ఎత్తులో ఉండటం వంటి కారణాల వల్ల అన్నారం పంపుహౌస్‌ నీట మునిగింది. ఈ నీటిని తోడి పంపులను బయటకు తీసి, నాలుగింటికి మరమ్మతుల అనంతరం ప్రయోగాత్మకంగా నీటిని విడుదల చేశారు. మిగిలిన పంపులు నడపాల్సి ఉంది. మరోవైపు 2023లో మళ్లీ భారీ వరద వస్తే సమస్య తలెత్తకుండా పంపుహౌస్‌కు రక్షణగా సిమెంటు కాంక్రీటు(సీసీ) గోడను నిర్మించాలని నిర్ణయించారు. సుమారు 800 మీటర్ల పొడవునా నిర్మించే ఈ గోడను 134 మీటర్ల మట్టం వరకు నీరొచ్చినా ఇబ్బంది లేకుండా కట్టాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇది కూడా నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కార్యాలయానికి చేరినట్లు తెలిసింది. పంపుహౌస్‌ ప్రెషర్‌మెయిన్‌లు నీళ్లలో మునిగి ఉండటంతో పాటు వాటిపైన మట్టి కూడా ఉన్నట్లు సమాచారం. దీనివల్ల ఏమైనా నష్టం వాటిల్లే అవకాశముందా అన్నదానిపై నిపుణులతో అధ్యయనం చేయించినట్లు తెలిసింది. ట్రాన్స్‌కో సైతం కొన్ని పనులు చేయాల్సి ఉంది. రూ.25కోట్లు చెల్లిస్తే కానీ ఇవి పూర్తిచేయలేని పరిస్థితి ఉండటంతో ఈ మొత్తం సమకూర్చడానికి నీటిపారుదల శాఖ నుంచి ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలిసింది. అన్ని పంపులు పూర్తిస్థాయిలో నడవాలంటే ట్రాన్స్‌కో కూడా కొన్ని పనులు పూర్తిచేయాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని