ఇటు విడుదల.. అటు అరెస్ట్‌

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో బెయిల్‌పై గురువారం విడుదలైన నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌లను వేర్వేరు కేసుల్లో పోలీసులు మరోసారి అరెస్ట్‌ చేశారు.

Published : 09 Dec 2022 05:53 IST

వేర్వేరు కేసుల్లో నందు, రామచంద్రభారతికి మళ్లీ రిమాండ్‌

తాజా కేసులోనూ రామచంద్రకు బెయిల్‌.. నేడు విడుదలకు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌, చంచల్‌గూడ: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో బెయిల్‌పై గురువారం విడుదలైన నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌లను వేర్వేరు కేసుల్లో పోలీసులు మరోసారి అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో నిందితుడైన సింహయాజి బెయిల్‌పై బుధవారం ఉదయం విడుదలైన విషయం తెలిసిందే. రామచంద్రభారతి, నందకుమార్‌లు గురువారం ఉదయం విడుదల కాగా.. హైదరాబాద్‌ పోలీసులు జైలు ముందే అదుపులోకి తీసుకొన్నారు. విచారణ అనంతరం వీరిద్దరికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. అయితే రామచంద్రభారతి తరఫు న్యాయవాది అభ్యర్థనతో అతడికి న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. రూ.10 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని షరతు విధించింది. బెయిల్‌ ఉత్తర్వులు ఇంకా జైలుకు చేరనందున ఆయన శుక్రవారం విడుదలయ్యే అవకాశముంది.


ఉపముఖ్యమంత్రిని అవుతా.. అంతుచూస్తా!

భూమి కొనుగోలు విషయంలో నందకుమార్‌ తనను బెదిరిస్తున్నారంటూ బంజారాహిల్స్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి షిండేర్కర్‌ సతీష్‌(53) గత నెల 18న చేసిన ఫిర్యాదుపై నందకుమార్‌ను తాజాగా అరెస్ట్‌ చేశారు. ‘దోమ మండలం భూంపెల్లిలో 12 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలులో మధ్యవర్తిగా ఉన్న నందు.. తర్వాత ఆ భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని బెదిరిస్తున్నాడు. తెలంగాణలో త్వరలో భాజపా ప్రభుత్వం ఏర్పడుతుందని.. తాను ఉపముఖ్యమంత్రి అవుతానని, ఆ భూమిని తన పేరిట రిజిస్టర్‌ చేయకపోతే చంపేస్తానన్నాడు’ అని సతీష్‌ ఫిర్యాదు చేశారు.


నకిలీ గుర్తింపుకార్డులపై విచారణ

కిలీ పాస్‌పోర్టులు, ఆధార్‌కార్డుల వ్యవహారంలో రామచంద్రభారతిని బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌, ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ విచారించారు. ఆయన వద్ద ఉన్న పాస్‌పోర్టుల్లో ఒకటి నకిలీదని ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. నాలుగు ఆధార్‌కార్డులు తన పేర్లతో ఉన్నాయని విచారణలో రామచంద్రభారతి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని