తెలుగు రాష్ట్రాల్లో మరో 255 బ్యాటరీ ఛార్జింగ్‌ కేంద్రాలు

విద్యుత్తు వాహనాల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా దశలవారీగా అన్ని ఐఓసీ పెట్రోలు బంకుల్లో వ్యక్తిగత వాహనాల బ్యాటరీ ఛార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బి.అనిల్‌కుమార్‌ చెప్పారు.

Updated : 09 Dec 2022 05:02 IST

వచ్చే మార్చిలోగా ఏర్పాటు

‘ఈనాడు’తో ఐఓసీ తెలంగాణ, ఏపీ ఈడీ అనిల్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు వాహనాల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా దశలవారీగా అన్ని ఐఓసీ పెట్రోలు బంకుల్లో వ్యక్తిగత వాహనాల బ్యాటరీ ఛార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బి.అనిల్‌కుమార్‌ చెప్పారు. స్లో, స్పీడ్‌ ఛార్జింగ్‌ కేంద్రాలను నెలకొల్పుతామని.. జాతీయ రహదారుల్లోని బంకులకు ప్రాధాన్యముంటుందని పేర్కొన్నారు. ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి తెలంగాణలో 223, ఆంధ్రప్రదేశ్‌లో 264 కలిపి.. మొత్తం 487 అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే 232 ఏర్పాటయ్యాయి. మార్చిలోగా మరో 255 కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. 200 స్లో, 287 స్పీడ్‌ ఛార్జింగ్‌ కేంద్రాలు రానున్నాయి. స్లో కేంద్రాల్లో ద్విచక్ర వాహనం బ్యాటరీ ఛార్జింగ్‌కు 15-30 నిమిషాలు, కారుకు గంట నుంచి గంటన్నర వ్యవధి పడుతుంది. స్పీడ్‌ కేంద్రాల్లో ద్విచక్ర వాహనానికి 10 నిమిషాలు, కారుకు 15-20 నిమిషాలు పడుతుంది.

తిరుమలలో వంట గ్యాస్‌ ప్లాంటు

కూరగాయల వ్యర్థాల నుంచి వంట గ్యాస్‌ను ఉత్పత్తి చేసే విధానాన్ని మా పరిశోధన, అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డీ) విభాగం రూపొందించింది. తొలి ప్లాంటును తిరుమల కొండపై ఏర్పాటు చేయనున్నాం. తితిదేతో ఒప్పందం చేసుకున్నాం. నిర్మాణ వ్యయాన్ని ఐఓసీ, తితిదే సమానంగా భరిస్తాయి. తిరుమలలో రోజుకు 40-60 టన్నుల కూరగాయల వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. వాటి నుంచి రోజుకు 1-2 టన్నుల గ్యాస్‌ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఇందులో వచ్చే ఉప ఉత్పత్తులను సేంద్రియ ఎరువుల తయారీకి వినియోగిస్తాం. ప్లాంటు కోసం స్థలాన్ని గుర్తించే పని సాగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 6-8 నెలల్లో ప్లాంటు నిర్మాణం పూర్తవుతుంది అని అనిల్‌కుమార్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని