‘పోలవరం’ ముంపుపై ఆధారాలున్నాయి!

పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల ప్రభావంపై బుధవారం దిల్లీలో కేంద్ర జలసంఘం సాంకేతిక కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరోమారు రాష్ట్రంలో ముంపు ప్రభావంపై గట్టి వాదనలను వినిపించేందుకు తెలంగాణ సిద్ధమైంది.

Published : 25 Jan 2023 04:37 IST

కేంద్ర జలసంఘానికి తెలంగాణ తాజా లేఖ
నేడు దిల్లీలో 5 రాష్ట్రాలతో సాంకేతిక కమిటీ సమావేశం

ఈనాడు హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల ప్రభావంపై బుధవారం దిల్లీలో కేంద్ర జలసంఘం సాంకేతిక కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరోమారు రాష్ట్రంలో ముంపు ప్రభావంపై గట్టి వాదనలను వినిపించేందుకు తెలంగాణ సిద్ధమైంది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల 891 ఎకరాల భూమితో పాటు ఆరు గ్రామాలు మునుగుతాయని పేర్కొంది. పోలవరం వల్ల ముంపుపై తెలంగాణ లేవనెత్తిన అంశాలను ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర జలసంఘం తిరస్కరిస్తున్న నేపథ్యంలో 10 అంశాలతో కూడిన లేఖను మ్యాప్‌లు, ఇతర ఆధారాలతో సహా పంపినట్లు సంబంధితవర్గాల ద్వారా తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నేతృత్వంలో తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల అభిప్రాయాలను సీడబ్ల్యూసీ నమోదు చేస్తోంది. సమావేశానికి తెలంగాణ నుంచి ఈఎన్‌సీ మురళీధర్‌ హాజరుకానున్నారు. ఈక్రమంలో మంగళవారం హైదరాబాద్‌ జలసౌధలో ప్రాజెక్టు ముంపుపై ఇంజినీర్లు కసరత్తు చేశారు.

అభ్యంతరాలివీ

* మణుగూరు భారజల కర్మాగారం పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో పోల్చితే ఎక్కువ ఎత్తులో ఉందని, ఇది 64 నుంచి 85 మీటర్ల మట్టంలో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. మరోవైపు కర్మాగారం జనరల్‌ మేనేజర్‌ 2019లో రాసిన లేఖ ప్రకారం క్రిటికల్‌ ఆపరేషన్‌ లెవల్‌ 60 మీటర్లుగా ఉంది. నీటిపారుదలశాఖ అధ్యయనం ప్రకారం 58 నుంచి 63 మీటర్లు ఉంది.

* 2010లో ఆమోదించిన పోలవరం డీపీఆర్‌ ప్రకారం నెల్లిపాక నుంచి భద్రాచలం, భద్రాచలం ఎగువభాగాన ఎడమవైపు 3 కిలోమీటర్లు, కిన్నెరసాని కలిసేచోట నుంచి ఎగువన 3 కిలోమీటర్లు, భద్రాచలం రోడ్డు బ్రిడ్జి వరకు కుడివైపు, బూర్గంపాడు టౌన్‌, గుమ్ములూరు-రెడ్డిపాలెం, సారపాక గ్రామాలు మునిగిపోకుండా చూడాలి.

* ఆంధ్రప్రదేశ్‌లో 7 మండలాలు కలిసిన తర్వాత కూడా బూర్గంపాడుపై ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ 11వ సమావేశంలోనూ.. 300 ఎకరాలు తెలంగాణలో ముంపునకు గురవుతాయని.. రక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ పేర్కొన్న విషయాన్ని తాజాగా నివేదించనున్నారు.

* తెలంగాణ నీటిపారుదలశాఖ గతేడాది చివర్లో జరిపిన అధ్యయనం ప్రకారం 891 ఎకరాలు ముంపునకు గురవుతుంది. ఈ భూమి బూర్గంపాడు, నాగినేనిప్రోలు, మోతె, ఇరవెండి, తూరుబాక, మోదువాయి కాలనీలో ఉంది. భద్రాచలంలో 8 ఔట్‌ఫాల్‌ రెగ్యులేటర్లు ఉంటే మూడు ముంపునకు గురవుతాయంటూ ఇందుకు సంబంధించిన ఆధారాలను జత చేసినట్లు సమాచారం.

* పోలవరం బ్యాక్‌వాటర్‌ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) నుంచి ఏపీ సరిహద్దు వరకు నిర్వహించిన లైడార్‌ సర్వే ప్రకారం కూడా ముంపు ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని