‘పది’ విద్యార్థులకు యానిమేటెడ్‌ పాఠాలు

విద్యార్థులు దృశ్య సహితంగా (యానిమేటెడ్‌ పాఠాలు) అభ్యసించడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించేందుకు గాను రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జిల్లాలో వినూత్న కార్యక్రమాన్ని తలపెట్టారు.

Published : 25 Jan 2023 02:57 IST

‘కేసీఆర్‌ డిజిటల్‌ కంటెంట్‌’ను ఆవిష్కరించిన మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, న్యూస్‌టుడే: విద్యార్థులు దృశ్య సహితంగా (యానిమేటెడ్‌ పాఠాలు) అభ్యసించడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించేందుకు గాను రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జిల్లాలో వినూత్న కార్యక్రమాన్ని తలపెట్టారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ‘కేసీఆర్‌ డిజిటల్‌ కంటెంట్‌’ను అందుబాటులోకి తెచ్చారు. 2021-22లో పదో తరగతిలో 97.85% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అదే స్ఫూర్తిని కొనసాగించడమే లక్ష్యంగా మంత్రి అభ్యసనలో సరికొత్త ఒరవడిని తెచ్చారు. సాంకేతికతతో కూడిన స్టడీ మెటీరియల్‌ను హైదరాబాద్‌కు చెందిన ‘5 మంత్ర లెర్నింగ్‌ అకాడమీ’ సహకారంతో జిల్లాలో ప్రవేశపెట్టారు. సిద్దిపేటలోని ఇందిరానగర్‌ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం మంత్రి హరీశ్‌రావు దీన్ని ఆవిష్కరించి విద్యార్థులకు డిజిటల్‌ పుస్తకాలు పంపిణీ చేశారు.

* గణితం, భౌతిక-రసాయన, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో ప్రతి పాఠంలో ముఖ్యమైన అంశాలను యానిమేటెడ్‌ (3డీ) వీడియోలుగా రూపొందించారు. వాటిని క్యూఆర్‌ కోడ్‌ల రూపంలో నిక్షిప్తం చేశారు. పాఠ్యాంశానికి సంబంధించిన ప్రాథమిక స్థాయి ముఖ్య సమాచారం, దాని కిందనే క్యూఆర్‌ కోడ్‌ ముద్రించారు. ఫోన్‌ ద్వారా స్కాన్‌ చేయగానే అంశానికి సంబంధించిన యానిమేటెడ్‌ వీడియో అందుబాటులోకి వస్తుంది. ఒక్కో అంశాన్ని 30 సెకన్ల నుంచి 5 నిమిషాల వరకు నిడివితో రూపొందించారు.

* జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దాదాపు 10 వేల మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందుబాటులోకి తేనున్నారు. ఇందుకు గాను రూ.20 లక్షల వరకు వెచ్చించారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో వీటిని రూపొందించారు.

పిల్లలు ఇష్టంగా చదివేలా..

‘‘వివిధ రూపాల్లో విద్యార్థులకు సహకారం అందిస్తున్నాం. పిల్లలు ఇంటికి వెళ్లగానే సమయం వృథా చేయకుండా ఫోన్లో పాఠ్యాంశాలను దృశ్య సహితంగా అభ్యసించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇష్టంగా చదివేందుకు ఆస్కారం కలుగుతుంది. ఈ ఏడాది కూడా సిద్దిపేట జిల్లా పదో తరగతిలో అగ్రస్థానంలో నిలవాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నాం’’ అని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని