95 మంది ఖాతాలకు రూ.1.68 కోట్లు మళ్లింపు

ఒకపక్క అధికారులు, మరోవైపు మిల్లర్లు రైతులను దండుకున్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండానే చేసినట్లు రికార్డులు సృష్టించి ఆ వడ్లను మిల్లులకు తరలించినట్లు నమోదు చేశారు.

Updated : 26 Jan 2023 04:56 IST

ధాన్యం కొనుగోలులో అధికారుల మాయాజాలం
గడిచిన యాసంగిలో ఓగోడు ఐకేపీ కేంద్రంలో అక్రమాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఒకపక్క అధికారులు, మరోవైపు మిల్లర్లు రైతులను దండుకున్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండానే చేసినట్లు రికార్డులు సృష్టించి ఆ వడ్లను మిల్లులకు తరలించినట్లు నమోదు చేశారు. ధాన్యం కొనుగోలు పత్రాలపై సహాయ మేనేజర్‌ కాకుండా కింది స్థాయి సిబ్బందితో సంతకాలు చేయించి అక్రమాలకు పాల్పడ్డారు. ఇలా ధాన్యం కొనుగోళ్ల గుట్టును విజిలెన్స్‌ రట్టు చేసింది. పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ నాగేశ్వరరావు, ఓగోడు ఐకేపీ కొనుగోలు కేంద్రం సహాయ ప్రాజెక్టు మేనేజర్‌ ప్రభాకర్‌ అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్‌ అధికారులు నిర్ధరించిన మీదట శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు చేశారు.

ధాన్యం విక్రయించిన రైతుల జాబితాలో లేని వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమచేశారు. 2020-21 యాసంగి సీజనులో నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం ఓగోడు ఐకేపీ కేంద్రంలో 357మంది రైతులనుంచి 7,029 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా కొనుగోలు చేసినట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. తరుగు పేరుతో ఎక్కువ మొత్తంలో ధాన్యం తీసుకున్నట్లు రైతులు చేసిన ఆరోపణలను విజిలెన్స్‌ అధికారులు నిర్ధరించారు. ఇక్కడ రూ.5.10 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోళ్లలో రూ.1.68 కోట్లను పక్కదారి పట్టించారు. ఆ మొత్తాన్ని జిల్లా మేనేజర్‌ 95 మంది ఖాతాల్లో డిపాజిట్‌ చేసినట్లు గుర్తించారు. కొనుగోలు వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన సహాయ ప్రాజెక్టుమేనేజర్‌ ప్రభాకర్‌ కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించే ట్రక్కు షీట్లను పరిశీలించలేదని గుర్తించారు. రైతుల నుంచి 40 కిలోల బస్తాకు అదనంగా ధాన్యం సేకరించారు. దీనివల్ల నకిరేకల్‌కు చెందిన 5మిల్లుల పరిధిలో 71 మంది రైతులు సుమారు రూ. మూడు లక్షలు నష్టపోయారని విజిలెన్స్‌ అధికారులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని