ఉపాధ్యాయ ఖాళీలు, సీనియారిటీ జాబితా నేడు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ ఖాళీలతో పాటు ప్రధానోపాధ్యాయులుగా, స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందేందుకు సీనియారిటీ జాబితాను శుక్రవారం డీఈఓలు ప్రకటించనున్నారు.

Published : 27 Jan 2023 05:12 IST

కాలపట్టికతో పాటు మార్గదర్శకాలపై జీఓ జారీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ ఖాళీలతో పాటు ప్రధానోపాధ్యాయులుగా, స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందేందుకు సీనియారిటీ జాబితాను శుక్రవారం డీఈఓలు ప్రకటించనున్నారు. విద్యాశాఖ కూడా బుధవారం అర్ధరాత్రి బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలపై జీఓ జారీచేసింది. దాన్ని గురువారం ఉదయం బయటపెట్టారు. ఫలితంగా జీఓ విడుదలపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. ఇటీవల జరిగిన డీఈఓల సమావేశంలో ఇచ్చిన కాలపట్టిక, మార్గదర్శకాల్లోని అంశాలే జీఓలో ఉన్నాయి. బదిలీల కోసం శనివారం నుంచి మూడ్రోజులపాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రాష్ట్రంలో 2015 జులైలో చివరిసారిగా పదోన్నతులు, బదిలీలు ఒకేసారి జరపగా...మళ్లీ ఏడున్నర సంవత్సరాల తర్వాత ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2018లో బదిలీలు మాత్రమే చేశారు. ఈసారి మొత్తం 9,700 మందికి పదోన్నతులు దక్కనున్నాయి. మరో 30 వేల మంది బదిలీ కానున్నారు. మొత్తం 37 రోజులపాటు కొనసాగనున్న ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సీనియర్‌ అధికారులను నియమించారు.

ప్రధానోపాధ్యాయుల ఖాళీలివి...

* మల్టీ జోన్‌-1లోని 19 జిల్లాల్లో 2,420 మంది హెచ్‌ఎంలు ఉండాలి. అందులో 1096 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

* మల్టీ జోన్‌-2లో 14 జిల్లాలు ఉండగా అందులో ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో కలిపి మొత్తం హెచ్‌ఎం మంజూరు పోస్టులు 1,966. అందులో 906 ఖాళీగా ఉన్నాయి. వీటిని ప్రస్తుతం స్కూల్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారికి పదోన్నతులు ఇచ్చి భర్తీ చేస్తారు.

317 జీఓ ఉపాధ్యాయులకు నిరాశే

గత ఏడాది జనవరిలో 317 జీఓ ద్వారా కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయులను కేటాయించారు. ఆ క్రమంలో దాదాపు 25 వేల మంది ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ అయ్యారు. బదిలీకి కనీస స్టేషన్‌ సర్వీస్‌ రెండేళ్లు కాకుండా జీరో సర్వీస్‌తో 317 జీఓ బాధితులకు కూడా దరఖాస్తుకు అవకాశం కల్పించాలని పలు సంఘాలు విద్యాశాఖకు విన్నవించినా పట్టించుకోలేదు. దాంతో ఇప్పటివరకు ఉన్న ఆశ ఆ ఉపాధ్యాయుల్లో ఆవిరైపోయింది. అందరికీ అవకాశం ఇస్తే మారుమూల పాఠశాలల్లో పనిచేసే వారు ఉండరని ప్రభుత్వం భావించినట్లు తెలిసింది. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు పనిచేసే చోటే ఉంటారని, ఆ తర్వాత టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు(టీఆర్‌టీ) ద్వారా కొత్త ఉపాధ్యాయులు వస్తారు కదా అని చెప్పినా ప్రభుత్వం తిరస్కరించింది. దీన్ని బట్టి టీఆర్‌టీ ప్రకటన ఇప్పట్లో రాకపోవచ్చని అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని