భారాస ప్రభుత్వ ఉల్లంఘనలతో విసిగిపోయా

కొందరికి ఫామ్‌హౌస్‌లు ఉండడం కాదు.. అందరికీ ఫామ్‌లు(పొలాలు) ఉండాలి. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు.. రాష్ట్ర విద్యాలయాల్లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలుండాలి. రాష్ట్రంలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులున్నాయి.

Published : 27 Jan 2023 05:13 IST

గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యం తగ్గించారు
అంబేడ్కర్‌ చూపిన మార్గానికి ఇది వ్యతిరేకం
కరోనా ఉందన్నారు.. 5 లక్షల మందితో సభ పెట్టలేదా?
తెలంగాణ ప్రజల కోసం ఉమ్మేసినా తుడుచుకుని వెళ్లిపోతా
కొందరికి ఫామ్‌హౌస్‌లు కాదు..అందరికీ పొలాలుండాలి
గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై  
యువత ధైర్యంగా పోరాడాలని పిలుపు

కొందరికి ఫామ్‌హౌస్‌లు ఉండడం కాదు.. అందరికీ ఫామ్‌లు(పొలాలు) ఉండాలి. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు.. రాష్ట్ర విద్యాలయాల్లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలుండాలి. రాష్ట్రంలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులున్నాయి.

తమిళిసై

ఈనాడు- హైదరాబాద్‌, పుదుచ్చేరి: తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యాన్ని తక్కువ చేసిందని, ఈ సందర్భంగా అధికారిక కార్యక్రమం ఏదీ నిర్వహించలేదని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంటే కొత్తగా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం కాదు... పేదలందరికీ ఇళ్లు కావాలన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం, పుదుచ్చేరిలోని ‘రాజ్‌నివాస్‌’లో నిర్వహించిన ‘ఎట్‌హోం’లో ఆమె మాట్లాడారు. ‘‘భారాస ప్రభుత్వం సంప్రదాయాలను ఉల్లంఘిస్తోంది.. విసుగెత్తిపోయా. ఇది రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చూపిన మార్గానికి వ్యతిరేకం. నేను కొందరికి నచ్చకపోవచ్చు. తెలంగాణ ప్రజలంటే నాకెంతో ఇష్టం. ఇక్కడివారి కోసం ఎంత కష్టమైనా భరించి పనిచేస్తా. ఎవరైనా నా మీద ఉమ్మేసినా తుడుచుకుని వెళ్లిపోతా. తెలంగాణలో గణతంత్ర దినోత్సవాల కోసం రాష్ట్ర పౌరులు హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కోర్టు సైతం తీవ్రంగా తప్పుపట్టింది. రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్రానికి లేఖ రాశా. ప్రతినెలా ఇలా కేంద్రానికి నివేదికలు పంపుతా. హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో గణతంత్ర దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించి ఉండాల్సింది. కార్యక్రమం నిర్వహించకపోవడానికి కరోనా ఉందని వంక చెప్పింది. కానీ, ఇటీవలే దాదాపు అయిదు లక్షల మందికి పైగా ప్రజలతో ఓ కార్యక్రమాన్ని వాళ్లు నిర్వహించుకోలేదా?  

రోజుకు 22 మంది ఆత్మహత్యలు

రోజుకు 22 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమస్యలపై యువత ధైర్యంగా నిలబడి పోరాడాలి. శతాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్‌ ఎన్నో రంగాల్లో శరవేగంగా దూసుకెళ్తోంది. వైద్యం, ఐటీ రంగాల్లో రాజధాని ప్రత్యేక గుర్తింపు సాధించింది. రాష్ట్రంలో రహదారుల విస్తరణకు భారీగా నిధులు కేటాయిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు. ఇటీవలే తెలుగు రాష్ట్రాలకు ప్రధాని వందేభారత్‌ రైలును కేటాయించారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహకారాన్ని రాజ్‌భవన్‌ అందిస్తోంది. గిరిజనుల్లో పోషకాహార సమస్యను నివారించడానికి విశేషంగా కృషిచేస్తున్నాం. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నా. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. ప్రజాస్వామ్య హక్కును నిలబెట్టుకుందాం. రాష్ట్ర అభివృద్ధిలో నా పాత్ర ఎప్పుడూ ఉంటుంది’’ అని గవర్నర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాశరధి కృష్ణమాచార్య రచించిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ గేయాన్ని చదివారు. జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం గవర్నర్‌.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.  రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. గవర్నర్‌ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించి, అనంతరం ఆంగ్లంలో కొనసాగించారు.  

విశిష్ట సేవలకు సత్కారం

విశిష్ట సేవలందించిన పలువురిని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సత్కరించారు. సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌, భగవాన్‌ మహావీర్‌ వికలాంగుల సహాయ సమితి ట్రస్టు సభ్యులు, క్రీడా విభాగంలో శ్రీజ ఆకుల(టేబుల్‌ టెన్నిస్‌) తరఫున ఆమె తల్లిదండ్రులు, పారా అథ్లెటిక్స్‌ విభాగంలో కుడుముల లోకేశ్వరి, విద్య, యువత ఉపాధి విభాగంలో ఎం.బాలలతను సర్టిఫికెట్‌, శాలువా, మెమొంటోలతో గవర్నర్‌ సత్కరించారు. రాజ్‌భవన్‌లో జాతీయజెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం పుదుచ్చేరి వెళ్లారు. అంతకుముందు పరేడ్‌ మైదానంలోని సైనికవీరుల స్మారకానికి గవర్నర్‌ నివాళులు అర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని