హామీల అమలే లక్ష్యం!

రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పెద్ద పీట వేస్తూ భారీ బడ్జెట్‌కు రంగం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెడుతున్న పద్దులో కీలక పథకాలకు కేటాయింపులు పెంచడంతో పాటు ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయడం లక్ష్యంగా ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది.

Published : 27 Jan 2023 04:29 IST

సంక్షేమానికి ప్రాధాన్యం
రైతు రుణమాఫీకి ప్రత్యేకంగా నిధులు
ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్‌పై తుది కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పెద్ద పీట వేస్తూ భారీ బడ్జెట్‌కు రంగం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెడుతున్న పద్దులో కీలక పథకాలకు కేటాయింపులు పెంచడంతో పాటు ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయడం లక్ష్యంగా ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. తెరాస(భారాస) ఎన్నికల హామీ అయిన రైతు రుణమాఫీకి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేయనున్నట్లు ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చింది. ఇందులో మొదటి ఏడాది రూ.25 వేల లోపు రుణాలను మాఫీ చేయగా తర్వాత క్రమంగా పెంచుకుంటూ రూ.37 వేల లోపు అప్పులను రద్దు చేశారు. తర్వాత రుణమాఫీ ఆగిపోయింది. 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు రుణమాఫీకి నిధులు కేటాయించారు. ఆ ఏడాది రూ.5,225 కోట్లను కేటాయించినా వ్యయంచేయలేదు. 2022-23లో నిధులు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో రుణమాఫీ అమలుకు వీలుగా బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది.

* 2022-23లో దళితబంధుకు రూ.17 వేల కోట్లను కేటాయించగా ఈ సారి కూడా అంతే మొత్తంలో నిధులివ్వనున్నట్లు తెలిసింది. రైతుబంధుకు రూ.15 వేలకోట్ల మేర కేటాయింపులు ఉండనున్నాయి. రైతుబీమాకు కేటాయింపులను వాస్తవిక ప్రాతిపదికగా ఉండేలా కసరత్తు చేస్తున్నారు.  రెండు పడకల గదుల ఇళ్లకు 2022-23లో రూ.12 వేలకోట్లు కేటాయించగా ఈ సారీ యథాతథంగా నిధులివ్వనున్నట్లు సమాచారం. కేసీఆర్‌ కిట్‌కు రూ.500 కోట్లకు పైగా కేటాయించనున్నారు.

* కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ కోసం తొలిసారిగా బడ్జెట్‌ కేటాయింపులు 3 వేల కోట్ల మేరకు చేరనున్నట్లు తెలిసింది. ఈఆర్థిక సంవత్సరంలో రూ.2,750 కోట్లుండగా వచ్చే ఏడాది నిధులు పెరగనున్నాయి.

* 57 ఏళ్లకే ఆసరా పింఛను అమలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది కేటాయింపులు రూ.12 వేలకోట్లు దాటనున్నాయి. వ్యక్తిగత లబ్ధిని చేకూర్చే పథకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బడ్జెట్‌లో నిధులు తగ్గకూడదనే ప్రాథమిక సూత్రం ప్రాతిపదికగా బడ్జెట్‌ ప్రతిపాదనలకు తుదిరూపు ఇస్తున్నారు.


నియోజకవర్గానికి వేయి మంది... రూ.1000 కోట్లు

సొంత జాగా గల వారికి ఇంటి నిర్మాణానికి రూ.మూడు లక్షల సాయం పథకానికి బడ్జెట్‌లో రూ.వేయి కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి వేయి మందికి చొప్పున సాయం అందించనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు సైతం సిద్ధమయ్యాయి. కొత్త బడ్జెట్‌లో కేటాయింపుల ఆధారంగా పథకాన్ని ప్రారంభించే వీలుంది. ఈ పథకం కోసం నియోజకవర్గాల వారీగా దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఇన్‌ఛార్జి మంత్రి అధ్యక్షతన ఉన్న కమిటీ వారిని ఎంపిక చేస్తుందని తెలిసింది.

* వివిధ వర్గాల సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్ద పీటవేయనున్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు రూ.35 వేలకోట్లకు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. దళితబంధు నేపథ్యంలో ఎస్సీ సంక్షేమానికి 2022-23 బడ్జెట్‌లో రూ.20,624 కోట్లు కేటాయించగా ఈ సారి నిధులు పెరగనున్నాయి. రెండు మూడ్రోజుల్లో బడ్జెట్‌ ప్రతిపాదనలకు తుదిరూపు ఇచ్చేలా ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. వేతన సవరణ ఒప్పందం అమలుతో పాటు కొత్త ఉద్యోగ నియామకాల నేపథ్యంలో వేతనాలు, పింఛన్లకు కేటాయింపులు భారీగా ఉంటాయని తెలుస్తోంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి అన్ని ప్రకటనలను రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎన్నికలకు ముందే పూర్తి చేసేలా దృష్టిసారించినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని