కోర్టుల్లో ఖాళీల భర్తీకి చర్యలు

జిల్లా కోర్టుల్లో జడ్జీలు, న్యాయాధికారులతోపాటు హైకోర్టు, కింది కోర్టుల్లో సిబ్బంది నియామకాలకు చర్యలు తీసుకుంటున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ వెల్లడించారు.

Published : 27 Jan 2023 04:29 IST

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

ఈనాడు, హైదరాబాద్‌: జిల్లా కోర్టుల్లో జడ్జీలు, న్యాయాధికారులతోపాటు హైకోర్టు, కింది కోర్టుల్లో సిబ్బంది నియామకాలకు చర్యలు తీసుకుంటున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ వెల్లడించారు. భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలకు అనుగుణంగా పోస్టుల భర్తీకి నియామక క్యాలెండర్‌ను విడుదల చేసినట్లు వెల్లడించారు. రిపబ్లిక్‌ వేడుకల సందర్భంగా హైకోర్టులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. ఇటీవల 12 మంది జిల్లా జడ్జీల నియామక ప్రక్రియ పూర్తి చేసి ఉత్తర్వుల కోసం ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైకోర్టు పరిపాలన నిమిత్తం ప్రభుత్వం అదనంగా 779 పోస్టులు మంజూరు చేసిందని తెలిపారు. కోర్టు భవనాలన్నీ న్యాయ నిర్మాణ్‌ డాక్యుమెంట్‌ ప్లాన్‌ ప్రకారం ఏకరూపంలో ఉండేలా చూస్తున్నామన్నారు.  గతంలో ఏపీ పరిపాలన ట్రైబ్యునల్‌ ఉన్న భవనాన్ని పునర్నిర్మిస్తున్నామని, అక్కడ కుటుంబ న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తామన్నారు. పెండింగ్‌ కేసుల  తగ్గింపునకు ప్రత్యేక ధర్మాసనాలను ఏర్పాటు చేశామని..ఫలితాలు త్వరలో కనిపిస్తాయన్నారు. రికార్డులను డిజిటలీకరించే కార్యక్రమం కూడా కొనసాగుతోందని తెలిపారు. మొదటి కోర్టు హాలులో విచారణ ప్రత్యక్ష ప్రసారం ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టామని, త్వరలో అన్ని కోర్టు హాళ్లలోను అమలు చేస్తామన్నారు. రాజ్యాంగ సూత్రాలను పరిరక్షించడానికి న్యాయవ్యవస్థ కృషి చేస్తుందని జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.రఘునాథ్‌లు ప్రసంగించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి యామినీరెడ్డి బృందం నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ వద్ద ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని