ఏ దేశంలో ఎందరున్నారు?

ఉపాధి కోసం రాష్ట్రం నుంచి ఎక్కువ మంది గల్ఫ్‌కు వలస వెళ్తుంటారు. ఆయా దేశాల్లో సుమారు 8 లక్షల మంది కార్మికులుగా జీవనం సాగిస్తున్నట్లు అంచనా.

Published : 27 Jan 2023 05:04 IST

గల్ఫ్‌ వలసదారులపై ఆరా
-  వివరాలు సేకరిస్తున్న ఇంటెలిజెన్స్‌

ఈనాడు నిజామాబాద్‌: ఉపాధి కోసం రాష్ట్రం నుంచి ఎక్కువ మంది గల్ఫ్‌కు వలస వెళ్తుంటారు. ఆయా దేశాల్లో సుమారు 8 లక్షల మంది కార్మికులుగా జీవనం సాగిస్తున్నట్లు అంచనా. పర్యాటక (విజిట్‌) వీసాలపై కొన్నిరోజుల అనుమతితో అక్కడకు వెళ్తున్నవారిలో చాలా మంది అనధికారికంగా అక్కడే ఉండిపోతున్నారు. ట్రావెల్‌ ఏజెంట్ల మోసపూరిత మాటలను నమ్మి, నిబంధనలు తెలుసుకోకుండానే గల్ఫ్‌ వెళ్లి అక్కడే చిక్కుకుంటున్నారు. విదేశాంగ శాఖ వద్ద.. కంపెనీ వీసాలతో వెళ్లేవారి వివరాలే ఉంటాయిగానీ పర్యాటక వీసాలపై వెళ్లి, అక్కడే ఉండిపోయిన వారి సమాచారం ఉండదు. ఈ నేపథ్యంలో.. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారి వివరాలను ఇంటెలిజెన్స్‌ వర్గాలు సేకరిస్తున్నాయి. ఏ దేశంలో ఎందరు ఉన్నారు, వారు ఎప్పుడు వెళ్లారు తదితర గణాంకాలను గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ, బాధిత సంఘాల ప్రతినిధుల ద్వారా తెలుసుకుంటున్నాయి.

ఓట్ల కోసమా?.. నిధుల కోసమా?

విజిట్‌ వీసాలపై వివిధ దేశాలకు వెళ్లేవారు నిర్ణీత గడువులోపు తిరిగి రావాల్సి ఉంటుంది. ఆ వీసాలపై వెళ్లిన వారు ట్రావెల్‌ ఏజెంట్లు, సంస్థల మోసపూరిత మాటలు, ఇతర కారణాల వల్ల అక్కడే చిక్కుకుపోతున్నారు. స్వదేశం తిరిగిరాలేక కొందరు జైళ్లలో మగ్గిపోతుండగా మరికొందరు అనధికారికంగా కాలం వెళ్లదీస్తున్నారు. జీవనభృతి కోసం చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి అక్కడి దేశంలో కనీస హక్కులూ ఉండవు. అనారోగ్యానికి గురైనా, ప్రమాదం బారినపడినా పట్టించుకునే వారూ ఉండరు. ఇలాంటి వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని, నకిలీ ఏజెంట్లను అరికట్టాలన్న డిమాండ్‌ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఎన్నికల సందర్భంలోనూ గల్ఫ్‌ బాధితుల అంశం చర్చకు వస్తుంటుంది. వీరి కుటుంబాల ఓట్లు ఎన్నికల్లో కీలకంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్‌ వర్గాలు గత వారం రోజులుగా గల్ఫ్‌ బాధితులపై ఆరా తీస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. వివరాలు సేకరిస్తున్నది ఎన్నికల్లో ఓట్ల కోసమా? ఎన్‌ఆర్‌ఐ పాలసీకి సంబంధించిన విధివిధానాల ఖరారుకా? బడ్జెట్‌లో నిధుల కేటాయింపునకా? అన్న చర్చలు సాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు