హైదరాబాద్‌లో ‘శాండోజ్‌’ గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రం

రాష్ట్ర రాజధాని నగరంలో మరో ఫార్మా, గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రం ఏర్పాటు కానుంది. ప్రముఖ లైఫ్‌ సైన్సెస్‌ దిగ్గజ కంపెనీ శాండోజ్‌ దీన్ని నెలకొల్పనుంది.

Updated : 01 Feb 2023 06:42 IST

జీనోమ్‌ వ్యాలీలో అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల కూడా
మంత్రి కేటీఆర్‌ సమక్షంలో వెల్లడించిన ప్రతినిధి బృందం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని నగరంలో మరో ఫార్మా, గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రం ఏర్పాటు కానుంది. ప్రముఖ లైఫ్‌ సైన్సెస్‌ దిగ్గజ కంపెనీ శాండోజ్‌ దీన్ని నెలకొల్పనుంది. ఈ కేంద్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తమ కార్యకలాపాలకు నాలెడ్జ్‌ సర్వీసెస్‌ను అందించనున్నట్లు తెలిపింది. ఇందులో తొలుత 800 మంది ఉద్యోగులు పనిచేస్తారని, తర్వాత దశలవారీగా వీరి సంఖ్యను, 1800కు పెంచనున్నట్లు సంస్థ పేర్కొంది. దీంతో పాటు జీనోమ్‌ వ్యాలీలో ఇప్పటికే ఉన్న తమ తయారీ కేంద్రానికి అనుబంధంగా ఆటోమేషన్‌తో కూడిన అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాలను నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ప్రగతిభవన్‌లో మంగళవారం శాండోజ్‌ కంపెనీ సీఈవో రిచర్డ్‌ సెయ్‌నోర్‌ ప్రతినిధి బృందం.. పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమై ఈ మేరకు ప్రకటించింది. హైదరాబాద్‌లో గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి.. ఇక్కడి లైఫ్‌ సైన్సెస్‌ అనుకూలాంశాలే ప్రధాన కారణమని శాండోజ్‌ బృందం తెలిపింది. ఇప్పటికే తమ గ్రూప్‌ సంస్థ నోవార్టిస్‌ హైదరాబాద్‌ కేంద్రంగా పరిశోధనలు నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. తమ సంస్థ వెయ్యికి పైగా మాలిక్యూల్స్‌ని కలిగి ఉన్నదని, దాదాపు పది బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోందని, కంపెనీ విస్తరణ, భవిష్యత్తు ప్రణాళికలకు హైదరాబాద్‌ అనుకూలంగా ఉంటుందన్న ఆశాభావాన్ని బృందం వ్యక్తం చేసింది. ప్రభుత్వపరంగా మంత్రి కేటీఆర్‌ అందిస్తున్న సహాయ సహకారాలకు ధన్యవాదాలు తెలిపింది.

మరింత వృద్ధి దిశగా: మంత్రి కేటీఆర్‌

గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రం ఏర్పాటుకు శాండోజ్‌ ముందుకు రావడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడున్న వ్యాపార అనుకూలత, అద్భుతమైన మానవ వనరుల ఆధారంగా లైఫ్‌ సైన్సెస్‌ రంగం మరింతగా వృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రపంచ దిగ్గజసంస్థ నోవార్టిస్‌ రెండో అతి పెద్ద కార్యాలయం ఉందని, ఇదే స్థాయిలో శాండోజ్‌ కూడా తన కార్యకలాపాలను విస్తరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని, ఆ పరిశ్రమ అభివృద్ధికి చేపడుతున్న ప్రణాళికలపై కంపెనీ బృందానికి మంత్రి వివరాలు అందజేశారు. హైదరాబాద్‌ ఫార్మాసిటీలో శాండోజ్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో శాండోజ్‌ సీఈవో రిచర్డ్‌ సెయ్‌నోర్‌, చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ క్లేరీ డి అబ్య్రూ హేలింగ్‌, నోవార్టిస్‌ కార్పొరేట్‌ సెంటర్‌ హెడ్‌ నవీన్‌ గుళ్లపల్లి, భారత్‌లో శాండోజ్‌ అభివృద్ధి కేంద్రం అధిపతి డాక్టర్‌ వందన సింగ్‌, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ ఫార్మా డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు