రెరాకు పూర్తిస్థాయి అథారిటీ

రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)కి ఛైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నియమించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Published : 01 Feb 2023 03:58 IST

ఛైర్మన్‌తోపాటు ఇద్దరు సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)కి ఛైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నియమించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రంలో 2017లో రెరా అమలులోకి వచ్చింది. ఏడాదిలోగా పూర్తిస్థాయి అథారిటీని ఏర్పాటు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం ఇప్పటివరకు ఆ విషయంలో దృష్టిపెట్టలేదు. అధికారులతోనే నెట్టుకువస్తోంది. అప్పటి రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ ఛైర్మన్‌గా రెరా అథారిటీ ఏర్పాటైంది. తర్వాత మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఛైర్మన్‌గా కొనసాగారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ కావటంతో ఆ పోస్టు కూడా ఖాళీ అయింది. అధికారులతో వ్యవహారాలు నడపాల్సి రావటంతో రెరా నిబంధనలు అమలు కాగితాలకే పరిమితమయ్యాయి. మరోవైపు హైదరాబాద్‌తోపాటు పలు నగరాల్లో ఇబ్బడిముబ్బడిగా నిర్మాణాలు జరుగుతున్నాయి. పశ్చిమబెంగాల్‌, తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో పూర్తిస్థాయి రెరా అథారిటీలు అమలులో ఉన్నాయి. పూర్తిస్థాయిలో రెరా అథారిటీని ఏర్పాటు చేయాలని రెరా సెంట్రల్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ ఇటీవల రాష్ట్రానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఖాళీగా ఉన్న మూడు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరింది. ఛైర్మన్‌తోపాటు సభ్యుల పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 17 సాయంత్రం అయిదు గంటలలోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పేర్కొంది. ఇందుకు సంబంధించిన సమాచారం https://www.telangana.gov.in , https://rera.telangana.gov.in లలో అందుబాటులో ఉందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని