కోతలు.. వివక్షల బడ్జెట్‌

కేంద్ర బడ్జెట్‌ దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసేలా ఉందని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. ఇది రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్‌ అని అభివర్ణించారు.

Published : 02 Feb 2023 05:49 IST

వెనకబడిన ప్రాంతాల నిధి రూ.1,350 కోట్లు ఇవ్వలేదు
కర్ణాటకకు మాత్రం రూ.5,300 కోట్లు కేటాయించారు
రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, కాళేశ్వరానికి జాతీయహోదా ప్రస్తావన లేదు
ఆర్థికమంత్రి హరీశ్‌రావు ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌ దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసేలా ఉందని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. ఇది రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్‌ అని అభివర్ణించారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. దేశ రైతాంగాన్ని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరచడంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి మరోసారి కేంద్రం తీవ్ర  అన్యాయం చేసిందని మండిపడ్డారు. ‘తొమ్మిదేళ్లుగా అడుగుతున్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ప్రస్తావన లేదు. గిరిజన వర్సిటీకి ఇచ్చిన నిధులు అంతంతమాత్రమే. విభజన హామీలలో ఒక్కదాన్నీ అమలు చేయలేదు. కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు హోదా అంశం మర్చిపోయారు. నేతన్నలకు సంబంధించిన జీఎస్టీ రాయితీలు, ప్రత్యేక ప్రోత్సాహకాల సంగతి సరేసరి. ఉపాధి హామీ పథకానికి రూ.29,400 కోట్లు తగ్గించి కూలీల ఉసురు తీసేందుకు కేంద్రం ప్రభుత్వం ఉపక్రమించింది. పేదల ఆహార భద్రత నిధుల్లో గతేడాదితో పోల్చితే 31 శాతం కోత పెట్టింది. దేశంలో వివిధ రాష్ట్రాలకు 157 వైద్య కళాశాలలు మంజూరు చేసినా, తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. నర్సింగ్‌ కళాశాలల విషయంలోనూ అంతే. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు వెనకబడ్డ ప్రాంతాల నిధి కింద హక్కుగా రావాల్సిన రూ.1,350 కోట్లు ఇవ్వకుండా మొండిచేయి చూపింది. అదే సమయంలో కర్ణాటకలోని కరవు, వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి రూ.5,300 కోట్లు కేటాయించి వివక్ష చాటుకుంది. కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేస్తామనే భరోసా ఇవ్వలేదు. ఉద్యోగులు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు ఆశాజనకంగా ఏమీ లేవు. సెస్సులు, పన్నుల భారం నుంచి ఉపశమనం లేదు. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిధులు ఖచ్చితంగా విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ కోత విధించి..గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలకు తీవ్ర అన్యాయం చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రం వసూలుచేసే మొత్తం పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు 41 శాతం ఇవ్వాల్సి ఉన్నా.. 30.4 శాతం మాత్రమే ఇస్తోంది. రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు పాటిస్తున్నప్పటికీ.. కేంద్రం పాటించకపోవడంతో దేశ ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతిని అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. మొత్తంగా ఇది భ్రమల, పేదల వ్యతిరేక, తెలంగాణకు మొండిచేయి చూపిన బడ్జెట్‌’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు