చిన్నారుల మోములో చిరునవ్వు

రాష్ట్రంలో ఆపరేషన్‌ స్మైల్‌-9 ముగిసింది. తప్పిపోయిన, అపహరణకు గురైన చిన్నారులను గుర్తించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని జనవరి 1న ప్రారంభించారు.

Published : 02 Feb 2023 05:22 IST

ఆపరేషన్‌ స్మైల్‌-9లో 2,814 మంది బాలల గుర్తింపు
కుటుంబాల చెంతకు 88 శాతం మంది చిన్నారులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆపరేషన్‌ స్మైల్‌-9 ముగిసింది. తప్పిపోయిన, అపహరణకు గురైన చిన్నారులను గుర్తించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని జనవరి 1న ప్రారంభించారు. తెలంగాణ మహిళా భద్రత విభాగం నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించిన ఈ ఆపరేషన్‌లో పలు ప్రభుత్వశాఖలు పాల్గొన్నాయి. తెలంగాణ పోలీసులు రూపొందించిన దర్పణ్‌, ఫేషియల్‌ రికగ్నిషన్‌ విధానాన్ని వినియోగించి 2,814 మంది బాధిత బాలలను గుర్తించారు. వీరిలో 88 శాతం మందిని తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

ఆరేళ్ల తర్వాత కుటుంబం చెంతకు...

ఆపరేషన్‌లో భాగంగా నల్గొండ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ విభాగం(ఏహెచ్‌టీయూ) స్థానిక రోహెత్‌ స్నేహభవన్‌ బాలల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించింది. 16 ఏళ్ల బాలుడు గత ఆరేళ్లుగా అక్కడే ఉంటున్నట్లు గుర్తించింది. 2017లో కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లో అదృశ్యమైనట్లు తేలింది. ఏహెచ్‌టీయూ బృందం ఆ బాలుడిని సమీపంలోని ఆధార్‌ కేంద్రానికి తీసుకెళ్లి వివరాలను తనిఖీ చేసింది. ఆధార్‌ వివరాల ఆధారంగా గత నెల 21న బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

* కిరాణా దుకాణానికి వెళ్లిన 16 ఏళ్ల బాలిక ఇంటికి తిరిగి రాలేదని నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో గతేడాది జూన్‌ 8న కేసు నమోదైంది. ఆపరేషన్‌లో భాగంగా ఏహెచ్‌టీయూ బృందం గత నెల 9న బాలికను గుర్తించి కుటుంబానికి అప్పగించింది.

*  హైదరాబాద్‌ ఫలక్‌నుమా రెయిన్‌బో అనాథాశ్రమం నుంచి గతేడాది ఆగస్టు 10న బాలిక తప్పిపోయింది. ఏహెచ్‌టీయూ బృందం గత నెల 10న బాలికను గుర్తించి తిరిగి ఆశ్రమానికి చేర్చింది.

*  వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని పర్కాల పద్మశాలివాడకు చెందిన 16ఏళ్ల బాలుడు గతేడాది జులై 12న ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఏహెచ్‌టీయూ బృందం అతడిని గుర్తించి గత నెల 7న తల్లిదండ్రులకు అప్పగించింది.


  దర్పణ్‌ యాప్‌తో పరిశీలన
- శిఖా గోయెల్‌, తెలంగాణ మహిళాభద్రత విభాగం అదనపు డీజీపీ

మొత్తం ఆపరేషన్‌లో 2814 మంది చిన్నారులకు విముక్తి కలిగించాం. వీరిలో 2421 మంది బాలురు, 393 మంది బాలికలున్నారు. ఆపరేషన్‌లో భాగంగా 352 మంది బాలల వివరాలను దర్పణ్‌ యాప్‌లో నిక్షిప్తం చేశారు. మిస్సింగ్‌ చిల్డ్రన్‌ డేటాబేస్‌లోని 802 మంది చిన్నారుల వివరాలను పరిశీలించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన 403 మంది నిందితులను గుర్తించి 391 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. వీరిలో 390 మందిని అరెస్ట్‌ చేశాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు