బదిలీ అయినా పదోన్నతులిచ్చారు

రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయిన మరుసటి రోజు నవీన్‌ మిత్తల్‌.. ఇద్దరు డిగ్రీ అధ్యాపకులకు ప్రిన్సిపాళ్లుగా తాత్కాలిక పదోన్నతులిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Published : 03 Feb 2023 04:05 IST

చర్చనీయాంశంగా మారిన నవీన్‌ మిత్తల్‌ ఉత్తర్వులు
ప్రిన్సిపాళ్లుగా ఇద్దరు డిగ్రీ అధ్యాపకుల నియామకం

ఈనాడు, హైదరాబాద్‌: రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయిన మరుసటి రోజు నవీన్‌ మిత్తల్‌.. ఇద్దరు డిగ్రీ అధ్యాపకులకు ప్రిన్సిపాళ్లుగా తాత్కాలిక పదోన్నతులిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కళాశాల, సాంకేతిక, ఇంటర్‌ విద్యాశాఖల కమిషనర్‌గా, ఇంటర్‌ బోర్డు కార్యదర్శిగా ఉన్న నవీన్‌ మిత్తల్‌ను ప్రభుత్వం జనవరి 31న రెవెన్యూశాఖకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఈ నెల 1వ తేదీన రెవెన్యూ శాఖలో బాధ్యతలు స్వీకరించారు. అదేరోజు ఇద్దరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు ప్రిన్సిపాళ్లుగా తాత్కాలిక పదోన్నతులిస్తూ కళాశాల విద్యాశాఖ కమిషనర్‌గా ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల ఆంగ్ల అధ్యాపకుడు డాక్టర్‌ కేఎస్‌ఎస్‌ రత్నప్రసాద్‌కు సంగారెడ్డిలోని తార డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. నల్గొండ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్‌ ఎల్‌.కమలను యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట కళాశాల ప్రిన్సిపల్‌గా పదోన్నతిపై నియమించారు. జనవరి 27వ తేదీన జరిగిన సప్లిమెంటరీ డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ ఆమోదం మేరకు తాత్కాలిక పదోన్నతి ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు, ప్రభుత్వ జూనియర్‌ అధ్యాపకుల సంఘం(జీజేఎల్‌ఏ) ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న బల్‌రామ్‌ జాదవ్‌ అదర్‌ డ్యూటీ(ఓడీ) సౌకర్యాన్ని రద్దు చేస్తూ మిత్తల్‌ ఈ నెల 1నే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఓడీ గడువు 2022 డిసెంబరు 31 వరకే ఉంది. ఈ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా మధుసూదన్‌రెడ్డిపై నవీన్‌ మిత్తల్‌ ఇటీవల పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నవీన్‌ మిత్తల్‌ అంతకుముందు నిర్వహించిన పాత స్థానాల్లో ప్రభుత్వం ఎవరికీ అదనపు బాధ్యతలు అప్పగించలేదు. అలాగని తదుపరి ఉత్తర్వులిచ్చే వరకూ ఆయనే కొనసాగాలనీ చెప్పలేదు. అయినప్పటికీ బదిలీ అయిన తర్వాత కూడా ఆయన ఉత్తర్వులు జారీ చేయడం విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బదిలీ అయిన తర్వాత నవీన్‌ మిత్తల్‌ జారీ చేసిన, చేస్తున్న ఉత్తర్వులపై ప్రభుత్వం విచారణ జరిపించాలని జీజేఎల్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ ఇంటర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ విద్యకు సంబంధించిన దస్త్రాలను తీసుకురావాలంటూ ఆయా శాఖల అధికారులపై ఆయన ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని