జాతీయ పత్తి సంస్థకు విపత్తు

దేశంలోని పత్తి రైతులకు ఆపత్కాలంలో మద్దతుధరను కల్పిస్తూ అండగా నిలుస్తున్న జాతీయ పత్తి సంస్థ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా).. మూసివేత సంస్థల జాబితాలో చేరుతుందా?..పత్తి కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయనుందా? బుధవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో సీసీఐపై తీసుకున్న  నిర్ణయం దేశవ్యాప్తంగా రైతులను, ఆ సంస్థ ఉద్యోగులను.

Updated : 03 Feb 2023 05:42 IST

బడ్జెట్‌లో రూ.లక్ష మాత్రమే కేటాయింపు
నిరుటి కేటాయింపులు రూ.9 వేల కోట్లు
రైతుల్లో గుబులు-రాష్ట్ర ప్రభుత్వవర్గాల్లో ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని పత్తి రైతులకు ఆపత్కాలంలో మద్దతుధరను కల్పిస్తూ అండగా నిలుస్తున్న జాతీయ పత్తి సంస్థ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా).. మూసివేత సంస్థల జాబితాలో చేరుతుందా?..పత్తి కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయనుందా? బుధవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో సీసీఐపై తీసుకున్న  నిర్ణయం దేశవ్యాప్తంగా రైతులను, ఆ సంస్థ ఉద్యోగులను. రాష్ట్ర ప్రభుత్వాలను విస్మయానికి గురి చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థకు కేంద్రం కేటాయింపులు రూ.9,243 కోట్లు కాగా... తాజా (2023-24) బడ్జెట్‌లో కేవలం రూ.లక్ష మాత్రమే కేటాయించింది. గత కొన్నేళ్లుగా సీసీఐపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి తోడు ఒక్కసారిగా  మొత్తం బడ్జెట్‌ను కుదించడం కలకలం సృష్టించింది. పత్తి ప్రధాన పంటగా ఉన్న తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. 

ఘన చరిత్ర

1956 కంపెనీల చట్టం కింద కేంద్ర ప్రభుత్వం జౌళి శాఖ పరిధిలో 1970 జులై 31న సీసీఐని ప్రారంభించింది. నవీ ముంబై (మహారాష్ట్ర)లోని బేలాపూర్‌ సంస్థ ప్రధాన కార్యాలయం ఉండగా... దేశవ్యాప్తంగా నాలుగు జోన్ల పరిధిలో 19 శాఖలు, 400 కంటే ఎక్కువ పత్తి సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పత్తి మార్కెటింగ్‌ రంగంలో ఏకైక ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరకు ముడిపత్తిని కొనుగోలు చేయడం దీని ప్రధానవిధి. అనంతరం పత్తి నిల్వలను మిల్లులు, దేశీయ పారిశ్రామిక సంస్థలకు విక్రయిస్తూ దేశీయ వస్త్ర పరిశ్రమకు వెన్నుదన్నుగా ఉంది. తెలంగాణ, ఏపీ తదితర రాష్ట్రాల్లో జరిగే పత్తి కొనుగోళ్లలో ఏటా 42% మేరకు సీసీఐవే ఉంటున్నాయి. రాష్ట్రంలో వరంగల్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌లలో సీసీఐ కేంద్రాలున్నాయి. వాటిలో ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి.

గత ఏడాది సగమే మంజూరు..!

సీసీఐకి కేంద్ర ప్రభుత్వం ధరల మద్దతు పథకం కింద ఏటా బడ్జెట్‌ను కేటాయించాలి. కొనుగోలు చేసిన పత్తి మొత్తం విక్రయం కాకపోవడం, గోదాముల అద్దె ఇతర సమస్యల వల్ల సీసీఐ నష్టాలను ఎదుర్కొంటోంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేటాయింపుల్లో కోత పడుతోంది. దీంతో సీసీఐ బ్యాంకులను ఆశ్రయించి రుణాలు పొంది కొనుగోళ్లను చేపడుతోంది. 2014-15 నుంచి 2020-21 వరకు రూ.17,408 కోట్ల మేరకు సీసీఐ నష్టపోయింది. దీనికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి నిధులిచ్చేందుకు కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నా విడుదల చేయకపోవడంతో సంస్థ సమస్యలను ఎదుర్కొంటోంది. సీసీఐకి 2021-2022లో రూ.8,331.96 కోట్లు, 2022-2023లో రూ.9,243.09 కోట్లు బడ్జెట్‌లో ప్రకటించినా సగం కూడా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో సంస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుండగా... ఈసారి రూ.లక్ష మాత్రమే కేటాయించడం అశనిపాతంగా మారింది.

విలీన ప్రతిపాదనలు

సీసీఐని జాతీయ జనపనార సంస్థ (జ్యూట్‌ కార్పొరేషన్‌)లో విలీనం చేయాలని కేంద్రం తాజాగా ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ సాగుతోందని తెలిసింది. విలీనం అనంతరం సంస్థ పేరు మార్చి పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తుందనే ఆందోళన సంస్థ వర్గాల్లో, రైతుల్లో వ్యక్తమవుతోంది. తాజాగా కేటాయింపులు తగ్గడంతో ఈసారి పత్తి కొనుగోళ్లు జరుగుతాయో లేదోనన్న సందేహాలు నెలకొన్నాయి.

సీసీఐని మూసివేసేందుకే: మంత్రి నిరంజన్‌రెడ్డి

కేంద్ర ప్రభుత్వం సీసీఐకి బడ్జెట్‌ను కుదించడం వెనక దానిని మూసివేసే కుట్ర సాగుతోంది.   సీసీఐ మూసివేత వల్ల పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉండి, పత్తి సాగు విస్తీర్ణంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సీసీఐని వ్యాపార సంస్థగా చూస్తూ లాభనష్టాలతో బేరీజు వేయడం రైతు వ్యతిరేక చర్యే. సీసీఐ మూసివేతను సహించేది లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని