ఇదో పెద్ద జాగు ప్రాజెక్టు!

ఉమ్మడి రాష్ట్రంలో.. సుమారు దశాబ్దంన్నర కిందట చేపట్టిన సాగునీటి ప్రాజెక్టు అది. అప్పట్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఉండగా.. 90 శాతం నిధులు కేంద్రమే భరిస్తూ.. ఆ మేరకు నిధులిచ్చింది.

Published : 03 Feb 2023 04:28 IST

ఒకటిన్నర దశాబ్దం దాటినా పూర్తికాని జగన్నాథపూర్‌
 శిథిలమైన నిర్మాణాలు.. అందని సాగునీరు

ఈనాడు-హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రంలో.. సుమారు దశాబ్దంన్నర కిందట చేపట్టిన సాగునీటి ప్రాజెక్టు అది. అప్పట్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఉండగా.. 90 శాతం నిధులు కేంద్రమే భరిస్తూ.. ఆ మేరకు నిధులిచ్చింది. అయినా పనులు పూర్తికాకపోవడం, చేసినవి కూడా శిథిలావస్థకు చేరడంతో అప్పట్లో ఇచ్చిన సొమ్మును తిరిగి ఎందుకు వసూలు చేయరాదో చెప్పాలంటూ కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తాజాగా తెలంగాణ నీటిపారుదలశాఖకు లేఖ రాసినట్లు తెలిసింది. వెనకబడిన ప్రాంతంలో 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాల్సిన మధ్య తరహా ప్రాజెక్టు పెద్దవాగు జగన్నాథపూర్‌ దుస్థితి ఇది. నిర్మాణం పూర్తి చేయాల్సిన గడువు ముగిసి 15 ఏళ్లు దాటిపోయాయి. అంచనా వ్యయం రూ.124.64 కోట్ల నుంచి రూ.244.66 కోట్లకు పెరిగింది. కానీ ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదు, ఒక్క ఎకరాకూ నీరందలేదు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని జగన్నాథపూర్‌ వద్ద పెద్దవాగు ప్రాజెక్టును 2005లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం జలయజ్ఞం కార్యక్రమాల్లో భాగంగా చేపట్టింది. వెనకబడిన ప్రాంతం కావడంతో సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద కేంద్రం రూ. 108 కోట్లు ఇచ్చింది. రూ.124.64 కోట్లతో పరిపాలన అనుమతి ఇవ్వగా, గామన్‌ ఇండియా కంపెనీ రూ.118.90 కోట్లకు ఈ పనిని దక్కించుకొంది. 2005 మార్చి 23న ఒప్పందం జరిగింది. దీని ప్రకారం 720 మీటర్ల మట్టికట్ట, 350 మీటర్ల గేట్లతో కూడిన బ్యారేజిని నిర్మించడంతోపాటు 29 కి.మీ. దూరం కాలువ తవ్వాలి. ప్రాజెక్టుకు 2006 జూన్‌లో కేంద్ర జలసంఘం సాంకేతిక అనుమతితో పాటు ప్రణాళికాసంఘం నుంచి పెట్టుబడి అనుమతి కూడా వచ్చింది. కేంద్ర నిధులు జాప్యం లేకుండా విడుదలయ్యాయి. కానీ ఇప్పటికీ హెడ్‌వర్క్స్‌ పూర్తి కాలేదు. ప్రధాన కాలువ తవ్వకం పని ఇంకా పెండింగ్‌లోనే ఉంది. డిస్ట్రిబ్యూటరీ కాలువలపై నిర్మించాల్సిన 482 స్ట్రక్చర్లలో ఒక్కటీ ప్రారంభం కాలేదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. హెడ్‌వర్క్స్‌కు ఇంకా ఏడు ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. గేట్లు అమర్చినా ఇప్పటివరకు పరీక్ష చేయలేదు. 2016లో గేట్లు పెడితే ఇప్పటివరకు విద్యుత్తు సరఫరా కూడా ఇవ్వలేదు. హెడ్‌వర్క్స్‌లో నదిని మూసేసే పని ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. మొదట ఒప్పందం చేసుకున్న గుత్తేదారు పనిని రద్దు చేసుకొని వెళ్లిపోయినా ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలూ లేవు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ పని చేసింది అనధికార ఉప గుత్తేదారు. తర్వాత మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఆర్‌.కె-బి.వి.ఎస్‌.ఆర్‌ అనే కంపెనీతో రూ.50.25 కోట్లకు ఒప్పందం జరిగింది. రూ.10 కోట్లకు పైగా బిల్లులు పెండింగులో ఉండడంతో ఈ గుత్తేదారు కూడా పనులు నిలిపేశారు. మొత్తంగా ఎలాంటి ప్రయోజనం కలగకపోవడంతో ఏఐబీపీ కింద కేంద్రం ఇచ్చిన మొత్తాన్ని ఎందుకు తిరిగి వసూలు చేయకూడదో చెప్పాలని జలసంఘం రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరడం చర్చనీయాంశమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు