అంకుర సంస్థల ఏర్పాటులో 8వ స్థానంలో తెలంగాణ

అంకుర సంస్థల (స్టార్టప్‌) ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్‌ బిహార్‌కంటే దిగువస్థాయిలో నిలిచింది. 2022 డిసెంబరు 31 నాటికి దేశవ్యాప్తంగా 86,713 స్టార్టప్‌లు ఏర్పాటవగా వాటిలో 1,341 అంకురాలతో ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానానికి పరిమితమైంది.

Updated : 04 Feb 2023 06:41 IST

బిహార్‌ కంటే దిగువన 15వ స్థానంలో ఏపీ

ఈనాడు, దిల్లీ: అంకుర సంస్థల (స్టార్టప్‌) ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్‌ బిహార్‌కంటే దిగువస్థాయిలో నిలిచింది. 2022 డిసెంబరు 31 నాటికి దేశవ్యాప్తంగా 86,713 స్టార్టప్‌లు ఏర్పాటవగా వాటిలో 1,341 అంకురాలతో ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానానికి పరిమితమైంది. 4,566 స్టార్టప్‌లతో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. తొలి అయిదు స్థానాలను మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌ ఆక్రమించాయి. దక్షిణాదిలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. కేంద్రం ప్రకటించిన స్టేట్స్‌ స్టార్టప్స్‌ ర్యాంకింగ్‌ ఎక్సైజ్‌-2022లో తెలంగాణ టాప్‌ పెర్ఫార్మర్‌గా 7వ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్‌ 29వ స్థానానికి పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వం 2016 జనవరి 16న స్టార్టప్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2019 ఫిబ్రవరి 19న కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌లోని అర్హతల ప్రకారం ఏర్పాటైన వాటిని డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ట్రేడ్‌ (డీపీఐఐటీ) స్టార్టప్‌లుగా గుర్తిస్తూ వస్తున్నారు. అలా గుర్తింపు పొందిన 86,713 స్టార్టప్‌లలో ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానంలో నిలిచింది. ఏపీ తర్వాతి స్థానంలో ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, ఝార్ఖండ్‌తోపాటు ఈశాన్యరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. ఏపీలో ఏర్పాటైన స్టార్టప్‌ల ద్వారా 2022 డిసెంబరు 31 నాటికి 12,557 మందికి ఉపాధి లభించింది’ అని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌ శుక్రవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణలో 50,318 మందికి ఉద్యోగాలు లభించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఏర్పాటైన 86,713 స్టార్టప్‌ల్లో ఒక్కోదాని ద్వారా సగటున 10.28 ఉద్యోగాల చొప్పున 8,91,604 ఉద్యోగాలు రాగా ఏపీలోని స్టార్టప్‌ల ద్వారా సగటున 9.36 ఉద్యోగాలు మాత్రమే లభించాయి. తెలంగాణలో ఇది 11.02 మేర ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు