జన్యుపరీక్ష.. క్యాన్సర్‌ నుంచి రక్ష!

తెలంగాణలో క్యాన్సర్‌ విజృంభిస్తోంది. గత మూడేళ్లలో కొత్త కేసుల సంఖ్య మరణాలు కూడా పెరుగుతుండడం మహమ్మారి తీవ్రతకు నిదర్శనం.

Updated : 04 Feb 2023 05:05 IST

ప్రమాదకర జన్యువులను ముందే కనిపెట్టొచ్చు
వంశపారంపర్యంగా వచ్చే వారికి ఇదే సరైన మార్గం
ఈ కోవలో సుమారు 10 శాతం ముప్పు
‘ఈనాడు’తో డాక్టర్‌ ప్రజ్ఞ చిగురుపాటి
నేడు ప్రపంచ క్యాన్సర్‌ నివారణ దినం

గిరీష్‌ (46) ప్రభుత్వోద్యోగి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు. మద్యం, ధూమపానం వంటి అలవాట్లేమీ లేవు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తున్నా.. ఆయన రక్త క్యాన్సర్‌ (లుకేమియా) బారినపడ్డారు. వైద్యనిపుణులు కుటుంబచరిత్రను ఆరా తీయగా.. గిరీష్‌ మేనమామ కూడా క్యాన్సర్‌తోనే మృతిచెందినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యులు కొన్ని జన్యుపరమైన పరీక్షలు చేయించగా.. అందులో ప్రమాదకరమైన మార్పులకు లోనయ్యే జన్యువులు బయటపడ్డాయి. క్యాన్సర్‌ కుటుంబ చరిత్ర ఉన్న వారిలో ఈ ప్రమాదకరమైన జన్యువులుంటే.. వారిలో మహమ్మారి ముప్పు అధికమని వైద్యులు వెల్లడించారు.

తెలంగాణలో క్యాన్సర్‌ విజృంభిస్తోంది. గత మూడేళ్లలో కొత్త కేసుల సంఖ్య మరణాలు కూడా పెరుగుతుండడం మహమ్మారి తీవ్రతకు నిదర్శనం.
2020లో 47,620 కొత్త కేసులు నమోదు కాగా.. 2021లో 48,775.. 2022లో 49,983 నిర్ధారణ అయ్యాయి. 2020లో క్యాన్సర్‌ కారణంగా 26,038 మంది మృతి చెందగా.. 2021లో 26,681, 2022లో 27,339 మంది బలయ్యారు. క్యాన్సర్‌ బారినపడడానికి కారణాలు అనేకమున్నా.. అత్యధికం స్వీయ తప్పిదాల వల్ల వచ్చేవేనని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలిని, దురలవాట్లను అదుపులో పెట్టుకుంటే.. చాలావరకు క్యాన్సర్లు రాకుండా జాగ్రత్తపడొచ్చు. ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్నా.. వంశపారంపర్యంగా సుమారు 10 శాతం మందిలో క్యాన్సర్‌ అనూహ్యంగా వెన్నాడుతోంది. కుటుంబంలో ఒక వ్యక్తి తాత, నాయనమ్మ, మేనత్త, మేనమామ, అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు.. ఇలా సమీప రక్తసంబంధీకుల్లో ఎవరికి క్యాన్సర్‌ వచ్చిన చరిత్ర ఉన్నా, ఆ వ్యక్తికి ముప్పు పొంచి ఉన్నట్టేనని చెబుతున్నారు ఏఐజీ (గచ్చిబౌలి)కి చెందిన క్యాన్సర్‌ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్‌ ప్రజ్ఞ చిగురుపాటి. మహమ్మారి సోకే అవకాశాలను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స సులభమని, నయమయ్యే అవకాశాలు 95 శాతానికి పైగా ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. ఈ నెల 4న ‘ప్రపంచ క్యాన్సర్‌ నివారణ దినం’ సందర్భంగా ‘ఈనాడు’తో ముఖాముఖిలో పలు అంశాలు వెల్లడించారు. వివరాలు ఆమె మాటల్లోనే..

జీవనశైలితో ముడిపడినవే ఎక్కువ

పొగాకు ఉత్పత్తుల వాడకం, హానికారక రసాయనాలను పీల్చడం, మద్యపానం, వేపుళ్లు, నూనె పదార్థాలు ఎక్కువగా తినడం, రేడియేషన్‌కు లోనవడం, ఊబకాయం, అరక్షిత శృంగారం, ఇవన్నీ జీవనశైలి అలవాట్ల కిందికే వస్తాయి. వీటిని మార్చుకోవడం ద్వారా క్యాన్సర్‌ నుంచి రక్షణ పొందొచ్చు. ఇవి కాకుండా.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ప్రత్యేక కారణాలున్నాయి. ‘హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ)’ ద్వారా ఈ క్యాన్సర్‌ సోకుతుంది. మర్మావయవాల పరిశుభ్రత పాటించకపోవడం, పదే పదే సుఖవ్యాధులు సోకడం, పౌష్టికాహారం లోపించడం, 18 ఏళ్ల లోపే పెళ్లయి పిల్లలు పుట్టడం వంటివి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వచ్చే అవకాశాలుంటాయి. అత్యధికంగా నమోదయ్యే రొమ్ము క్యాన్సర్‌ కారణాలు కూడా భిన్నంగా ఉన్నాయి. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, 35 ఏళ్లు దాటాక గర్భధారణ, పిల్లలు లేకపోవడం, తల్లిపాలు బిడ్డకు పట్టకపోవడం, జన్యుపరంగా కూడా రొమ్ము క్యాన్సర్‌ రావడానికి అవకాశాలున్నాయి. చాలామంది మహిళల్లో ఈ విషయాలపై అవగాహన ఉండట్లేదు. వీటన్నిటితో పాటు కుటుంబ చరిత్ర కూడా చాలా ముఖ్యమైంది.

ప్రతి తొమ్మిది మందిలో ఒకరు

జాతీయ క్యాన్సర్‌ రిజిస్ట్రీ గణాంకాలు, విశ్లేషణ ప్రకారం.. భారత్‌లో 2022లో 14,61,427 కేసులున్నాయి. ప్రతి తొమ్మిది మందిలో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. పురుషులు, మహిళల్లోనూ రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్లు అధికంగా నమోదవుతున్నాయి. 14 ఏళ్ల లోపు పిల్లల్లో లింఫోయిడ్‌ లుకేమియా ఎక్కువగా కనిపిస్తోంది. 2020తో పోల్చితే 2025 నాటికి క్యాన్సర్‌ కేసులు 12.8 శాతం పెరిగే అవకాశాలున్నాయని, 75 ఏళ్ల లోపు క్యాన్సర్‌ బారినపడే అవకాశాలు పురుషుల్లో 12.6 శాతం, మహిళల్లో 8.9 శాతం అని క్యాన్సర్‌ రిజిస్ట్రీ అంచనా.


వంశపారంపర్యంగా అధికంగా వచ్చే క్యాన్సర్లు ఇవీ..

అండాశయం, ప్రోస్టేట్‌, రొమ్ము, పెద్దపేగు, క్లోమం, చర్మం, ఊపిరితిత్తులు, రక్తం


ముందస్తు పరీక్షలతో ఉపయోగం

కుటుంబంలో ఏ రకమైన క్యాన్సర్‌ రోగులున్న చరిత్ర ఉన్నా సరే.. తప్పనిసరిగా జెనెటిక్‌ కౌన్సెలింగ్‌ చేయించుకోవాలి. ప్రమాదకరమైన క్యాన్సర్‌ బారినపడే అవకాశాలున్నాయా? అనేది కొన్ని రకాల జన్యు పరీక్షల ద్వారా తేలిపోతుంది. ముఖ్యంగా బీఆర్‌సీఏ1 (బ్రాకా1), బీఆర్‌సీఏ2 (బ్రాకా2), సీహెచ్‌ఈకే2 (చెక్‌2), ఏటీఎం, పీఏఎల్‌బీ2 (పాల్బ్‌2) వంటి జన్యువులున్నట్లు నిర్ధారణ అయితే.. ఇప్పటికే క్యాన్సర్‌ కుటుంబ చరిత్ర ఉన్న వారిలో మహమ్మారి సోకే అవకాశాలు ఎక్కువని అనుమానించాలి. ఒక రొమ్ములో క్యాన్సర్‌ కణితి ఉన్నట్లు తేలి చికిత్స పొందుతున్న వారికి.. ఈ జన్యువుల్లో ఒకటి ఉన్నా రెండో రొమ్ములో కూడా క్యాన్సర్‌ వచ్చే అవకాశాలున్నాయని సందేహించాలి. ముప్పు పొంచి ఉన్న వారిలో కొందరికి ముందుగానే రెండో రొమ్మును తొలగించాల్సి వస్తుంది. అందుకే సమీప రక్తసంబంధీకుల్లో క్యాన్సర్‌ చరిత్ర ఉంటే.. వయసుతో సంబంధం లేకుండా క్యాన్సర్‌ జన్యు పరీక్షల కోసం వైద్యులను సంప్రదించడం మంచిది. ముఖ్యంగా అతి అరుదైన క్యాన్సర్‌ బారినపడిన చరిత్ర ఉన్నవారు.. ఉదాహరణకు పురుషుల్లో రొమ్ము క్యాన్సర్‌ బారినపడినప్పుడు.. శరీరంలో క్యాన్సర్‌ కాని కణుతులు ఉన్నప్పుడు, పెరుగుతున్నప్పుడు ముందస్తు జన్యు పరీక్షలు చేయించుకోవడం మంచిది. తద్వారా తొలిదశలోనే వ్యాధిని గుర్తించి పూర్తిగా నయం చేయడానికి అవకాశాలు మెరుగవుతాయి. వీరిలో పైన పేర్కొన్న జన్యువులున్నట్లు నిర్ధారణ అయితే.. ముందుగానే క్యాన్సర్‌ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఇలాంటి వారు నిర్ధారణ కోసం స్వయంగా రొమ్ము పరీక్షలు చేసుకోవడాన్ని అలవర్చుకోవాలి. వైద్యుల సలహా మేరకు ఎంఆర్‌ఐ, మామోగ్రామ్‌ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ జన్యువులున్న వారిలో రొమ్ము క్యాన్సర్‌తో పాటు అండాశయ క్యాన్సర్‌ వచ్చే ముప్పు కూడా ఎక్కువ.

అమెరికా అధ్యయనం అదే చెబుతోంది

దీనికి సంబంధించిన పరిశోధన పత్రం ఇటీవలే ‘జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఆంకాలజీ’లో ప్రచురితమైంది. అమెరికాకు చెందిన ‘మయోక్లినిక్‌ కాంప్రహెన్సివ్‌ క్యాన్సర్‌ సెంటర్‌’ ఆధ్వర్యంలో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కుటుంబంలో క్యాన్సర్‌ చరిత్ర ఉన్న 15,104 మందిలో పరిశోధన చేశారు. ప్రమాదకరమైన బ్రాకా 1, బ్రాకా 2 జన్యువులున్న వారికి ఒక రొమ్ములో క్యాన్సర్‌ వస్తే.. రెండో రొమ్ముకూ వ్యాధి సోకే అవకాశాలున్నాయని గుర్తించారు. క్యాన్సర్‌ లక్షణాలు వెలుగులోకి వచ్చే సమయానికే మూడో, నాలుగో దశలో వ్యాధి ముదిరి ఉంటుంది. అదే తొలిదశలో గుర్తిస్తే దాదాపు నయం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే వంశపారంపర్యంగా ఈ ముప్పు పొంచి ఉన్నవారు తప్పనిసరిగా జన్యుపరీక్షలు చేయించుకోవాలి. రక్తం, లాలాజలాన్ని సేకరించి డీఎన్‌ఏ పరీక్షలకు పంపించడం ద్వారా నిర్ధారణ చేయవచ్చు. పరీక్షల్లో ‘కార్సినోమా జీన్‌’ ఉందా? లేదా? అనేది నిర్ధారణ అవుతుంది.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని