జాతీయ ఎస్సీ కమిషన్‌ ఉత్తర్వులను నిలిపివేసిన హైకోర్టు

రాష్ట్ర విద్యుత్తు సంస్థల్లో 2009 నుంచి నేరుగా నియమితులైన ఉద్యోగుల సీనియారిటీని మెరిట్‌ ప్రాతిపదికన నిర్ణయించాలని ట్రాన్స్‌కో జారీచేసిన ఉత్తర్వుల అమలుపై జాతీయ ఎస్సీ కమిషన్‌ ఇచ్చిన స్టే అమలును నిలిపివేస్తూ శనివారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

Updated : 05 Feb 2023 05:04 IST

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్ర విద్యుత్తు సంస్థల్లో 2009 నుంచి నేరుగా నియమితులైన ఉద్యోగుల సీనియారిటీని మెరిట్‌ ప్రాతిపదికన నిర్ణయించాలని ట్రాన్స్‌కో జారీచేసిన ఉత్తర్వుల అమలుపై జాతీయ ఎస్సీ కమిషన్‌ ఇచ్చిన స్టే అమలును నిలిపివేస్తూ శనివారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ట్రాన్స్‌కో ఉత్తర్వులపై స్టే ఇచ్చే అధికారం కమిషన్‌కు లేదని విద్యుత్తు బీసీ, ఓసీ ఉద్యోగుల ఐకాస హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిపి ఈ ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై గతంలో సుప్రీంకోర్టు కూడా తీర్చు చెప్పిందని ఐకాస ఒక ప్రకటనలో తెలిపింది. పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఇచ్చిన ప్రమోషన్లన్నీ సమీక్షించాలని 2019లో హైకోర్టు విద్యుత్తు సంస్థలను ఆదేశించింది. దీన్ని అమలు చేయడం లేదని విద్యుత్తు ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం విద్యుత్తు సంస్థల సీఎండీలపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఫిబ్రవరి 8న వివరాలను సమర్పించాలని విద్యుత్తు సంస్థల యాజమాన్యాలను ఆదేశించిందని ఐకాస తెలిపింది. 2009 తర్వాత చేరిన ఉద్యోగుల సీనియారిటీని మెరిట్‌ ప్రాతిపదికన వెంటనే ప్రకటించాలని ఐక్య కార్యాచరణ సమితి యాజమాన్యాలను డిమాండ్‌ చేస్తోంది.

విద్యుత్‌ బిల్లుపై పోరాటం: డిస్కంలను ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం తెస్తున్న విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే పెద్దయెత్తున ఉద్యమిస్తామని అఖిల భారత విద్యుత్‌ ఉద్యోగుల సంఘాల సమాఖ్య హెచ్చరించింది. ఈ సమాఖ్య సమావేశం శనివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లోని ఒక హోటల్‌లో జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఇంజినీర్ల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సంఘం అధ్యక్షుడు రత్నాకర్‌రావు సమాఖ్య జనరల్‌ సెక్రటరీగా ఉన్నారు. డిస్కంల ప్రైవేటీకరణ వల్ల విద్యుత్‌ ఉద్యోగులకు జరిగే నష్టాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సంఘం రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ సదానందం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని