3 వేల ఎకరాల్లో మొబిలిటీ వ్యాలీ

రాష్ట్రంలో వాహన రంగ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ(టీఎంవీ) పేరిట ప్రత్యేకంగా విద్యుత్‌ వాహన క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

Published : 07 Feb 2023 04:45 IST

వచ్చే ఐదేళ్లలో విద్యుత్‌ వాహన రంగంలో రూ.50వేల కోట్ల భారీ పెట్టుబడులు
జహీరాబాద్‌, సీతారాంపూర్‌, దివిటిపల్లి, ఎంకతలల్లో ప్రత్యేక క్లస్టర్లు
4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

ఈనాడు- హైదరాబాద్‌- న్యూస్‌టుడే, రాయదుర్గం: రాష్ట్రంలో వాహన రంగ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ(టీఎంవీ) పేరిట ప్రత్యేకంగా విద్యుత్‌ వాహన క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. టీఎంవీతో వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో విద్యుత్‌ వాహన రంగంలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులతో పాటు.. 4 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 4 మెగా క్లస్టర్లను నగరం చుట్టూ ఏర్పాటు చేస్తోందన్నారు. జహీరాబాద్‌, సీతారాంపూర్‌లలో విద్యుత్‌ వాహనాల తయారీ క్లస్టర్లను, దివిటిపల్లిలో ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌(ఈఎస్‌ఎస్‌)ను, వికారాబాద్‌ ఎంకతలలో ఇన్నోవేషన్‌ క్లస్టర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యుత్‌ వాహన వారోత్సవంలో భాగంగా సోమవారం మొబిలిటీ నెక్స్ట్‌ హైదరాబాద్‌ సదస్సును మంత్రి ప్రారంభించి మాట్లాడారు.

వంద ఎకరాల్లో వాహనాలను పరీక్షించే ప్రత్యేక మైదానం

విద్యుత్‌ వాహన రంగ తయారీ, పరిశోధన, అభివృద్ధిలో రాష్ట్రాన్ని అత్యుత్తమ మౌలిక సదుపాయాలకు గమ్యస్థానంగా నిలపడంలో టీఎంవీ ముఖ్య పాత్ర పోషిస్తుందని కేటీఆర్‌ చెప్పారు. ‘‘సుస్థిర రవాణాలో అధునాతన రసాయన, హైడ్రోజన్‌ ఫ్యూయెల్‌ సెల్స్‌, ఒకటి, రెండో దశ పరికరాల తయారీదారులకు, ఆటో ఇంజినీరింగ్‌, పరిశోధన- అభివృద్ధి సంస్థలకు అనువుగా ఉంటుంది. ఎంకతలలో వివిధ ప్రయోగశాలలు ఉంటాయి. భారత్‌లోనే తొలిసారి వంద ఎకరాల్లో వాహనాలను పరీక్షించే ప్రత్యేక మైదానం అందుబాటులోకి తీసుకొస్తున్నాం. జర్మనీకి చెందిన ఏటీఎస్‌ రీన్‌ల్యాండ్‌ సంస్థ రూ.250 కోట్ల పెట్టుబడులతో అక్కడ మౌలిక వసతులను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈఎస్‌ఎస్‌లో వివిధ బ్యాటరీలకు సంబంధించిన సంస్థలు ప్రారంభమవుతాయి. టీఎంవీలో భాగంగా యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ లభిస్తుంది. విద్యా సంస్థలను, పరిశ్రమను అనుసంధానించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. వాహన రంగ సైబర్‌ భద్రతలో తొలి సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీని కూడా టీఎంవీ అందుబాటులోకి తెస్తుంది. రవాణా రంగ అంకుర సంస్థలకూ దన్నుగా నిలుస్తుంది. ఇందుకు టీహబ్‌ పలు వాహన రంగ సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ఇప్పటికే టీఎంవీలో ప్రముఖ సంస్థలు సానుకూలంగా స్పందించి పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. మరో రెండు వారాల్లో రూ.3 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. విద్యుత్‌ వాహనాల వాడకంలో రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది’’ అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సమావేశంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, భారత్‌ వోల్వో గ్రూప్‌ అధ్యక్షుడు కమల్‌ బాలి తదితరులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌ ఎంకతలలో ఏర్పాటు చేయనున్న టీఎంవీ క్లస్టర్‌ నమూనాను, టీఎస్‌ఈవీ యాప్‌ను ఆవిష్కరించారు. పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఉబెర్‌ ఇ-మొబిలిటీ సమావేశంలో....

రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాల వాడకాన్ని వేగవంతం చేయడానికి ఉన్న అడ్డంకులను తొలగించడంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషిస్తోందని కేటీఆర్‌ తెలిపారు. సాధ్యమైనంత వేగంగా ఈవీ జోరు కొనసాగే అవకాశాలున్నాయని హామీ ఇవ్వగలనన్నారు. ఇండియా గ్లోబల్‌ ఫోరమ్‌, ఉబెర్‌ భాగస్వామ్యంతో సోమవారం ఉబెర్‌ హైదరాబాద్‌ టెక్‌ సెంటర్‌లో నిర్వహించిన ఇ-మొబిలిటీ సమావేశంలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని