ఏప్రిల్‌ నుంచి ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ

సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త బడ్జెట్‌ను రూపొందించామని రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.

Updated : 07 Feb 2023 05:38 IST

విలేకర్ల సమావేశంలో హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త బడ్జెట్‌ను రూపొందించామని రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. కీలకరంగాలకు, ప్రాధాన్య పథకాలకు అన్నింటికీ నిధులను పెంచామని తెలిపారు. 2023-34 బడ్జెట్‌లో రైతుల రుణమాఫీ కోసం రూ. 6,385 కోట్లు కేటాయించామన్నారు. తద్వారా రూ. 90 వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్‌ నుంచి 11 వేల మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖలో క్రమబద్ధీకరణ జరిగిందని తెలిపారు. బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన అనంతరం సామాజిక ఆర్థిక నివేదిక విడుదల సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘సబ్బండవర్గాల సంక్షేమం కోణంలో సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం మేరకు బడ్జెట్‌ రూపు దిద్దుకుంది.  రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 80 వేల ఉద్యోగాల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఆరోగ్య శాఖలో 950 మందిని నియమించాం. పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలో రూ. 1,000 కోట్లను కొత్త ఉద్యోగుల కోసం బడ్జెట్‌లో కేటాయించాం. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒప్పంద ఉద్యోగులను ఏప్రిల్‌ 1 నుంచి క్రమబద్ధీకరిస్తాం. సెర్ఫ్‌ ఉద్యోగుల పేస్కేల్‌ను ఏప్రిల్‌ 1 నుంచి సవరిస్తాం. సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారి కోసం రూ. 12 వేల కోట్లు ఇస్తున్నాం, దీని ద్వారా నియోజకవర్గానికి మూడు వేల మందికి లబ్ధి చేకూరుతుంది. గృహ నిర్మాణ శాఖ ఆర్‌ అండ్‌ బీలో విలీనమైనందున ఆ పద్దుకింద ఈ నిధులిస్తున్నాం. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం యథావిధిగా సాగుతుంది. రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణానికి హడ్కో నిధులను వినియోగిస్తాం. గొర్రెల పంపిణీ పథకానికి ఇప్పటికే నిధులున్నాయి’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని