JEE Main: జేఈఈలో తెలుగుభేరి

జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా వంద పర్సంటైల్‌ సాధించిన 20 మంది వారిలో నలుగురు తెలుగు విద్యార్థులే ఉండటం విశేషం.

Updated : 08 Feb 2023 08:01 IST

100 పర్సంటైల్‌ సాధించిన 20 మందిలో నలుగురు మన విద్యార్థులే
తొలి విడత ఫలితాల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి: జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా వంద పర్సంటైల్‌ సాధించిన 20 మంది వారిలో నలుగురు తెలుగు విద్యార్థులే ఉండటం విశేషం. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ తొలి విడత పేపర్‌-1 ఫలితాలను ఎన్‌టీఏ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదల చేసింది. మొత్తం 8.24 లక్షల మంది పరీక్షలు రాశారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.60 లక్షల మంది హాజరయ్యారు.

తుది విడత తర్వాత ర్యాంకుల ప్రకటన

ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో జరిగిన జేఈఈ మెయిన్‌- 2023 తొలి విడత పరీక్షలు రాసేందుకు దేశ(వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 6 నుంచి 12వరకు జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షలు జరగనున్నాయి. తొలి విడత రాసిన విద్యార్థులు.. రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష తర్వాత ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ఎన్‌టీఏ అఖిల భారత ర్యాంకుల్ని ప్రకటిస్తుంది. కేటగిరీల వారీగా కటాఫ్‌ స్కోర్‌ నిర్ణయిస్తారు. ఆ ప్రకారం మొత్తం 2.50 లక్షల మంది అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు. అంటే వారు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హులు.


తెలుగు రాష్ట్రాల నుంచి కేటగిరీల వారీగా అగ్రగణ్యులు

జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ విభాగం:  దుంపల ఫణీంద్రనాథరెడ్డి- 99.99, పెందుర్తి నిశాల్‌ సుభాష్‌- 99.99

* ఓబీసీ విభాగం: ఎన్‌కే విశ్వనాథ్‌- 100

* ఎస్‌సీ విభాగం: కొమరపు వివేక్‌ వర్ధన్‌- 99.99

* ఎస్‌టీ విభాగం: ధీరావత్‌ ధనుజ్‌- 99.99

* దివ్యాంగుల విభాగం: తుమ్మల తిలోక్‌- 99.71

* అమ్మాయిల్లో: మీసాల ప్రణతి శ్రీజ-99.99, రామిరెడ్డి మేఘన-99.99, సీమల వర్ష-99.98, అయ్యాలపు రితిక- 99.98, పీలా తేజశ్రీ- 99.98, వాకాశ్రీ వర్షిత- 99.98


* గత ఏడాది అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు మెయిన్‌లో కటాఫ్‌ స్కోర్‌ ఇదీ...

* జనరల్‌ (అన్‌ రిజర్వుడ్‌): 88.41

*  ఈడబ్ల్యూఎస్‌: 63.11

*  ఓబీసీ: 67.00

*  ఎస్‌సీ: 43.08

*  ఎస్‌టీ:  26.77

*  జనరల్‌ (దివ్యాంగ): 0.003

(ఏటేటా కటాఫ్‌ మార్కులు/పర్సంటైల్‌ తగ్గుతుండగా...ఈసారి మరికొంత తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని