జోషిమఠ్‌లో భూకంపం వచ్చే ఆస్కారం

భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు లేకపోవడం, నాసిరకం నిర్మాణాలతో తుర్కియేలో తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎన్జీఆర్‌ఐలోని భూకంప పరిశోధన కేంద్రం చీఫ్‌ సైంటిస్ట్‌ పూర్ణచందర్‌రావు తెలిపారు.

Published : 08 Feb 2023 03:43 IST

నాసిరకం నిర్మాణాలతోనే తుర్కియేలో తీవ్ర నష్టం
ఎన్జీఆర్‌ఐ శాస్త్రవేత్త పూర్ణచందర్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు లేకపోవడం, నాసిరకం నిర్మాణాలతో తుర్కియేలో తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎన్జీఆర్‌ఐలోని భూకంప పరిశోధన కేంద్రం చీఫ్‌ సైంటిస్ట్‌ పూర్ణచందర్‌రావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘భూకంప తీవ్రత 7.8గా నమోదవడం, రాత్రివేళలో సంభవించడం వల్ల అక్కడ మృతుల సంఖ్య పెరిగింది. భూకంప కేంద్రం 18 కిలోమీటర్ల లోతులోనే ఉండటంతో తీవ్రత ఎక్కువగా కనిపించింది. 30 కిలోమీటర్ల లోతులో ఉండి ఉంటే తీవ్రత ఇంతలా ఉండేది కాదు. భూకంపం వస్తుందని ముందస్తు హెచ్చరికలు చేసే సాంకేతికత మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఎప్పుడొస్తుంది? ఎన్నిసార్లు వస్తుందనే విషయమై పరిశోధనలు జరుగుతున్నాయి. జోషిమఠ్‌లో భూకంపం వచ్చే అవకాశముందని అంచనా.  హిమాలయాల చుట్టూ పక్కల ప్రాంతంలో ఎక్కువ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. 1897, 1905, 1934, 1950లో అక్కడ తీవ్ర భూకంపాలు సంభవించాయి. 1934 తర్వాత నేపాల్‌, ఉత్తరాఖండ్‌ ప్రాంతాల్లో పెద్ద భూకంపం సంభవించలేదు. మున్ముందు ఆ ప్రాంతాల్లోనూ భూకంపాలొచ్చే ఆస్కారముంది. భూకంపాల తీవ్రతను తట్టుకునేలా ప్రత్యేక నిర్మాణాలపై ప్రభుత్వం ప్రమాణాలను నిర్దేశించింది. కొందరు వీటిని పట్టించుకోవడం లేదు. భూకంపాలను తట్టుకునేలా రెట్రోఫిట్టింగ్‌ ద్వారా పాత భవనాలను మరింత దృఢంగా చేసే అవకాశం ఉంది’’ అని పూర్ణచందర్‌రావు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని