పరిమితంగా విద్యుత్‌ కొనుగోళ్లు

జాతీయస్థాయిలో విద్యుత్‌ డిమాండు పెరుగుతున్నందున భారత ఇంధన ఎక్స్ఛేంజి (ఐఈఎక్స్‌)లో కరెంటు అమ్మకం ధరలు రికార్డు స్థాయిలో ఉంటున్నాయి.

Updated : 08 Feb 2023 05:31 IST

ఇంధన ఎక్స్ఛేంజిలో ధరలు పెరగడమే కారణం
రాష్ట్రంలో 241 మిలియన్‌ యూనిట్లు దాటిన వినియోగం
మరిన్ని నిధుల కోసం డిస్కంల అభ్యర్థన

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయస్థాయిలో విద్యుత్‌ డిమాండు పెరుగుతున్నందున భారత ఇంధన ఎక్స్ఛేంజి (ఐఈఎక్స్‌)లో కరెంటు అమ్మకం ధరలు రికార్డు స్థాయిలో ఉంటున్నాయి. ఒక యూనిట్‌ కరెంటు ధర రూ.12కు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు రోజూవారీ విద్యుత్‌ కొనుగోళ్లను తగ్గించాయి. తాజాగా ఈ నెల 3న రాష్ట్రంలో 241.7 మిలియన్‌ యూనిట్ల (మి.యూ) కరెంటు వినియోగమైంది. గత 3 నెలల్లో రోజూవారీ వినియోగంలో ఇదే అత్యధికం. ప్రస్తుతం రోజూ 230 మి.యూ.ల కన్నా ఎక్కువ వినియోగం ఉంటోంది. కానీ వివిధ విద్యుత్‌ కేంద్రాల నుంచి లభ్యత 200 మి.యూ.లలోపే ఉన్నందున అదనంగా ఐఈఎక్స్‌లో రోజూ  కొనాల్సి వస్తోంది. డిస్కంల వద్ద నిధులు పరిమితంగా ఉన్నందున ప్రస్తుతం రోజూ రూ.5 కోట్లను విద్యుత్‌ కొనుగోలుకు అదనంగా వెచ్చిస్తున్నాయి. ఈ సొమ్ముకు ఎంతొస్తే అంత కరెంటును కొంటున్నాయి. ప్రస్తుత యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నందున రాష్ట్రంలో కరెంటు డిమాండు, వినియోగం మరింత పెరిగి రోజుకు 250 మి.యూ.లు దాటే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కరెంటును ఐఈఎక్స్‌లో కొనేందుకు అదనంగా నిధులు కేటాయించాలని డిస్కంలు తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. ప్రస్తుతం వివిధ రాయితీల కింద నెలకు రూ.875 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు కేటాయిస్తోంది. ఇవి సరిపోవడం లేదని, మరో రూ.400 కోట్లయినా అదనంగా ఇస్తేనే గరిష్ఠ డిమాండును తీర్చేందుకు సరిపోయేలా కరెంటును కొనగలమని డిస్కంలు ప్రభుత్వానికి తెలిపాయి. 

బిల్లులపై ఆదాయం పెరగాలి

రాష్ట్రంలో కరెంటు డిమాండు, వినియోగం పెరుగుతున్నా కరెంటు బిల్లులపై ఆదాయం పెరగడం లేదని, దీన్ని పెంచడంపై క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు ఎక్కువగా దృష్టి పెట్టాలని తాజాగా ఒక సమావేశంలో ఉన్నతాధికారులు సూచించారు. ప్రతి కనెక్షన్‌కు ఎన్ని యూనిట్ల కరెంటు వినియోగమవుతుందో విద్యుత్‌ సహాయ ఇంజినీర్లు పరిశీలించి బిల్లు జారీ చేయడమే కాకుండా సొమ్ము వసూలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వినియోగం పెరిగినప్పుడు అదే నిష్పత్తిలో ఆదాయం పెరిగేలా చూడటం ఇంజినీర్ల బాధ్యతని చెప్పారు. వ్యవసాయానికి వాడే విద్యుత్‌, పంపిణీ, సరఫరాలో నష్టం పోగా ఇస్తున్న కరెంటులో కేవలం 53.90 శాతానికే నెలనెలా బిల్లుల రూపంలో సొమ్ము వసూలవుతున్నాయని ఓ అధికారి వివరించారు. ఈ పరిస్థితుల్లో మిగిలిన నిధులను ప్రభుత్వం సర్దుబాటు చేయకపోతే డిస్కంలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని