సీబీఐ కస్టడీకి కవిత మాజీ ఆడిటర్‌

దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబును రౌస్‌అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సీబీఐ కస్టడీకి అప్పగించింది.

Published : 09 Feb 2023 05:57 IST

దిల్లీ మద్యం కేసులో బుచ్చిబాబు అరెస్టు

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబును రౌస్‌అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సీబీఐ కస్టడీకి అప్పగించింది. హైదరాబాద్‌లో బుచ్చిబాబును మంగళవారం అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు సీబీఐ ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ ఎదుట బుధవారం హాజరుపర్చారు. మద్యం కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు ఆయనను అయిదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ తరఫు న్యాయవాదులు ప్రత్యేక జడ్జికి విజ్ఞప్తి చేశారు. అందుకు బుచ్చిబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రమోద్‌ కుమార్‌ దూబే అభ్యంతరం వ్యక్తం చేశారు. బుచ్చిబాబును సీబీఐ అక్రమంగా అరెస్టు చేసిందని, మద్యం విధానంపై ప్రశ్నించేందుకు ఇప్పటికే సుమారు 40 సార్లు సీబీఐ అధికారులు ఆయనను పిలిచారని తెలిపారు. ఛార్టెడ్‌ అకౌంటెంట్‌గా ఉన్న బుచ్చిబాబు వృత్తిపరమైన సేవలు అందించారని, కేసు దర్యాప్తునకు సహకరిస్తున్నారని తెలిపారు. ఒక సమావేశంలో పాల్గొన్నారనే కారణంతో ఆయనపై ఆరోపణలు మోపడం సరికాదన్నారు. నగదు లావాదేవీల్లో ఆయన పాల్గొనలేదని, ఏ రకంగానూ లబ్ధిపొందలేదని వివరించారు. బుచ్చిబాబును సీబీఐ కస్టడీకి ఇవ్వవద్దని కోరారు. సీబీఐ న్యాయవాదులు స్పందిస్తూ..ఆయన విచారణకు సహకరించనందునే కస్టడీకి కోరుతున్నామని తెలిపారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ బుచ్చిబాబును శనివారం వరకు (మూడు రోజులు) సీబీఐ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏడు రోజుల ఈడీ కస్టడీకి గౌతమ్‌ మల్హోత్రా...

పంజాబ్‌కు చెందిన మద్యం వ్యాపారి, ఒయాసిస్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ గౌతమ్‌ మల్హోత్రాను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఏడు రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చింది. శిరోమణి అకాలీదళ్‌ మాజీ ఎమ్మెల్యే, మద్యం వ్యాపారి దీప్‌ మల్హోత్రా కుమారుడైన గౌతమ్‌ మల్హోత్రాను దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో అక్రమ నగదు చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనను సీబీఐ ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ ఎదుట బుధవారం ఈడీ అధికారులు హాజరుపర్చారు. మద్యం సిండికేట్‌ ఏర్పాటు చేయడంలో గౌతమ్‌ కీలకంగా వ్యవహరించారని, ఈ విషయంలో ప్రశ్నించేటప్పుడు తప్పించుకునే ధోరణిలో సమాధానాలు తెలిపారని ఈడీ తరఫు న్యాయవాదులు ప్రత్యేక జడ్జికి వివరించారు. ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. వాదన అనంతరం గౌతమ్‌ మల్హోత్రాను 7రోజుల కస్టడీకి ఇస్తూ ప్రత్యేక జడ్జి ఉత్తర్వులిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని