బొగ్గు గనుల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు

బొగ్గు గనులు ఎవరికి కేటాయించాలనే విషయంలో కేంద్రం ఆయా రాష్ట్రాల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు.

Updated : 09 Feb 2023 04:43 IST

బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి

బొగ్గు గనులు ఎవరికి కేటాయించాలనే విషయంలో కేంద్రం ఆయా రాష్ట్రాల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. సింగరేణి కాలరీస్‌ కంపెనీకి చెందిన బొగ్గు గనులను ప్రైవేటు కంపెనీలకు కేటాయించలేదని మంత్రి వెల్లడించారు. బొగ్గు గనుల కేటాయింపుపై ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 70 బొగ్గు గనులను ప్రైవేటు కంపెనీలకు కేటాయించినట్లు ఆయన తెలిపారు. అలాగే బొగ్గు గని విశ్రాంత కార్మికుల పింఛను పెంపు విషయంలో 12వ వేతన సంఘం సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని పింఛను పథకాన్ని పునఃసమీక్షించేందుకు తాము సూత్రప్రాయంగా అంగీకరించినా కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధుల ప్రతిఘటనతో ఏకాభిప్రాయం రాలేదని మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. బొగ్గు గనుల భవిష్యనిధి సంస్థకు (సీఎంపీఎఫ్‌వో) వచ్చే చందాకు, చెల్లించే పింఛన్లకు మధ్య వ్యత్యాసం ఉందని మంత్రి పేర్కొన్నారు. 2017, అక్టోబరు ఒకటో తేదీ నుంచి చందాను 4.91 శాతం నుంచి 14 శాతానికి పెంచామని, అయినప్పటికీ చందాకు, పింఛను చెల్లింపులకు మధ్య తేడా ఎక్కువగానే ఉందని తెలిపారు.
- పోచంపల్లిలో భారతీయ చేనేత సాంకేతిక సంస్థ (ఐఐహెచ్‌టీ) ఏర్పాటుకు సమగ్ర జౌళి పార్కుల పథకం (ఎస్‌ఐటీపీ) కింద అవకాశం లేదని కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్‌ తెలిపారు. మహబూబాబాద్‌, చేవెళ్ల, పెద్దపల్లి ఎంపీలు మాలోత్‌ కవిత, డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, బొర్లకుంట వెంకటేష్‌ నేత అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.


* కామారెడ్డిలో నూతన తపాలా కార్యాయలం ఏర్పాటు చేసే యోచనలేదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హా చౌహాన్‌ తెలిపారు. జహీరాబాద్‌ ఎంపీ బి.బి.పాటిల్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

* దేశవ్యాప్తంగా 38,901 గ్రామాలకు 2022, మార్చి నాటికి మొబైల్‌ సేవలు అందడం లేదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హా చౌహాన్‌ తెలిపారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తెలంగాణలో 203 గ్రామాలకు మొబైల్‌ సేవలు అందడం లేదని మంత్రి పేర్కొన్నారు.

* అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద దేశవ్యాప్తంగా స్థాయి పెంపు/ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు 1,275 స్టేషన్లను గుర్తించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఆయన బుధవారం మౌఖికంగా సమాధానమిచ్చారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద ఎంపిక చేసిన వాటిలో రాష్ట్రంలో హైదరాబాద్‌, బేగంపేట, హఫీజ్‌పేట, హైటెక్‌ సిటీ, ఉప్పుగుడ, ఉందానగర్‌, కాచిగూడ, లింగంపల్లి, యాకుత్‌పుర, మలక్‌పేట, మల్కాజిగిరి, మేడ్చల్‌, సికింద్రాబాద్‌, షాద్‌నగర్‌, ఆదిలాబాద్‌, బాసర, కామారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్‌, కాజీపేట, భద్రాచలం రోడ్‌, గద్వాల, జడ్చర్ల, జనగామ, ఖమ్మం, మధిర, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి, రామగుండం, తాండూరు, వికారాబాద్‌, వరంగల్‌, యాదాద్రి, జహీరాబాద్‌ ఉన్నాయని మంత్రి తెలిపారు.

* తెలంగాణలో ఏడు గతిశక్తి కార్గో టెర్మినళ్ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని