ఆర్మీ నియామక ప్రక్రియలో మార్పులు

సైన్యంలో నియామకాలకు సంబంధించి 2023-24 నుంచి పోస్టుల భర్తీ పూర్తిగా కొత్త విధానంలో చేపట్టాలని నిర్ణయించారు.

Updated : 01 Mar 2023 08:48 IST

ఐటీఐ, పాలిటెక్నిక్‌ చేసిన వారికి 50 వరకు బోనస్‌ మార్కులు
రిక్రూటింగ్‌ డైరెక్టర్‌ కియట్స్‌ కే దాస్‌ వెల్లడి

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: సైన్యంలో నియామకాలకు సంబంధించి 2023-24 నుంచి పోస్టుల భర్తీ పూర్తిగా కొత్త విధానంలో చేపట్టాలని నిర్ణయించారు. ఆటోమేషన్‌తో పారదర్శకత పెంచడంతోపాటు అభ్యర్థుల మేధో యోగ్యత, శారీరక దృఢత్వం మధ్య సమతుల్యత సాధనకు అనువుగా ఈ మార్పులు చేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఆర్మీలో జూనియర్‌ కమిషన్డ్‌ అధికారులు(జేసీవో), ఇతర ర్యాంకులతో(ఓఆర్‌)పాటు అగ్నివీరుల భర్తీ ప్రక్రియను ఇకపై నూతన పద్ధతిలో చేపడుతున్నట్లు రిక్రూటింగ్‌ డైరెక్టర్‌, కల్నల్‌ కియట్స్‌ కే దాస్‌ వెల్లడించారు. తిరుమలగిరిలోని ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయంలో మంగళవారం విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. గతంలో అభ్యర్థుల శారీరక, వైద్య పరీక్షల అనంతరం రాత పరీక్షలను నిర్వహించి సైన్యంలోకి తీసుకునేవారమని ఇకపై ఇది మారుతుందని తెలిపారు. తొలుత ఆన్‌లైన్‌లో సాధారణ ప్రవేశ పరీక్షల(సీఈఈ)ను నిర్వహించి.. ఎంపికయ్యే అభ్యర్థులకు శారీరక, వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. అనంతరం ఆర్మీలో భర్తీ చేసుకోనున్నట్లు తెలిపారు.

ఐటీఐ/పాలిటెక్నిక్‌ చేసినవారికి 20-50 అదనపు మార్కులు

సైన్యంలో సాంకేతిక విభాగాల్లో సిబ్బంది సంఖ్యను పెంచేందుకు అనువుగా ఇకపై ఐటీఐ, పాలిటెక్నిక్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు నియామకంలో బోనస్‌గా 20 నుంచి 50 మార్కులను ఇవ్వాలని ఆర్మీ నిర్ణయించింది.

నాలుగు ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ సీఈఈ

తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌లో ఆన్‌లైన్‌ పరీక్షలకు అవకాశం కల్పించామని రిక్రూటింగ్‌ డైరెక్టర్‌ దాస్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ పరీక్ష ఫీజు రూ.500లు కాగా.. ఆర్మీ 50శాతం భరిస్తుందని, మిగతాది అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. జాయిన్‌ ఇండియన్‌ ఆర్మీ వెబ్‌సైట్‌లో మార్చి 15 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని చెప్పారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి వెబ్‌సైట్‌లో హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. 79961 57222 నంబరుకు ఫోన్‌ చేయవచ్చని తెలిపారు.

తెలంగాణ నుంచి 808 అగ్నివీరులు..

తొలివిడతలో తెలంగాణ నుంచి ఇద్దరు మహిళలు సహా మొత్తం 808 మంది అగ్నివీరులు ఎంపికయ్యారని కల్నల్‌ దాస్‌ తెలిపారు. వీరికి ఒకటి, రెండు రోజుల్లో శిక్షణ ప్రారంభమవుతుందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని