నాగార్జున దూరవిద్య పరీక్షల్లో అక్రమాలు

ఏపీలోని నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య పరీక్షల్లో వెలుగుచూస్తున్న అక్రమాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Updated : 08 Mar 2023 05:45 IST

అమ్మాయికి బదులు హాజరైన యువకుడు
తెలంగాణ విద్యార్థులకు ఏపీలో పరీక్ష కేంద్రాలు

ఈనాడు, అమరావతి: ఏపీలోని నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య పరీక్షల్లో వెలుగుచూస్తున్న అక్రమాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌లో దూరవిద్య కేంద్రాలను నిర్వహిస్తున్న వర్సిటీ... ఈ సారి అక్కడివారికి పరీక్ష కేంద్రాలను ఏపీలో కేటాయించింది. ఈ పరీక్షల నిర్వహణలో అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో ఉపకులపతికి తెలియకుండానే ఉన్నత విద్యాశాఖ ప్రత్యేకంగా రెండు బృందాలతో తనిఖీలు చేపట్టింది. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ కేంద్రంలో తెలంగాణ అమ్మాయికి బదులు ఒక అబ్బాయి పరీక్ష రాస్తున్నట్లు అధికారుల బృందం గుర్తించింది. యువకుడిని అదుపులోకి తీసుకోగా.. తప్పించుకొని పారిపోయాడు. చాలామంది అభ్యర్థుల హాల్‌టికెట్లపై ఫొటోలూ లేవు. ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో ఫొటోలు రాలేదని తనిఖీ బృందాలకు అభ్యర్థులు సమాధానమిచ్చారు. యూజీసీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ కళాశాలల్లోనే స్టడీసెంటర్లు, పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేయాలి. కానీ, ప్రైవేటు కళాశాలల్లోనూ స్టడీసెంటర్లు నిర్వహిస్తున్నారు. 

యూజీసీ వద్దన్నా వినరు: నాగార్జున వర్సిటీ తెలంగాణలో నెలకొల్పిన స్టడీ సెంటర్లలో డిగ్రీ, పీజీ పూర్తిచేసిన విద్యార్థుల ధ్రువపత్రాలు చెల్లవని అక్కడి ఉన్నత విద్యామండలి ప్రకటించింది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నాగార్జున వర్సిటీ తన పరిధినిదాటి స్టడీసెంటర్లను ఏర్పాటుచేసిందని, దానివల్ల 2013 సెప్టెంబరు తర్వాత వాటిలో చదివిన విద్యార్థులు జూనియర్‌ అధ్యాపక పోస్టులకు అర్హులు కారని టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులను స్వీకరించలేదు. అలాంటివారు తెలంగాణలో లక్షన్నర మంది ఉండొచ్చని ఒక అంచనా. నాగార్జున వర్సిటీ మాత్రం విభజన చట్టం ప్రకారం పదేళ్లు ఉమ్మడి రాజధాని ఉన్నందునే కొనసాగిస్తున్నామని చెబుతోంది. పక్కరాష్ట్రాల్లో స్టడీసెంటర్లు నిర్వహించడం యూజీసీ నిబంధనలకు విరుద్ధం. దీంతో దూరవిద్య కింద తెలంగాణలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఏపీలో పరీక్షలు నిర్వహించింది. ఇందుకోసం తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. దూరవిద్య ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తుండటంతో నాగార్జున వర్సిటీ వీటిని కొనసాగిస్తోంది. అంతేతప్ప విద్యార్థుల ధ్రువపత్రాల చెల్లుబాటు విషయాన్ని పట్టించుకోవడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని