ఉగాది ముంగిట ఉసూరు

ఈయన పేరు రాములు. కరీంనగర్‌ జిల్లా గంగాధర రైతు. మొత్తం 9 ఎకరాల మామిడి తోట కౌలుకు తీసుకున్నారు. దీనికి రూ.3 లక్షలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టారు.

Published : 20 Mar 2023 04:42 IST

నేలరాలిన మామిడి రైతుల ఆశలు
వడగళ్లు, ఈదురు గాలులతో కుప్పకూలిన చెట్లు
40 వేల ఎకరాల్లో పంట నష్టం
నాణ్యమైన కాయల దిగుబడిపై ప్రభావం
ఈనాడు - హైదరాబాద్‌


రైతు కష్టం.. నేలపాలు...

ఈయన పేరు రాములు. కరీంనగర్‌ జిల్లా గంగాధర రైతు. మొత్తం 9 ఎకరాల మామిడి తోట కౌలుకు తీసుకున్నారు. దీనికి రూ.3 లక్షలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టారు. శనివారం సాయంత్రం వరకు తోటలో ఆనందంగా గడిపామని ఆయన చెప్పారు. అర్ధరాత్రి తర్వాత వడగళ్ల వానబీభత్సం మొదలైందని భయంతో ఇంటినుంచి తోట వద్దకు వచ్చేసరికి కాయలన్నీ రాలిపోయాయని వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు.


మొక్కజొన్న, వరికి తీవ్ర నష్టం

నాకున్న ఎకరా మామిడి తోటలో గత ఏడాది వర్షాల వల్ల మొత్తం కాయ రాలింది. ఈసారి రూ.50 వేలు పెట్టుబడి పెట్టాను. పూత, కాత బాగుండడంతో ఆదాయం వస్తుందనుకున్నాను. శనివారం పడిన వడగళ్ల వానకు కాయంతా నేలరాలింది.

 వరంగల్‌ జిల్లా నర్సంపేట శివారులోని మాదన్నపేట రైతు వెంకటేశ్వర్లు ఆవేదన..


రూ.2 లక్షలతో మూడెకరాల మామిడితోటను కౌలుకు తీసుకొన్నాం. మరో నెల రోజుల్లో కాయను తెంపి మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముదామనుకున్నాం. అకాల వర్షంతో పంటంతా రాలిపోయింది.

 మహబూబాబాద్‌ జిల్లా మడిపల్లికి చెందిన సమ్మయ్య ఆందోళన


షడ్రుచుల పండగ ఉగాది ముంగిట మామిడి రైతుకు చేదే మిగిలింది. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురు గాలులు అన్నదాతలకు తీరని విషాదాన్ని మిగిల్చాయి. మరో నెలరోజుల్లో మామిడి కాయలు చేతికొస్తున్న తరుణంలో శుక్ర, శనివారాల్లో వారికి ఊహించని ఉత్పాతం ఎదురైంది. కాయలు దెబ్బతినడంతో పాటు చెట్ల కొమ్మలు విరిగాయి. మరికొన్ని నేలకూలాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో మామిడి దెబ్బతింది. కాయలు పిందె దశలోనే నేల రాలడంతో పాటు ఈదురుగాలుల వల్ల 10 వేలకు పైగా చెట్లు నేలకూలడంతో తీరని నష్టం కలిగింది. చెట్లకున్న కాయలే కాకుండా పూత కూడా రాలిపోవడంతో మళ్లీ కాతకు అవకాశం లేదు. కరీంనగర్‌ జిల్లాలో 3,501 ఎకరాలు, నల్గొండ 2,913, ఖమ్మం 2,912, వరంగల్‌ 2,910, మహబూబాబాద్‌ 2,500, జగిత్యాల 1,921, భద్రాద్రి 1,823, పెద్దపల్లి 1,211, సంగారెడ్డి 1,031, సూర్యాపేట 1,029,  వికారాబాద్‌ 980, జనగామ 901, మహబూబ్‌నగర్‌లో 912 ఎకరాల్లో పంట దెబ్బతింది. మామిడి రైతుల్లో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులే. వీరిలో 35 శాతం మంది యజమానులు.. మిగిలిన రైతులంతా కౌలుదారులు. అకాల వర్షాలతో వారు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఏర్పడింది. వరంగల్‌ జిల్లాలో 34 వేల ఎకరాలు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో 11 వేల ఎకరాల్లో మామిడి సాగు ఉండగా.. అందులో 50 శాతం మేరకు దిగుబడిని నష్టపోయే ప్రమాదం ఉంది. అకాల వర్షాల ప్రభావం, వాతావరణంలో మార్పుల వల్ల ఈసారి మామిడి దిగుబడి నాణ్యత, పరిమాణాన్ని దెబ్బతీయనుంది. ఇది మిగిలిన కాతపై ప్రభావం చూపనుంది. చీడపీడలు పెరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లో మామిడి నష్టాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలుసుకున్నారు. ఇతర ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ, ఉద్యానాధికారులు రాష్ట్రవ్యాప్తంగా మామిడి తోటల్లో పర్యటించి నష్టాలను అంచనా వేస్తున్నారు.

మొక్కజొన్న, వరికి తీవ్ర నష్టం

రాష్ట్రంలో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. వరుసగా మూడోరోజూ పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. శనివారం ఒక్కరోజే వరంగల్‌, మహబూబాబాద్‌, జనగామ, కరీంనగర్‌ జిల్లాల్లో 60 వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో మొక్కజొన్న, వరి అధికం. మిరప, టమాటా కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. వరంగల్‌ జిల్లాలో 22,693 ఎకరాల్లో మొక్కజొన్న, 7130 ఎకరాల్లో వరి పంటలకు నష్టం వాటిల్లింది. జనగామ జిల్లాలో 9 మండలాలు 67 గ్రామాలు తీవ్రంగా నష్టానికి గురయ్యాయి. 3950 ఎకరాల్లో వరి, 1600 ఎకరాల్లో మొక్కజొన్న, 375 ఎకరాల విస్తీర్ణంలో మిర్చి పంటలకు నష్టం సంభవించినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మహబూబాబాద్‌ జిల్లాలో 250 గ్రామాల్లోని రైతులు నష్టపోయారు. ఇక్కడ 4800 ఎకరాలలో వరి, 6600 ఎకరాల్లో మొక్కజొన్న, 3500 ఎకరాల విస్తీర్ణంలో మిర్చి పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.


సంగారెడ్డి జిల్లా మనియార్‌పల్లికి చెందిన రైతు రాజ్‌కుమార్‌ ఏడాది కిందట 12 ఎకరాల మామిడి తోటకు రూ.5 లక్షల పెట్టుబడి పెట్టారు. ఇన్నాళ్లూ 1500 చెట్లను కంటికి రెప్పలా కాపాడుకున్నానని ఆయన అన్నారు. పంట దెబ్బతినడంతో.. ఇప్పుడు ఉన్న జీవనాధారం కాస్తా పోయిందని ఆవేదన చెందారు. ప్రభుత్వం పరిహారం అందించి సాయం చేయాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని