లీకేజీలో మరికొందరు!

ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వేడెక్కుతోంది. గ్రూప్‌-1 ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్‌రెడ్డి ముఠా అనేక మందికి అమ్మినట్లు సిట్‌ భావిస్తోంది.

Published : 20 Mar 2023 04:41 IST

100 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన గ్రూప్‌-1 అభ్యర్థుల జాబితా సిద్ధం
వీరిలో అనుమానితులను విచారించనున్న సిట్‌
విదేశాల్లో ఉన్నవారికీ పిలుపు!
ఈనాడు - హైదరాబాద్‌

ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వేడెక్కుతోంది. గ్రూప్‌-1 ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్‌రెడ్డి ముఠా అనేక మందికి అమ్మినట్లు సిట్‌ భావిస్తోంది. ప్రస్తుతం ఎవరెవరికి అందిందనేది నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 100కు పైగా మార్కులు సాధించిన గ్రూప్‌-1 అభ్యర్థుల జాబితా రూపొందించిన సిట్‌ అధికారులు వారిలో అనుమానితులను విచారించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు నిందితుల ఫోన్లు, ఇతర డిజిటల్‌ ఉపకరణాలను జల్లెడ పడుతుండగా... మరోవైపు సిట్‌లోని ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తోంది...

టౌన్‌ప్లానింగ్‌ పరీక్ష ప్రశ్నపత్రంతో మొదలైన లీకేజీ ప్రభావం చివరకు గత అక్టోబరు నుంచి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన అన్ని పరీక్షలపై పడింది. మొత్తం ఏడు పరీక్షల్లో నాలుగింటిని కమిషన్‌ రద్దు చేసింది. ప్రశ్నపత్రాలు ఉంచిన కంప్యూటర్‌ను రాజశేఖర్‌రెడ్డి అక్టోబరులోనే యాక్సెస్‌ చేసినట్లు సిట్‌ దర్యాప్తులో వెల్లడి కావడమే ఇందుకు కారణం. ఈ పరీక్షల్లో గ్రూప్‌-1 ప్రధానమైంది. అక్టోబరు 16న ఈ పరీక్ష నిర్వహించగా అంతకు ముందే రాజశేఖర్‌రెడ్డి కాన్ఫిడెన్షియల్‌ విభాగంలో ఉన్న కంప్యూటర్‌ను యాక్సెస్‌ చేశాడు. విషయం నిర్ధారణ అయిన తర్వాతే గ్రూప్‌-1 పరీక్షను రద్దుచేశారు. అయితే పోలీసులను తప్పుదారి పట్టించేందుకు నిందితులు తొలుత ఏఈ, టౌన్‌ప్లానింగ్‌ ప్రశ్నపత్రం మాత్రమే లీక్‌ చేసినట్లు చెప్పారు. సిట్‌ దర్యాప్తులో గ్రూప్‌-1తో పాటు ఇతర పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా బయటకు వచ్చినట్లు తేలడంతో వాటిద్వారా ఎవరెవరు లబ్ధి పొందారన్నది ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా గ్రూప్‌-1 పరీక్షలో వందకుపైగా మార్కులు సాధించిన వారితో అధికారులు ఓ జాబితా తయారుచేశారు. వారిలో అనుమానితులను విచారించాలని భావిస్తున్నారు. జాబితాలో ఉన్నవారికి, రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌లకు మధ్య ఏమైనా ఫోన్‌ సంభాషణలు జరిగాయా, ఛాటింగ్‌ చేశారా? అన్న విషయాలను నిర్ధారించుకుంటున్నారు. దీనికోసం ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి ఫోన్లలో అక్టోబరు నుంచి వాట్సప్‌ ఛాటింగ్‌ వివరాలను తెప్పించుకుంటున్నారు. వీరిద్దరూ ఆరు నెలలుగా ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు... వారిలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారెవరున్నారు? తదితర వివరాలన్నీ సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు సేకరిస్తున్నారు. దీంతోపాటు అనుమానిత అభ్యర్థుల బ్యాంకు లావాదేవీలను కూడా వడ పోస్తున్నారు. సిట్‌ రూపొందించిన జాబితాలో కొందరు విదేశాల్లో నివాసం ఉంటున్న వారు కూడా ఉన్నారని, ఈ పరీక్ష కోసమే రాష్ట్రానికి వచ్చి... తిరిగి వెళ్లిపోయారని, పరీక్షలో అర్హత కూడా సాధించారని వెల్లడయింది. వీరిలో కొందరి ఫోన్లు అకస్మాత్తుగా స్విచ్చాఫ్‌ అయ్యాయని కూడా తెలుస్తోంది. ఆధారాలన్నీ కొలిక్కివచ్చిన తర్వాత వీరందరినీ పిలిపించి విచారించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఒక నిర్ణయానికి రానున్నారు. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తు ప్రకారం గ్రూప్‌-1 పరీక్ష లీక్‌ అయినట్లే భావిస్తున్నామని,  లబ్ధిపొందిన వారిని గుర్తించి వారందరిపైనా కేసులు పెట్టడం ఖాయమని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని