సుస్థిరం.. తెలంగాణ ప్రభుత్వం

‘శోభకృత్‌’ నామ తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను బుధవారం నగరంలోని రవీంద్రభారతి ప్రధాన మందిరంలో ఘనంగా నిర్వహించారు.

Published : 23 Mar 2023 04:07 IST

పంచాంగ పఠనంలో వేద పండితుడి వెల్లడి
రవీంద్రభారతిలో ఘనంగా ఉగాది వేడుకలు

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: ‘శోభకృత్‌’ నామ తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను బుధవారం నగరంలోని రవీంద్రభారతి ప్రధాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం సుస్థిర పరిపాలన అందిస్తుందని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కరలేదని స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనాల కోసం బృహత్‌ కార్యక్రమాల రూపకల్పనకు ప్రభుత్వరంగ నిపుణులు కసరత్తులు చేస్తారని.. ఇంతకాలం ఆగిపోయిన పనులు, పెండింగ్‌ బిల్లులన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. ప్రధానంగా ‘స్వవర్గంలో’ కొందరు వ్యక్తుల నుంచి వ్యతిరేకతలు వచ్చే అవకాశం లేకపోలేదని.. ఈ విషయంలో ‘రాజు’ చాలా జాగ్రత్తగా ఉండాలని పంచాంగం సూచిస్తోందన్నారు. ఇక్కడ రాజు చదువుకున్నవారు, చాలా విషయాలపై అవగాహన ఉన్నవారు, సమర్థులు కావడంతో అటువంటి విపరీత ధోరణులను అణిచివేసే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ ఏడాది కాళేశ్వరం, నాగార్జునసాగర్‌, శ్రీశైలం.. ఇలా అన్ని డ్యామ్‌లు నిండుకుండలా మారబోతున్నాయని, పాడిపంటలతో రాష్ట్రం శోభాయమానంగా వర్ధిల్లబోతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌, ప్రభుత్వ విప్‌ భానుప్రసాద్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కాలేరు వెంకటేశ్‌, రసమయి బాలకిషన్‌, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌ గుప్తా, బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సముద్రాల వేణుగోపాలాచారి, సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, సంగీత నాటక అకాడమీ ఛైర్మన్‌ దీపికారెడ్డి, పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌ గుప్తా, ఆబ్కారీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గజ్జెల నగేష్‌, డీజీపీ అంజనీకుమార్‌, నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌, ఐఏఎస్‌ అధికారి సందీప్‌కుమార్‌ సుల్తానియా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, దేవాదాయశాఖ కమిషనర్‌ అనీల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం ముద్రించిన శోభకృత్‌ నామ సంవత్సర పంచాంగాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని