వైభవంగా ‘శోభకృత్‌’ ఉత్సవాలు

శోభకృత్‌ నామ సంవత్సరాది వేడుకలను వివిధ పార్టీ కార్యాలయాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో మంగళంపల్లి శ్రీనివాసశర్మ పంచాంగ పఠనం చేశారు.

Published : 23 Mar 2023 05:35 IST

ఈనాడు, హైదరాబాద్‌:  శోభకృత్‌ నామ సంవత్సరాది వేడుకలను వివిధ పార్టీ కార్యాలయాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో మంగళంపల్లి శ్రీనివాసశర్మ పంచాంగ పఠనం చేశారు. కొత్త సంవత్సరంలో ధరల హెచ్చుతగ్గులు మినహా మిగిలినవన్నీ శుభ ఫలితాలే ఉంటాయని తెలిపారు. మాగాణి, మెట్ట పంటలు బాగా పండుతాయని.. నిత్యావసర వస్తువులు, నూనె వస్తువుల ధరలు బాగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.


కాంగ్రెస్‌ కార్యాలయంలో..

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: గాంధీభవన్‌లో వేద పండితుడు చిలుకూరు శ్రీనివాసమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించి.. పంచాంగం పఠించారు. కాంగ్రెస్‌ పార్టీని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరింత శోభాయమానంగా ముందుకు తీసుకెళ్తారని.. ఆయనకు అందరూ సహకరించాలని అన్నారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల వారికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో నాయకులు పొన్నాల లక్ష్మయ్య, మహేశ్‌కుమార్‌గౌడ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, టి.కుమార్‌రావు, సుదర్శన్‌రెడ్డి, సంపత్‌కుమార్‌, మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెదేపా కార్యాలయంలో..

ఈనాడు, హైదరాబాద్‌: తెదేపా కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో బుధవారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. నాయకంటి మల్లికార్జునశర్మ పంచాంగ పఠనం చేశారు. ఈ సంవత్సరం తెలంగాణలో పార్టీకి సానుకూల వాతావరణం ఉంటుందని చెప్పారు.కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసానిజ్ఞానేశ్వర్‌, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర సమన్వయకర్త కంభంపాటి రాంమోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్‌ బియ్యని సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడిని ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు