సంక్షిప్త వార్తలు(3)

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని టవర్‌ సర్కిల్‌ ప్రాంతంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రధాన కార్యాలయంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది.

Updated : 23 Mar 2023 05:41 IST

కరీంనగర్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని టవర్‌ సర్కిల్‌ ప్రాంతంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రధాన కార్యాలయంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.కోటి వరకు నష్టం జరిగినట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్యాలయంలో నెట్వర్కింగ్‌కు సంబంధించిన స్విచ్‌ విభాగాన్ని చల్లగా ఉంచేందుకు ఏర్పాటు చేసిన ఏసీల్లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పైఅంతస్తుకు వ్యాపించాయి. సెలవు దినం కావడంతో కొద్దిమంది సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మంటలు పూర్తిగా వ్యాపించకముందే వారు సురక్షితంగా బయటికి వచ్చేశారు. అగ్నిమాపక సిబ్బంది సుమారు గంట పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.


ఘనంగా 24 గంటల కథా మారథాన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచ కథా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికాలోని బీ ప్లస్‌ విత్‌ భాస్కర్‌ ఛానెల్‌, యూట్యూబ్‌ వేదిక ద్వారా 24 గంటల కథా మారథాన్‌ను ఈనెల 19, 20 తేదీల్లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి, వంగూరి చిట్టెన్‌రాజు, ఓలేటి పార్వతీశం, సత్యం మందపాటి, పొత్తూరి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 దేశాల నుంచి దాదాపు 126 మంది కథకులు వారి కథలను ఆన్‌లైన్‌లో వినిపించారు. ఈ కథాకళతోపాటు ప్రముఖ కార్టూనిస్ట్‌ కూచి సాయిశంకర్‌ చిత్ర కళా నైపుణ్యం అబ్బుర పరిచింది. ఒక్కో కథ వింటూ అప్పటికప్పుడు కథాసారాన్ని ప్రతిబింబించే చిత్రాలను వేయడం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఇలాంటి ప్రయత్నం ఇప్పటివరకు ఎవరూ చేయలేదని, కథ-కళ కలిపి సమ్మేళనాన్ని నిర్వహించడం ఇదే తొలిసారని బీ ప్లస్‌ విత్‌ భాస్కర్‌ ఛానెల్‌ ప్రతినిధులు తెలిపారు.


క్రిమినల్‌ కేసు ఉంటే కోర్టు అనుమతితోనే పాస్‌పోర్టు పునరుద్ధరణ

స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు

ఈనాడు, అమరావతి: క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉన్న సంబంధిత కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) సమర్పించాల్సిన అవసరం లేకుండానే పాస్‌పోర్టును పునరుద్ధరించేలా(రెన్యువల్‌) పాస్‌పోర్టు అధికారులను ఆదేశించాలని పిటిషనర్లు చేసిన అభ్యర్థనను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. విచారణ కోర్టు ఇచ్చిన ఎన్‌వోసీ/అనుమతి ఉత్తర్వులను సమర్పించాకే పిటిషనర్ల పాస్‌పోర్టును పునరుద్ధరించే వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారులను ఆదేశించింది. మరోవైపు న్యాయస్థానం అనుమతి ఉత్తర్వులిచ్చాక కూడా కోర్టులో క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉందనే ఒక్క కారణంతో పాస్‌పోర్టును పునరుద్ధరించకుండా ఉండటానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఇప్పటికే భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లిన పిటిషనర్లు, లేదా విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు ఎన్‌వోసీ కోసం క్రిమినల్‌ కోర్టులను ఆశ్రయించాలని సూచించింది. ఆయా కేసులోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని చట్ట  తగిన ఉత్తర్వులివ్వాలని విచారణ కోర్టులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, సంబంధిత కోర్టు నుంచి ఎన్‌వోసీ తీసుకురావాలంటూ పాస్‌ పోర్టులను రెన్యువల్‌ చేయక పోవడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. పాస్‌పోర్టు మొదటిసారి జారీచేసే సమయంలోనే క్రిమినల్‌ కేసులను పరిగణనలోకి తీసుకోవాలి తప్ప రెన్యువల్‌ విషయంలో కాదన్నారు. పాస్‌పోర్టు అధికారుల తరఫున కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ పాస్‌పోర్టు చట్టం ప్రకారం క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉంటే పునరుద్ధరణను తిరస్కరించవచ్చన్నారు. దేశం విడిచి వెళ్లేందుకు అభ్యంతరం లేదని కోర్టు నుంచి ఎన్‌వోసీ తెస్తే పునరుద్ధరణను పరిశీలిస్తారన్నారు. ఇరుపక్షాల వాదనలూ విన్న న్యాయమూర్తి సంబంధిత కోర్టు నుంచి ఎన్‌వోసీ తెచ్చుకుంటేనే పాస్‌పోర్టు రెన్యువల్‌ తిరస్కరణకు గురికాకుండా మినహాయింపు ఉందని తెలిపారు. పాస్‌పోర్టు మొదటిసారి జారీ విషయంలో ఉన్న అధికారాలే రెన్యువల్‌ విషయంలోనూ ఉంటాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని